విలన్లు హీరోలుగా ఎదగడం.. హీరోలు విలన్లుగా రాణించడం.. వెండితెరపై మామూలే! హీరోలకే కాదు హీరోయిన్లకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఒకప్పుడు సినీకావ్య కన్యకలుగా అలరించిన కథానాయికలు.. ఇప్పుడు సరికొత్త పాత్రల్లో కనువిందు చేస్తున్నారు. రీ ఎంట్రీ పేరుతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రేక్షకులకు నోస్టాలజీ ఫీలింగ్ కలిగించి సినిమాకు గ్రాండ్ ఓపెనింగ్స్ తీసుకురావడంలోనూ సక్సెస్ అవుతున్నారు.
ఇతర రంగాల్లో ఏమో గానీ, సినిమాల్లో పునరాగమనం సాధారణమే! ఒకప్పుడు స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుని కాలం కలిసిరాక సినిమాలకు దూరమైనవాళ్లు కోకొల్లలు. కొంత గ్యాప్ తర్వాత
రీ ఎంట్రీ పేరుతో పోయిన చోటే వెతుక్కోవాలని వచ్చిన వాళ్లూ ఉన్నారు. చాలామంది పాతతరం హీరోలు, హీరోయిన్లు రీ ఎంట్రీ ఇచ్చినవాళ్లే! అంతెందుకు పార్వతిగా పలకరించి, మాయాశశిగా అలరించి, సైరంధ్రిగా మెప్పించిన మహానటి సావిత్రి పునరాగమనం తర్వాత ఎన్నో సినిమాల్లో తల్లి పాత్రలు పోషించింది. వెండితెరపై తళుకులీనిన భామలు.. బామ్మలుగా రాణించిన చరిత్ర కూడా ఉంది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందిన భానుమతి.. బామ్మపాత్రలోనూ అదే జోరు కొనసాగించింది. అందం, అభినయంతో హీరోలకు దీటుగా నిలిచిన నవలా నాయిక వాణిశ్రీ రీ ఎంట్రీలోనూ తనస్థాయికి తగ్గ పాత్రలు పోషించింది. పునరాగమనం తర్వాత కాల్షీట్లు ఖాళీ లేనంతగా బిజీ అయిన నటి శారద. ఇలా ఎందరో నాయికలు గ్యాప్ తర్వాత వయసుకు తగ్గ పాత్రల్లో మెప్పించారు. పాతికేండ్ల కిందట పరిశ్రమను ఉర్రూతలూగించిన కథానాయికలు తాజాగా సినిమాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో కొన్నాళ్లపాటు సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించాలనే ఉద్దేశం ఉన్నవాళ్లు కొందరైతే, సరదాగా నటిస్తున్నామని చెబుతున్నవాళ్లు మరికొందరు. వారి లక్ష్యాల సంగతి అటుంచితే, ఒకప్పుడు తమను అలరించిన కలల రాణులు మళ్లీ వెండితెరపై సాక్షాత్కరించడంతో పాతతరం అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
అతిశయం అచ్చెరువొందేలా..
ప్రపంచ సుందరిగా అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన నటి ఐశ్వర్యారాయ్. 1997లో విడుదలైన ‘ఇరువర్’ సినిమా మొదలు 2010 వరకూ తీరిక లేకుండా చిత్రాలు చేస్తూ వచ్చింది. తర్వాత ఒకట్రెండు సినిమాల్లో నటించినా, నాలుగేండ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నది. తాజాగా మణిరత్నం దర్శకత్వం వహించిన ‘పీఎస్-1’ సినిమాలో నందినిగా అచ్చెరువొందే అందంతో అలరించింది. 50 ఏండ్లకు చేరువ అవుతున్నా ఐశ్ సొగసు వన్నె తగ్గలేదన్న పొగడ్తలు వెల్లువెత్తాయి. ఈ సినిమాలో ఆమెది ద్విపాత్రాభినయం కావడం విశేషం. ‘పీఎస్-2’లో రెండోపాత్ర ప్రాధాన్యం ఉంటుందని మొదటి చిత్ర పతాక సన్నివేశాలు స్పష్టం చేశాయి. అయితే, ఐశ్వర్య సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తుందన్న విషయంపై ఇప్పటికైతే ఎలాంటి స్పష్టతా లేదు. ‘పొన్నియిన్ సెల్వన్’ భారీ ప్రాజెక్ట్ కావడం, అందులోనూ తన అభిమాన దర్శకుడు మణిరత్నం సినిమా అవడంతో ఆమె ఒప్పుకొందని ఇండస్ట్రీ టాక్. అయితే, ఐశ్వర్య నటన కొనసాగించాలని ఆమె అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
ఒక లైలా కోసం..
‘మాఘమాసం ఎప్పుడొస్తుందో..’ అంటూ 90వ దశకం చివర్లో కుర్రకారును తనవైపు తిప్పుకొన్న నటి లైలా. తర్వాత తెలుగు, తమిళం, కన్నడం ఇలా దక్షిణాది భాషల్లో దాదాపు 40 చిత్రాల వరకు నటించింది. మళ్లీ 15 ఏండ్ల గ్యాప్ తర్వాత కార్తి హీరోగా నటించిన ‘సర్దార్’ సినిమాలో కీలక పాత్ర పోషించింది లైలా. నిడివి తక్కువే అయినా.. కనిపించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఆమె అభిమానులు ‘సర్దార్’ సినిమాను లైలా కోసమే చూశామని చెప్పుకొచ్చారు. అంతేకాదు, లైలా రెండో ఇన్నింగ్స్కు గ్రాండ్ లాంచింగ్ ప్యాడ్ దొరికిందని సంబురపడుతున్నారు. ఇప్పటికే పలువురు దర్శకులు లైలాను సంప్రదిస్తున్నారట. అదే నిజమైతే రానున్న రోజుల్లో వెటరన్ లైలా రీ జర్నీ సాఫీగా సాగుతుందని అనుకోవచ్చు!
అడపాదడపా అమల
బోటనీ పాఠం కన్నా.. మ్యాటనీ ఆట కన్నా.. అమల నటించిన సినిమా ‘ద బెస్ట్’ అనుకునేవాళ్లు అప్పట్లో. అక్కినేని కోడలయ్యాక ఆమె వెండితెరకు దాదాపు దూరమైంది. 1993లో ‘ఆగ్రహం’ సినిమాలో హీరోయిన్గా చేసిన ఆమె 20 ఏండ్ల విరామం తర్వాత 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో కనిపించింది. అమల సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందని అనుకున్నారంతా! అయితే, మళ్లీ పదేండ్ల గ్యాప్ తర్వాత ఇటీవల ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో మళ్లీ కనిపించింది. ఆ చిత్రంలో హీరో శర్వానంద్కు తల్లిపాత్రలో అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించింది. ఆమె అభిమానులు మాత్రం అమల
రెగ్యులర్గా సినిమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నారు.
వెల్కమ్.. హా బేబీ!
‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రంభ. ఒకట్రెండు సినిమాల తర్వాత స్టార్ హీరోయిన్ రేసులోకి వచ్చేంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్రహీరోల సరసన నటించింది. తన లుక్స్తో అప్పటి యువతరాన్ని ఉర్రూతలూగించిన రంభ పునరాగమనానికి రంగం సిద్ధం చేసుకుంటున్నదని ఇండస్ట్రీ టాక్. 2007లో విడుదలైన దేశముదురు, యమదొంగ సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నర్తించిన ఆమె, ఆ తర్వాత సినిమాలకు దాదాపు ఫుల్స్టాప్ పెట్టేసింది. మళ్లీ ఇన్నాళ్లకు ఓ భారీ ప్రాజెక్ట్కు ఓకే చెప్పిందట. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో నిర్మాణం అవుతున్న సినిమాలో రంభ కీలక పాత్ర పోషిస్తున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. వెటరన్ నటులకు అవకాశాలు ఇవ్వడం త్రివిక్రమ్కు కొత్తేం కాదు. నదియా, టబు, స్నేహ తదితర మాజీ హీరోయిన్లు త్రివిక్రమ్ సినిమాల్లో కీలక పాత్రల్లో అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రంభకు కూడా అదేస్థాయి పాత్ర సిద్ధం చేసి ఉంటాడని ఆమె అభిమానులు సంబురపడుతున్నారు.
మరికొందరు..
ఒకప్పుడు బాలనటిగా, తర్వాత హీరోయిన్గా అలరించిన తులసి ఇప్పుడు తల్లిపాత్రలకు కేరాఫ్గా నిలుస్తున్నది. నటి సంగీత ‘సరిలేరు నీకెవ్వరు’లో కథానాయిక తల్లిగా రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మరో రెండు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నది.‘యువకుడు’ సినిమాతో యువతను తనవైపు తిప్పుకొన్న భూమిక తరచూ ఏదో ఒక సినిమాలో కనిపిస్తున్నది. కథలో కీలక భూమిక కలిగిన పాత్రలు ఆమెను పలకరిస్తున్నాయి. గాలి జనార్దన్ కొడుకు కిరీటిని హీరోగా పరిచయం చేస్తున్న సినిమాలో ప్రత్యేక పాత్రతో జెనీలియా రీ ఎంట్రీ ఇవ్వనుంది. హీరో రామ్, బోయపాటి శ్రీను తాజా సినిమాలో ప్రత్యేక పాత్రకు మీరా జాస్మిన్ ఎంపికైందని వార్తలు వినిపిస్తున్నాయి. ఖుష్బూ, రాధిక, సుహాసిని తదితర వెటరన్ నటీమణులు కెరీర్కు కామాలు పెడుతున్నారే కానీ, ఫుల్స్టాప్ పెట్టే ఆలోచన లేదంటున్నారు.