యాపిల్ నుంచి గుమ్మడికాయ వరకు.. రోజూ ఏవైనా ఓ రెండురకాల పండ్లు, మూడురకాల కూరగాయలు తీసుకుంటే చాలు.. మీ జీవితకాలాన్ని మరికొంత పొడిగించుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ సభ్యుడు డాంగ్ వాంగ్ నిర్వహించిన తాజా అధ్యయనంలో నిత్యం రెండు పండ్లు, మూడు కూరగాయలు తినేవారు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నట్టు తేలింది. పండ్లు తినడం వల్ల అనారోగ్యంతో మరణించే ప్రమాదం 13 శాతం తగ్గిందని తేల్చారు డాంగ్వాంగ్. అంతేకాదు క్యాన్సర్ చావులు పది శాతం, హృద్రోగ సమస్యలు పన్నెండు శాతం, శ్వాసకోశ రుగ్మతలు ముప్పై అయిదు శాతం తగ్గాయి. రోజూ ఒకే రకమైన పండ్లు, కూరగాయలు కాకుండా.. మార్చిమార్చి తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆకుకూరలు, పుల్లని పండ్లు, బెర్రీలు, కూరగాయల వంటివి అకాల మరణాలను నిలువరించేందుకు దోహదపడతాయని డాంగ్వాంగ్ అధ్యయనం నిర్ధారించింది.