పిల్లలు చదువు, ఆటలు, హాబీల్లో బిజీగా ఉన్నారు. తోటివాళ్లంతా ఇలా ఉంటే పదేండ్ల ప్రిషా రావత్, తొమ్మిదేండ్ల రియాన్ష్ మాత్రం ప్రపంచాన్ని ఆకట్టుకునే పని చేయాలనుకున్నారు. అనుకుందే తడవుగా ప్రపంచమే ఆశ్చర్యపోయేంత ఘనత సాధించారు. సముద్రమట్టానికి 5,895 మీటర్ల ఎత్తున్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. చిన్న వయసులోనే కిలిమంజారో ఎక్కి వార్తల్లోకెక్కారు!
కిలిమంజారో ఆఫ్రికా ఖండంలోని ఎత్తైన పర్వతశ్రేణి. ఇవి నిద్రాణమై ఉన్న అగ్నిపర్వతాలు. పదకొండు మంది పర్వతారోహకులు ఒక బృందంగా కిలిమంజారో పర్వతాలపై అత్యంత ఎత్తయిన శిఖరానికి చేరుకునేందుకు ఆగస్టు 16న బయల్దేరింది. ఆ బృందంలో ప్రిషా, రియాన్ష్ కూడా ఉన్నారు.
పర్వత పాదాల వద్ద ఉన్న అడవుల గుండా వీళ్ల ప్రయాణం మొదలైంది. కాలినడకన అడవులు దాటుకుని ఆగస్టు 24న శిఖరాగ్రానికి చేరుకున్నారు. కిలిమంజారో పర్వతాల్లో అత్యంత ఎత్తయిన శిఖరమైన ఉహురుకి చేరుకున్నారు. సాహస యాత్రల్లో చిన్నారులే అరుదు. వాళ్లలో అంతటి ఎత్తయిన శిఖరాన్ని చేరుకున్న వాళ్లు ఇంకా అరుదు. అతికొద్ది మందికే సాధ్యమైన లక్ష్యాన్ని చేరుకున్నందుకు ఈ ఇద్దరు చిన్నారుల్ని అందరూ అభినందిస్తున్నారు. ఇంత చిన్న వయసులో వాళ్లకు పర్వతాలు ఎక్కడంలో అంత అనుభవం ఎలా వచ్చిందని కొందరు సందేహిస్తున్నారు. వాళ్లు పుట్టి పెరిగింది ఎక్కడనుకుంటున్నారు? పొద్దున లేస్తే కొండలు ఎక్కడం, దిగడం సాధారణంగా సాగే ఉత్తరాఖండ్లో. ప్రిషా నైనిటాల్ పట్టణంలో పెరిగింది. రియన్ష్ అల్మోరా పట్టణంలో పెరిగాడు. హిమాలయాల చెంతన పెరిగిన వాళ్లకు కిలిమంజారో ఓ లెక్కా?!