తిండి విషయంలో పిల్లల భావోద్వేగాన్ని దృష్టిలో ఉంచుకోవాలని తాజా అధ్యయనాలు నిరూపించాయి. ప్రతికూల భావోద్వేగాలు ఉన్నప్పుడు పిల్లలు అధిక కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకురాలు క్రిస్టీన్ హోటారు తేల్చారు. మూడు నుంచి ఆరు తరగతులు చదివే రెండొందలమంది పిల్లల మీద ఆమె ఓ అధ్యయనం చేశారు. యాప్ ద్వారా రోజుకు ఏడుసార్లు పిల్లల ఆహారపు అలవాట్లను రికార్డు చేశారు. ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు, మరీ బాధగా ఉన్నప్పుడు పిల్లలు వేయించిన ఆహార పదార్థ్థాలు, స్వీట్లు, తీపి పానీయాలను ఎక్కువగా తీసుకుంటున్నారట. బడికి వెళ్లేటప్పుడు అమ్మ పెట్టే స్నాక్స్, భోజనం తింటున్నా.. వారాంతాల్లో నెగెటివ్ ఫుడ్కు ప్రాధాన్యం ఇస్తున్నారట. దీనివల్ల చిన్న వయసులోనే ఊబకాయానికి గురవుతున్నారట. కాబట్టి, తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక స్థితిని గుర్తించి.. ప్రేమ పూర్వకంగా పోషకాహారాన్ని అందించాలని నిపుణులు కోరుతున్నారు.