రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో లోకానికి చూపింది సినిమానే! రామాయణ కావ్యాన్ని హృద్యంగా తెరకెక్కించిన ఘనత సినిమాకే దక్కుతుంది! మహాభారతంలోని మర్మాలన్నీ విడమరచి వివరించిందీ సినిమానే! వేల్పుల కథలు వెండితెరపై వెలగడం ఎప్పట్నుంచో ఉన్నదే! అయితే, బ్లాక్ అండ్ వైట్ రోజుల నాటి పౌరాణిక చిత్రాల ట్రెండ్ ఇప్పుడు మళ్లీ పురుడు పోసుకుంటున్నది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు లెక్కించదగ్గ స్థాయిలో పలు పౌరాణిక చిత్రాలు సెట్స్పై సందడి చేస్తున్నాయి. రామాయణ, మహాభారతాలను విజువల్ వండర్స్గా తీర్చిదిద్దే పనిలో దర్శక, నిర్మాతలు బిజీగా ఉన్నారు.
పౌరాణిక సినిమాలకు టాలీవుడ్ పెట్టింది పేరు. మూకీ రోజుల్లో పురాణగాథలే ప్రధాన ఇతివృత్తాలుగా ఉండేవి. టాకీ వచ్చాక కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతూ వచ్చింది. ఎన్టీఆర్ తెలుగువారి ఆరాధ్య నటుడు అనిపించుకోవడానికి ఆయన పోషించిన పౌరాణిక పాత్రలే ప్రధాన కారణం. ‘లవకుశ’, ‘మాయాబజార్’, ‘నర్తనశాల’, ‘శ్రీకృష్ణ పాండవీయం’, ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ తదితర సినిమాలు ఆపాత మధురాలుగా నిలిచిపోయాయి. తర్వాతి కాలంలోనూ.. ఎప్పుడు పౌరాణిక సినిమాలు తెరకెక్కినా నిర్మాతలకు కాసుల వర్షం కురవాల్సిందే. పౌరాణికాలకు నాటకీయతను జోడించి సోషియో ఫాంటసీ పేరుతో వచ్చిన సినిమాలూ విజయం అందుకున్నాయి. ఆనాటి ‘యమగోల’ నుంచి ఈనాటి ‘యమదొంగ’ వరకు యమహిట్లు సాధించాయి.
సృజనాత్మకత పేరుతో..
ఇటీవల ఇతిహాసాలే ఇతివృత్తంగా సినిమాలు నిర్మించడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. కొన్నేండ్ల కిందటివరకు చారిత్రక సినిమాలపై సవారీ చేసిన బాలీవుడ్ ఇప్పుడు పౌరాణిక చిత్రాల పల్లవిని ఎత్తుకుంది. ఏకకాలంలో నాలుగైదు పౌరాణిక చిత్రాలు సిద్ధమవుతుండటం ఇందుకు కారణం. అయితే, పాతకథను కొత్తగా చూపించాలనే తాపత్రయంతో గ్రాఫిక్స్పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. సృజనాత్మకత పేరుతో మూలకథను మార్చేస్తున్నారని సినిమా విడుదలకు ముందే.. పెదవివిరిచే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
పౌరాణిక చిత్రాలు నిర్మించే క్రమంలో కథలో కాస్తో కూస్తో మార్పులు చేయడం ఎప్పట్నుంచో ఉన్నదే! మయసభలో దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్విందన్నట్టు చూపించినా, సీతమ్మ రక్షణ కోసం లక్ష్మణస్వామి బాణంతో మూడు రేఖలు గీశాడని చిత్రీకరించినా.. ఏదో ఓ కావ్యాన్ని ఆధారంగా చేసుకునేవారు. అంతెందుకు ‘శశిరేఖా పరిణయం’ వ్యాసభారతంలో లేనప్పటికీ, దాని చుట్టూ కథను అల్లుకొని ‘మాయాబజార్’ తీశారంటే ఆశ్చర్యం కలగకమానదు. క్రియేటివిటీ పేరుతో చేసే ప్రయోగాలు.. ఎవరి మనోభావాలనూ దెబ్బతీయనంత వరకూ ఏ ఇబ్బందీ లేదు. కానీ, వినోదం పేరుతో పౌరాణిక పాత్రల ఔచిత్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం మాత్రం సృజనాత్మకత అనిపించుకోదు. ఇటీవల ‘థ్యాంక్ గాడ్’నూ ఇదే అంశంపై ప్రేక్షకులు బ్యాన్ చేశారు. కొన్నిసార్లు వివాదానికి రాజకీయ రంగూ పూస్తున్నారు.
రాముడిగా రణ్బీర్ కపూర్
బాలీవుడ్లో మరో ‘రామాయణం’ తెరకెక్కుతున్నట్టు ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెల కొన్నాయి. తెలుగు నిర్మాత ఒకరు ఈ ప్రాజెక్టులో భాగం అయ్యారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ‘దంగల్’, ‘చిచోరే’ వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన నితీశ్ తివారీ ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించనున్నాడు. రాముడి పాత్రకు రణ్బీర్కపూర్, రావణాసురుడి పాత్రకు హృతిక్రోషన్ను ఎంచుకున్నట్టు వార్తలొస్తున్నాయి. మొత్తం బడ్జెట్ రూ.750 కోట్లు అని టాక్. అది మరింత పెరిగే అవకాశమూ ఉందంటున్నారు. వచ్చే ఏడాది చివరికి నిర్మాణం పూర్తవుతుందని అంచనా.
మహాభారతం చుట్టూ..
వేదవ్యాసుడు జాతికి అందించిన పంచమ వేదం.. మహాభారతం. రకరకాల పాత్రలు, వాటి ప్రత్యేకతలు, వాటి మధ్య వైషమ్యాలు, రాజకీయాలు, యుద్ధాలు… భారతంలో ఏ పర్వం తీసుకున్నా ఓ సూపర్హిట్ సినిమాకు కావాల్సిన ముడిసరుకు లభిస్తుంది. అందుకే తెలుగులో మహాభారతాన్ని ఆధారంగా చేసుకొని పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. కొన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ బాలీవుడ్ ఆ సాహసం చేస్తున్నది. ‘అశ్వత్థామ’ సినిమాతో ద్రోణసుతుడి కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు ఆదిత్య. ఈ సినిమాలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు ‘పొన్నియిన్ సెల్వన్’తో చాలాకాలం తర్వాత హిట్ అందుకున్న విక్రమ్ మహాభారత కథతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సింహభాగం పూర్తయింది.
ఆర్ఎస్ విమల్ దర్శకత్వం వహిస్తున్న ‘మహావీర్ కర్ణ’లో భారీ తారాగణం నటిస్తున్నది. మరోవైపు మలయాళ హీరో మోహన్లాల్ కూడా ‘మహాభారతం’ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో ప్రకటించాడు. భీముడి కోణంలో మహాభారతాన్ని వివరించే కథతో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఈ చిత్ర నిర్మాణంపై ఇప్పుడు ఎలాంటి కబుర్లూ వినిపించడం లేదు. ‘యమదొంగ’ వంటి సోషియో ఫాంటసీ చిత్రంతో బంపర్ హిట్ సాధించిన రాజమౌళి తన కళల ప్రాజెక్ట్ మహాభారతమని పలు సందర్భాల్లో పేర్కొన్నాడు. అదే తన చివరి చిత్రం అవుతుందని కూడా చెప్పాడు. అయితే, ఎప్పుడు తీస్తాడనేది మాత్రం ఇప్పటివరకూ వెల్లడించలేదు జక్కన్న.
చిత్రగుప్తుడికి సూటు
అజయ్ దేవగణ్ చిత్రగుప్తుడిగా నటించిన చిత్రం ‘థ్యాంక్ గాడ్’. సోషియో ఫాంటసీగా తెరకెక్కిన ఈ సినిమాలో చిత్రగుప్తుడికి సూటూబూటూ వేయడం, కురచ దుస్తులు ధరించిన వనితలు ఆయన చుట్టూ ఉండటం వంటి దృశ్యాలు విమర్శలకు కారణమయ్యాయి. ‘దేవుళ్లు మాత్రం అప్పటిలాగే ఉంటారనుకుంటే ఎలా?’ అని ఆ చిత్ర దర్శకుడు ఇంద్రకుమార్ కామెంట్ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఫలితంగా సినిమా విమర్శలపాలైంది. బాక్సాఫీస్ దగ్గరా పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.
‘యమగోల’ సినిమాలోనూ చిత్రగుప్తుడి పాత్రను పలుచన చేసి చూపించిన తీరు అప్పట్లో విమర్శలకు దారితీసింది. విడుదలయ్యాక నిందలు మూటగట్టుకోవడం మాట అటుంచితే, ఇటీవల విడుదలైన ‘ఆదిపురుష్’ ట్రైలర్ ఆదిలోనే హంసపాదును ఎదుర్కొంది. వీఎఫ్ఎక్స్ పనితనంపై అభిమానులు పెదవివిరిచారు. రావణుడి ఆహార్యం, హనుమంతుడి తోలు కవచంపై పెద్దఎత్తున విమర్శలు చెలరేగాయి. సీత పాత్ర కట్టూబొట్టూ విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. యానిమేటెడ్ సినిమాగా రూపొందుతున్న ‘ఆదిపురుష్’ను విడుదల నాటికి మరెన్ని వివాదాలు చుట్టుముడతాయో ఏమో? పాత్రల ఆహార్యం విషయం పక్కనపెడితే, సృజనాత్మకత పేరిట సినిమా కథలో ఎలాంటి మార్పులు చేశారన్న స్పష్టత మాత్రం లేదు. మూలాలకు భంగం కలగనంత స్వేచ్ఛ ఎవరికీ అభ్యతరకరం కాకపోవచ్చు.
అపురూపం శాకుంతలం
ప్రత్యేకమైన సినిమాల రూపకర్తగా దర్శకుడు గుణశేఖర్కు పేరుంది. భారీ సెట్టింగ్లతోపాటు సన్నివేశాన్ని కళాత్మకంగా తెరకెక్కిస్తారన్న ఖ్యాతినీ మూటగట్టుకున్నాడు. తాజాగా ఆయన దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమా నిర్మాణం దాదాపు పూర్తయింది. మహాభారతం ఆదిపర్వంలోని దుష్యంతుడు, శకుంతల ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవమోహన్
నటించారు.