ప్రభాస్ తర్వాతి సినిమా ఎవరితో?యువ దర్శకుడితో..చిరంజీవి అప్కమింగ్ మూవీ ఎవరితో?యంగ్ డైరెక్టర్తో..ఎన్టీఆర్ తర్వాతి ప్రాజెక్ట్ ఎవరితో?కొత్త డైరెక్టర్తో..ప్రశ్నలు పాతవే అయినా, తాజాగా వినిపిస్తున్న సమాధానాలు మాత్రం ‘యువ దర్శకులు’ అనే!!అనుభవజ్ఞుల కంటే కొత్తదనంపై పట్టున్న యువ దర్శకుల వైపే మొగ్గు చూపుతున్నారు కథానాయకులు. వాళ్లు ‘యాక్షన్’ అనగానే సిన్సియర్గా సీన్లు చేస్తున్నారు. సీరియస్గా ఫైట్లు చేస్తున్నారు. బాక్సాఫీస్ రికార్డులు తిరగ రాస్తున్నారు. ఈ ట్రెండ్ పరిశ్రమకూ మంచిదే అంటున్నారు సినీ పండితులు.
రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. కథల మీద కథలు వింటున్నాడు. విన్నవన్నీ దాదాపు ఓకే చేస్తున్నాడు. అలా అంగీకరించిన సినిమాలన్నీ యంగ్ దర్శకుల ఖాతాలో పడినవే! చిరంజీవి మాత్రమే కాదు, యువ హీరోలు కూడా కొత్త దర్శకులనే నమ్ముకుంటున్నారు. ఆధునిక సాంకేతిక అంశాలపై పట్టు ఉండటం, ఈ తరం ప్రేక్షకుల నాడి తెలిసి ఉండటం.. వాళ్లకు కలిసొచ్చిన విషయం. కొత్తనీరు వస్తే.. పాతనీరు వెళ్లిపోవాల్సిందే. ఈ సూత్రీకరణ సినిమా ఇండస్ట్రీకీ నప్పుతుంది. ఎప్పటికప్పుడు కొత్త దర్శకులు రావడం, ఏదో కొత్తదనంతో ప్రేక్షకులను అలరించడం ఎప్పట్నుంచో మామూలే! 70వ దశకంలో అలా వచ్చి ఇండస్ట్రీలో పాతుకుపోయిన డైరెక్టర్లు ఎందరో. దర్శకరత్న దాసరి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు 70వ దశకం ముద్దుబిడ్డలే! అప్పుడున్న స్టార్హీరోలు సైతం ఈ దర్శకులతో సినిమాలు చేయడానికి పోటీపడ్డారు. వీళ్ల్ల డేట్లకు అనుగుణంగా తమ కాల్షీట్లు సర్దుబాటు చేసుకున్నారు. ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్బాబు, కృష్ణ వంటి కథానాయకులు ఎప్పటికప్పుడు ఈ యంగ్ దర్శకులకు అవకాశం కల్పిస్తూ, తమ ఖాతాలో సూపర్ హిట్లు వేసుకున్నారు. దశాబ్దాలు మారేకొద్దీ కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అవుతూనే ఉన్నా.. ఈ మధ్య కొత్తదనం కోరుకుంటున్న హీరోలంతా యంగ్ దర్శకులకే మా ఓటు అని ఫిక్సవుతున్నారు. అందుకు తగ్గట్టే ఇటీవల విడుదలైన పలు చిత్రాలు యువ దర్శకుల ప్రతిభకు గీటురాయిగా నిలిచాయి.
‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన నాగ్ అశ్విన్ రెండో చిత్రం ‘మహానటి’తో సత్తా చాటుకున్నాడు. ఈ డైరెక్టర్ ప్రతిభకు ప్రేక్షకులు సాహో అన్నారు. అదే జోరులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో సినిమా చాన్స్ కొట్టేశాడు నాగ్ అశ్విన్. వర్కింగ్ టైటిల్ ‘ప్రాజెక్ట్ కె’తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా దీపికా పదుకోన్ నటిస్తున్నది. ఈ యంగ్ దర్శకుడిపై నమ్మకంతో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ప్రాజెక్ట్లో భాగమయ్యాడు. ప్రేక్షకులకు కూడా భారీ అంచనాలే ఉన్నాయి.
దాదాపు పదేండ్ల విరామం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి మొదటి మూడు సినిమాలకు పాతకాపులనే నమ్ముకున్నాడు. ఇండస్ట్రీ టాక్తో తన పంథాను మార్చుకొని యంగిస్థాన్లకు అవకాశం కల్పించాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న మెగాస్టార్ సినిమాలన్నీ యువ దర్శకుల చేతుల్లో ఉన్నవే! మలయాళ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ చిత్రానికి మోహన్రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ చిత్రం ‘వేదళం’ రీమేక్ ‘బోళాశంకర్’కు దర్శకుడు మెహర్ రమేశ్.
‘వాల్తేరు వీరయ్య’గా ప్రచారంలో ఉన్న చిత్రానికి దర్శకుడిగా బాబీని ఎంచుకున్నాడు చిరంజీవి.
పాత మాటేమిటో కానీ, కొత్త ఎప్పుడూ వింతే! అందుకే కొత్త దర్శకులకు పెద్ద హీరోలు రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతున్నారు. పటాస్తో డైరెక్టర్గా పరిచయమైన అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్కు టాలీవుడ్ స్టార్లు ఫిదా అయ్యారు. ఒకరి తర్వాత ఒకరు ఆయనకు అవకాశాలు ఇస్తూ, విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. అనిల్ దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ రవితేజకు మంచి సక్సెస్ ఇచ్చింది. ‘ఎఫ్2’తో వెంకటేశ్ భారీ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ దర్శకుడిపై నమ్మకంతో ‘సరిలేరు నీకెవ్వరు’ విజయాన్ని ఆస్వాదించాడు మహేశ్బాబు. తాజాగా అనిల్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్3’తో పోస్ట్ కరోనాలో వెంకటేశ్, వరుణ్తేజ్కు మంచి విజయాన్ని అందించింది. ఈ చిత్ర విజయానందంలో ఉండగానే బాలకృష్ణ నుంచి పిలుపు అందుకున్నాడు అనిల్. ‘అంటే.. సుందరానికీ..’ దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా ఉత్సాహంగా అడుగులు వేస్తున్నాడు. ‘ఉప్పెన’ చిత్రంతో విభిన్నమైన దర్శకుడిగా రుజువు చేసుకున్న బుచ్చిబాబు.. తర్వాత చిత్రం జూనియర్ ఎన్టీఆర్తో అని ఇండస్ట్రీ టాక్. మొత్తానికి కొత్త దర్శకులు కొంగొత్త కథాంశాలతో దూసుకువస్తున్నారు. వారి స్పీడ్ను అందుకొని కథానాయకులు ఘన విజయాలు సొంతం చేసుకుంటున్నారు.
తెలుగింట దర్శకుల సంగతి ఇలా ఉంటే, పొరుగింటి డైరెక్టర్లు ‘అంతకుమించి’ అనిపించుకుంటున్నారు. గట్టిగా ఒక్క సినిమా హిట్టు కొట్టి, రెండో చిత్రంతోనే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తున్నారు. రెండో ప్రయత్నంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘కేజీఎఫ్’ సినిమా రేంజ్నే మార్చేసింది. ‘కేజీఎఫ్-2’ రికార్డు కలెక్షన్లు ప్రశాంత్ నీల్ సామర్థ్యాన్ని చాటిచెప్పాయి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ప్రశాంత్ దర్శకత్వం వహిస్తున్న ‘సలార్’ చిత్రంపై భారీ అంచనాలు నెల కొన్నాయి. ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్తో ప్రాజెక్ట్ కూడా త్వరలో పట్టాలెక్కనుంది. తన రెండో చిత్రం ‘ఖైదీ’తో ప్రేక్షకులను బందీ చేసిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఆయన ఈ చిత్రం తీసిన విధానం కమల్ హాసన్తో సినిమా అవకాశం తెచ్చిపెట్టింది. ‘విక్రమ్’తో లోకేశ్ చేయించిన యాక్టింగ్ కమల్ సత్తాను చాటి చెప్పింది. ఇదే జోరులో ‘ఖైదీ’ సినిమా ప్రీక్వెల్తోపాటు ‘విక్రమ్’ సీక్వెల్కూ సిద్ధమవుతున్నాడు లోకేశ్ కనగరాజ్. మరోవైపు రజనీకాంత్తోనూ సినిమా ఓకే అయిందన్న వార్తలొస్తున్నాయి.