అపరంజి బొమ్మలా కనిపించడమే కాదు, అవసరానికి అమ్మ అపరకాళిగానూ అవతరించగలదు. కల్పవల్లిలా కరుణించడమే కాదు, ఎవరికైనా కష్టం వస్తే కాళరాత్రిగా మారగలదు. సౌందర్య లహరిగా శృంగార రసాంతరంగితగా కనిపించినా, శివానందలహరిగా శాంత స్వరూపంతో దర్శనమిచ్చినా, కనకధారగా ‘సిరి’నవ్వులు కురిపించినా… అమ్మకే చెల్లు. అలాంటి తల్లి అనంతరూపాల్లో మనకు దర్శనమిచ్చే అత్యద్భుత సమయం దేవీ నవరాత్రులు. విజయదశమి సందర్భంగా నవరాత్రుల్లోఆమె తన శక్తిని దుర్గగా, భవానిగా, లలితగా, బాలాత్రిపుర సుందరిగా… ఇలా నవ రూపాల్లో నిక్షిప్తం చేసుకుని, భక్తసులభగా దీవెనలు అందిస్తుంది. అయితే అమ్మ కేవలం విగ్రహాల్లోనే కొలువుదీరలేదు. తన శక్తిని ప్రతి మహిళలోనూ నిక్షిప్తం చేసింది. ఆమె ప్రతిరూపాలుగా వీళ్లందరినీ భూమి మీదికి పంపించింది. ఒక్కొక్కరికీ తన ఒక్కో అంశనూ ప్రసాదించింది. ఆమె స్వరూపంగా నేల మీదికి వచ్చి అమ్మ చేసే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కర్తవ్యాలను తమదైన రీతిలో నిర్వర్తిస్తున్న మహిళామణులే వీళ్లంతా. శ్రీమాత ఒక్కో అంశకూ ఒక్కో రూపం ఈ స్త్రీమూర్తులు. నవరాత్రి వేడుకలకు ఘనమైన ముగింపు దసరా పండుగ. కోరిన వరాలు కురిపించే చల్లని తల్లిని మనసా స్మరించుకుందాం. అమ్మశక్తి రూపాలకు శిరసా నమస్కరిద్దాం!
మనసే దుర్గం!
‘అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాన పెద్దమ్మ…’ అంటూ దుర్గను వేనోళ్ల కొనియాడుతాం. సింహ వాహినిగా శంఖ, చక్ర, గదాది ఆయుధాలతో చేతిలో త్రిశూలంతో ఉండే అమ్మవారిని తలచినంత మాత్రానే మనల్ని చుట్టుముట్టిన కష్టాలన్నీ పటాపంచలైపోయిన భావన కలుగుతుంది. ఆమె చెంతన ఉందంటేనే కొండంత భరోసా కలుగుతుంది. అచ్చం, అలాంటి భరోసానే మహిళలకు ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఉమెన్ సేఫ్టీ వింగ్’ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా. 1995 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన స్వాతి పోలీసు శాఖలో తన ఇరవై ఏడేండ్ల సర్వీసులో వివిధ కీలక బాధ్యతల్లో పనిచేశారు.
రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రత్యేకించిన ‘షీ టీమ్స్’ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించారు. దాదాపు ఎనిమిదేండ్లుగా ఆ బృందాలకు నాయకురాలిగా వ్యవహరిస్తూ ఎందరో ఆడపిల్లల సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ఈవ్టీజింగ్ చేసే వాళ్లకు సింహ స్వప్నంగా నిలిచిందీ ప్రయత్నం. దీంతోపాటు హింసకు గురైన పిల్లలు, మహిళలకు కౌన్సెలింగ్, న్యాయ సలహాలు అందించడానికి నెలకొల్పిన ‘భరోసా’ కేంద్ర నిర్వహణ బాధ్యతలూ ఆమె చూసుకుంటున్నారు.
‘జిందగీ’తో స్వాతి లక్రా తన అంతరంగాన్ని ఇలా పంచుకున్నారు. ‘దుర్గ అన్న పేరులోనే ఎంతో వైబ్రేషన్ ఉంటుంది. ప్రతి మహిళలో దుర్గా శక్తి ఉంది. కానీ తమ లోపల ఉన్న దుర్గను వాళ్లు గుర్తించలేకపోతున్నారు. మన సమాజంలో ఆడపిల్లలు అంటే అణుకువతో ఉండాలనీ, ఎదురు మాట్లాడకూడదనీ నేర్పుతారు. ఇవన్నీ ఆమెలోని శక్తిని ఆదిలోనే అణచివేస్తున్నాయి. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కుంగిపోయేలా చేస్తున్నాయి. కానీ, ప్రతి మహిళా తాను ఎవరికన్నా తక్కువ కాదని నమ్మాలి. మనోధైర్యంతో ముందుకెళ్లాలి. ఆ విల్పవర్ ఉన్నప్పుడు మనం ఎంత పెద్ద సమస్యతో అయినా దుర్గలా తిరగబడి పోరాడగలుగుతాం.’
అన్నపూర్ణే సదా పూజితే
‘అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి…’ అంటూ అన్నపూర్ణేశ్వరిని అర్థిస్తాం. సకల చరాచర సృష్టికి ప్రాణాధారమైన ఆహార ప్రదాత ఈ తల్లి. ఆకలి తీర్చే ప్రతి మనసులోనూ అమ్మ కొలువై ఉంటుంది. ఏ ఆసరా లేని రెండు వందల మందికి పైగా ఆడపిల్లలను చేరదీసి వారి ఆకలి తీరుస్తున్నారు, జీవితంలో బాధలు తెలియకుండా హాయిగా బతకగలిగేలా విద్యాబుద్ధులు నేర్పుతున్నారు.. సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు వేమూరి విజయలక్ష్మి. ఆమె చేరదీసిన పిల్లలు మనదేశంతోపాటు విదేశాల్లోనూ చక్కటి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కోటి విద్యలు కూటి కొరకే అన్నమాట కష్టాల్లో ఉన్నవారికి అక్షరాల నిజం అనిపిస్తుందని అంటారామె. సమస్యల్లో ఉన్నవారు, ముఖ్యంగా ఏ ఆదరువూ లేని ఆడపిల్లలు అన్నం కోసం ఎదురుచూసే పరిస్థితి రాకుండా చేయాలన్న తపనతో పనిచేస్తున్నామని చెబుతారు.
‘మనిషికి జీవన శక్తినిచ్చేది ఆహారం. భూమిపై పుట్టిన ప్రతీ జీవికి ప్రాణం నిలవాలంటే ఆహారం తప్పనిసరి. అందుకే అన్నం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా చెబుతారు. శరీరానికే కాదు, మనసుకూ అన్నం అవసరం ఎంతో ఉంటుంది. కడుపు ఆకలితో ఉంటే మనసుకు ఏ ఆలోచన తోచదు. దేని మీదా ధ్యాస నిలవదు. భుక్తి ఉంటేనే ముక్తి ఉంటుంది, యుక్తి ఉంటుంది. అందుకే ఎవరి అభివృద్ధినైనా కోరుకుంటున్నామంటే ముందు వాళ్ల ఆకలి తీర్చాల్సిన అవసరం ఉంది’అంటారు విజయలక్ష్మి.
ప్రతి బిడ్డా అమ్మ రూపమే!
‘హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం…’ అంటూ బాలాత్రిపుర సుందరిని కొలుస్తాం. త్రిపురుని భార్య త్రిపురసుందరీ దేవి. త్రిపురా త్రయంలో మొదటి దేవత ఈ తల్లి. శ్రీచక్ర సంప్రదాయంలో షోడశీ విద్యకు అధి దేవత. చక్కటి సంతానం కలగాలంటే ఈమె అనుగ్రహం ఉంటే చాలు. అలాంటి అమ్మ అంశగా… కడుపులో పడింది మొదలు కంటి వెలుగై మెరిసేదాకా పసిపిల్లలను రెప్పలా చూసుకునే వైద్య వృత్తిలో ఉన్నారు డాక్టర్ బాలాంబ. గైనకాలజిస్టుగా 56 సంవత్సరాల అనుభవం ఈమె సొంతం. సుదీర్ఘ వృత్తి జీవితంలో కొన్నివేల పురుళ్లు పోశారు. మనద్వారా ఎవరికి ఏ మేలు జరిగినా అది అమ్మ శక్తిగానే భావించాలంటారామె.
‘యా దేవీ సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా… అని దేవిని కొలుస్తాం. నిజంగానే అమ్మ అంటే అపరశక్తి స్వరూపమే. అందుకే మేమెప్పుడూ మా దగ్గరికి వచ్చే ప్రతి మహిళనూ ఒక బిడ్డగానే భావిస్తాం. ఆమె ప్రాణాలనూ, కడుపులోని పసికందు ప్రాణాలనూ జాగ్రత్తగా కాపాడటం మా కర్తవ్యంగా స్వీకరిస్తాం. ఒక చంటి బిడ్డను జాగ్రత్తగా నేల మీదికి తీసుకువస్తే ఒక కుటుంబాన్ని కాపాడినట్టే. పిల్లలు లేకపోతే ఈ సృష్టే ఆగిపోతుంది. ఈ వృత్తిని సరిగ్గా నిర్వర్తించాలంటే, అవసరమైనవి చదివి గుర్తు పెట్టుకోవాలంటే.. ఆ జ్ఞానంలో అమ్మ కొలువై ఉండాల్సిందే. ఆ శక్తే ఏండ్ల తరబడి మనల్ని నడిపిస్తున్నది’ అని విశ్లేషిస్తారు బాలాంబ.
గాయత్రి రూపం స్త్రీకి వేదం!
గాయత్రిని వేదమాతగా కొలుస్తారు. అన్ని మంత్రాలకూ మూలశక్తి ఈ దేవే. అందుకే ‘న గాయత్య్రాః పరం మంత్రం…’ అంటే గాయత్రిని మించిన మంత్రం లేదు అని చెబుతారు. అమ్మ ఉపాసన ద్వారా బుద్ధి వికసిస్తుంది. మంత్రసిద్ధిని పొందడమంటే గాయత్రి అనుగ్రహాన్ని సంపాదించుకున్నట్టే. అతిచిన్న వయసులో క్లిష్టమైన మంత్ర సాధన చేసి వాటిని సిద్ధింపజేసుకున్నారు శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతా రమ్యానందమయి. పాతికేండ్ల వయసులో సన్యాసం స్వీకరించిన ఆమె మంత్రసిద్ధికి ముగ్ధులయిన కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి స్వామి, మాతను ‘మంత్ర మహేశ్వరి’గా పిలిచారు.
దేవతానుగ్రహాన్ని పొందడమే కాదు సాటి మహిళలందరికీ సిద్ధింపజేయాలన్న సత్సంకల్పంతో ‘శ్రీ శక్తి సేన’ అనే ప్రత్యేక మహిళా విభాగాన్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా ‘నారియేవ నారాయణి…’ అన్న నినాదంతో మహిళలను పూజించే కార్యక్రమాలు చేపడుతున్నారు. మహిళలకు అర్ఘ్య, పాద్యాదులు సమర్పించి, పూలతో అర్చించే ఈ విధానంలో ఆడవాళ్లను అమ్మవారిగా చూసే తత్త్వాన్ని పెంపొందిచాలన్న ఉద్దేశం దాగి ఉందని చెబుతారామె. ఇప్పటి దాకా ఇరవై అయిదువేల మందికి ఇలా పూజ చేశారు.
శ్రీ శక్తిసేన మరో కార్యక్రమం.. స్త్రీలకు వివిధ ధార్మిక విషయాల మీద అవగాహన కల్పించడం. అంతేకాదు గాయత్రీదేవి స్వరూపం మహిళలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది అన్న విషయాన్నీ ఆమె ఇలా విశదీకరించారు.. ‘ఒక స్త్రీ తన జీవితంలో ఎలా ఉండాలి అన్నదానికి పరిపూర్ణమైన నిదర్శనం గాయత్రీదేవి. ఆ అమ్మని ‘ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయైర్ముఖైః స్త్రీక్షణైః’ అని కీర్తిస్తారు. గాయత్రీదేవి ముఖం… ముత్యం, పగడం, బంగారం, నీలం, తెలుపు ఛాయల్లో ఉంటుంది.
ఇందులో ధవళ వర్ణం జ్ఞానానికి చిహ్నం. మహిళలు చక్కగా చదువుకోవడం, ఆ విద్యను కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడేలా చేయడం అన్నది తెలుపు వర్ణానికి గుర్తుగా చెప్పుకోవచ్చు. రెండోది పగడ వర్ణం, ఎరుపు ఆకర్షణను కలిగించే రంగు. అంటే మనం మాట్లాడేప్పుడు ఎదుటి వాళ్ల మనసు రంజింపజేసేలా, సంతోషాన్ని కలిగించేలా, మనం చెప్పేమాట వాళ్లకు వినాలనిపించేట్టుగా… ఆకట్టుకునేలా చాతుర్యంగా మాట్లాడాలని చెబుతుంది.
ఒక రకంగా చెప్పాలంటే వశీకరణశక్తిగా చెప్పుకోవచ్చు. హేమ వర్ణం… సిరి సంపదలకు సూచన. స్త్రీలు ఎవరి మీదా ఆధారపడకుండా వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడి స్వయం సమృద్ధిగా ఉండాలన్నది ఇక్కడ అర్థం. నీలం… తామస లక్షణానికి సంకేతం. అమ్మవారు కాళి అవతారంలో చెడుని ఏ రకంగా ప్రతిఘటిస్తుందో అలాగే మనకు కష్టాలు వచ్చినప్పుడు, దుర్మార్గులు తారసపడినప్పుడు ధైర్యంగా పోరాడాలన్న సందేశాన్నిస్తుంది ఈ రంగు. ముత్యపు వర్ణం మనసుకు గుర్తు. మనఃకారకుడైన చంద్రుడికి సంబంధించిన రత్నం ముత్యం. అంటే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్థిరమైన మనసుతో ధైర్యంగా ముందుకు వెళ్లాలని ఈ వర్ణం సూచిస్తుంది’.
క్రమశిక్షణే లలితా స్వరూపం
‘అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపామ్…’ అంటూ లలితా పరమేశ్వరి రూపాన్ని ఆరాధిస్తాం. శ్రీ విద్యా స్వరూపిణిగా అర్చిస్తాం. హరిహరులు పూజించే అమ్మను దయచూపమని వేడుకుంటాం. ఏ కార్యం, ఎవరి ద్వారా, ఎక్కడ, ఎలా జరగాలన్నా లలితా కటాక్షం ఉండాలంటారు ఉపాసకులు. దీనార్తుల పక్షాన నిలబడి, క్రమానుగతంగా పనులను చక్కదిద్దడమంటే అమ్మవారి అంశను పొందటమే. అచ్చంగా అలాంటి లక్షణాలతోనే తన వృత్తి జీవితాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు వాకాటి అరుణ. ఒకప్పుడు జిల్లాకు కలెక్టర్గా పనిచేసినా, తర్వాత కుటుంబ సంక్షేమ శాఖ బాధ్యతలు చూసుకున్నా, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖకు కార్యదర్శిగా వ్యవహరిస్తున్నా… ఆవిడ ఎప్పుడూ పేదల పక్షపాతే. మన శక్తి కొద్దీ పనిచేయాలన్న ఆలోచనతో ఉండటమే అమ్మను అర్చించడం అంటారామె. ‘సృష్టిలోని ప్రతి జీవీ ఆమెకు బిడ్డే. అందుకే ఆమె ప్రతి ప్రాణినీ ప్రేమిస్తుంది. ఆమె ఎప్పుడయినా కోపం ప్రదర్శించినా అది వాళ్లను సరిచేయడానికే. ఆమె ఏ పని చేసినా తన బిడ్డలు అభివృద్ధి చెందాలనే కోరుకుంటుంది. అలాగే మనమైనా మనకు కేటాయించిన పనిని ప్రేమతో, మనస్ఫూర్తిగా చేస్తే… లలితను ఆవాహనం చేసుకున్నట్టే’ అని వివరిస్తారు వాకాటి కరుణ.
మహిళలంతా మహాలక్షు ్మలే
‘నమోస్తు నారాయణ వల్లభాయై… నమోస్తు భూమండల నాయికాయై…’ అంటూ శ్రీమహాలక్ష్మికి నమస్కరిస్తాం. పద్మనాభుడి పట్టపురాణి అయిన ఈమె భూమండలాధీశురాలు. సకల సిరిసంపదలకూ అధిదేవత. నరుడైనా, నారాయణుడైనా లక్ష్మీకటాక్షం సిద్ధిస్తేనే శోభిల్లుతారు. ఆమె కరుణ నిండుగా, దండిగా ఉన్నవాళ్లను సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపాలుగానే భావిస్తారు. ఇటీవల సిరుల తల్లి చల్లగా చూసిన వాళ్లంటూ ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా సంస్థ విడుదల చేసిన జాబితాలో తెలుగు రాష్ర్టాల్లోనే అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలిచారు పారిశ్రామికవేత్త మహిమ దాట్ల. చిన్నపిల్లలకు కొవిడ్ టీకాలుసహా వివిధ వ్యాక్సిన్లు తయారు చేస్తున్న హైదరాబాద్కు చెందిన ‘బయోలాజికల్-ఈ’ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఈమె నికర సంపద రూ. 8,700 కోట్లు. 73 సంవత్సరాల కుటుంబ వ్యాపార పగ్గాలు అనుకోకుండా చేపట్టినా…
అనతి కాలంలోనే సంస్థను వ్యాక్సిన్ల తయారీలో ముందు వరుసలో నిలిపిన మహిమ మహిళలంటే సాక్షాత్తూ మహాలక్ష్ములే అంటారు. ‘మహిళలకు సంపదను ఎలా వృద్ధి చేయాలన్న విషయం బాగా తెలుసు. ఏయే అవసరాలకు ఎంత వెచ్చించాలన్న దానిమీద సరైన అవగాహన వాళ్లకే ఉంటుంది. ఇక, ఈ తరం అమ్మాయిలు ఆర్థిక విషయాల మీద చక్కని అవగాహన కలిగి ఉంటున్నారు. శ్రమించి సంపాదిస్తున్నారు. వివిధ సంస్థలను లాభాల బాటలో నడిపిస్తున్న మహిళలు చాలామంది ఉన్నారు’ అని చెబుతారు మహిమ.
ఈ శక్తి అందరిదీ!
తనను శరణుజొచ్చిన వారిని రక్షించడమే కాదు, శత్రుసంహారిణిగానూ పేరుగాంచిన తల్లి భద్రకాళి. అమ్మను వేడిన వాళ్లు ఆపదల నుంచి గట్టెక్కినట్టేనని నమ్ముతారు. హద్దుదాటితే అపర చండికగా అవతరించడం ఈ రూపం ప్రత్యేకత. అలాగే మన దేశ సరిహద్దులను భద్రంగా చూసుకుంటున్న వారికి శిక్షణనిస్తూ, శత్రువుల పాలిట సింహస్వప్నమై నిలిచారు డాక్టర్ సీమారావ్. భారతదేశంలో సైనిక దళ కమాండోలకు శిక్షణనిస్తున్న ఏకైన మహిళ ఈమె. సరిహద్దు గస్తీలో, పోరాట భూమిలో ఎంత చాకచక్యంగా వ్యహరించాలి, శత్రువులు దాడిచేస్తే ఎంత ధైర్యంగా పోరాడాలి అన్నది సైనికులకు నేర్పుతారు సీమ. దేశ భద్రతలో కీలకంగా వ్యవహరించే బ్లాక్ క్యాట్ కమాండోలు సహా ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, పారామిలిటరీ దళాలకు పోరాటంలో శిక్షణనిచ్చారు.
పాతికేండ్ల ఉద్యోగ ప్రస్థానంలో సుమారు 20 వేల మంది కమాండోలను తీర్చిదిద్దారు. భారతదేశపు అద్భుత మహిళగా పేరుగాంచిన సీమ మహిళా శక్తి గురించి ఇలా చెబుతారు… ‘యుద్ధభూమిలో మనకు శత్రువులు ఎదురుపడినప్పుడు ఎలా తిప్పికొట్టి, మనవాళ్లను కాపాడుకోవాలో నేర్పుతాను. ఆడపిల్లను వీళ్లకు నేను శిక్షణ ఇవ్వడం ఏంటి అని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే లోకాలను కాపాడే అమ్మ… అవసరం వచ్చినప్పుడు భద్రకాళిలా మారుతుంది. అలాంటప్పుడు మనమూ ఆ పని చేయవచ్చు. ఆ శక్తి నాలోనే కాదు, ప్రతి స్త్రీలోనూ ఉంటుంది. మానసికంగానే కాదు శారీరకంగానూ దృఢంగా ఉండగలిగేలా మనల్ని మనం సానబెట్టుకోవాలి. అప్పుడే మనం అమ్మను పూర్తిగా అర్థం చేసుకున్నట్టు’.
మనలోనే మహిషాసుర మర్దిని
లోక కంటకుడైన మహిషాసురుడనే రాక్షసుడిని మహోగ్రరూపం ధరించి తునాతునకలు చేసింది దేవి. ఆ దృశ్యాన్ని చూసిన ఇంద్రాది దేవతలూ ‘జయజయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే…’ అంటూ జయ జయధ్వానాలు చేశారు. అసురుణ్ని సంహరించి అమ్మ మహిషాసుర మర్దినిగా పూజలు అందుకుంది. కానీ నేటికీ సమాజంలో అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. రోజుకో మహిషాసురుడు పుట్టుకొస్తూనే ఉన్నాడు. వీళ్ల వల్ల ముఖ్యంగా మహిళల మీద దాష్టీకాలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి బాధిత మహిళలకు.. తమను ఆదుకునేందుకు వచ్చిన మహిషాసుర మర్దిని అవతారంలా దర్శనమిస్తారు డాక్టర్ సునీతా కృష్ణన్. సెక్స్ వర్కర్లుగా మారిన మహిళలూ, వాళ్ల పిల్లల జీవితాల్లో వెలుగులు పూయించాలన్న సంకల్పంతో ‘ప్రజ్వల’ అనే ఎంజీవోను ఏర్పాటు చేశారు ఆమె.
ఇప్పటి దాకా దాదాపు 24 వేల మంది మహిళలను ఈ నరక కూపం నుంచి బయటికి తీసుకొచ్చారు. ‘ఆడవాళ్ల గురించి తక్కువగా, తప్పుగా ఆలోచించే ప్రతి బుర్రలోనూ మహిషాసురుడు తిష్ట వేసుకుని కూర్చుంటాడు. సమయం వచ్చినప్పుడు బయటికి వచ్చి వికృత రూపం చూపిస్తుంటాడు. ఈ మహిషాసురుడిని మనం ఎప్పుడయితే మన మనసులోంచి, ఈ సమాజంలోంచి వెలివేయగలుగుతామో… అప్పుడే నిజమైన మహిషాసుర సంహారం జరిగినట్టు’అంటారు సునీత.
సకల కళలూ సరస్వతివే
‘యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్ర్తాన్వితా…’ అంటూ సరస్వతికి ప్రణామం చేస్తాం. ధవళ వర్ణపు చీరలో వెలిగిపోయే అమ్మ సకల కళలకూ అధినేత్రి. బుద్ధి, జ్ఞానం,వాక్కు, విద్య… అన్నీ ఆమె రూపాలే. అలాంటి సరస్వతీ స్వరూపాలైన అనేక కళల్లో నిష్ణాతురాలు, ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్. ఎనిమిదేండ్ల వయసుకే తను పదోతరగతి పూర్తి చేసింది.
పదేండ్లకు ఇంటర్మీడియెట్, పదమూడేండ్లకు డిగ్రీ, పదిహేనేండ్లకు పీజీ పట్టాలను అందుకుంది. మరో పక్క టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా ప్రఖ్యాతిగాంచింది. ఇక ముందు కెరీర్లో తన ప్రతిభను మహిళా సాధికారతను సాధించడానికి వినియోగిస్తానని చెబుతున్నది నైనా. ‘ప్రతి మనిషిలోనూ సరస్వతీ అంశ ఉంటుంది. మనమంతా ఆ తల్లి బిడ్డలమే’ అంటుందామె.
…? లక్ష్మీహరిత ఇంద్రగంటి