యాక్సిడెంట్ జరిగింది. ఒక వీధి కుక్కను మోటార్ సైకిల్తో ఢీకొట్టి కింద పడిపోయాడో తాగుబోతు. చుట్టూ పదిమంది చేరారు. అతణ్ని లేపారు. సపర్యలు చేశారు. కుక్కకు కూడా పెద్ద దెబ్బే తగిలింది. బాధతో మూలుగుతున్నది. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక మహిళ మాత్రం దాని దగ్గరికి వెళ్లింది.రక్తమోడుతున్న ఆ మూగజీవిని ఆసుపత్రిలో చేర్చింది. వైద్యం ఇప్పించాక ఇంటికి తీసుకెళ్లింది. కాస్త కోలుకున్న తర్వాత ఫిజియో థెరపీ ప్రారంభించింది. ఇలాంటి దుర్ఘటనల కారణంగా అవిటిగా మారిన కుక్కలతో పాటు ఇతర మూగజీవాల కోసం ఖమ్మం జిల్లా దానవాయి గూడెంలో ‘నేచర్ యానిమల్ కేర్ సెంటర్’ ప్రారంభించింది మేకల పద్మ. ఆ సేవా ప్రస్థానం ఆమె మాటల్లోనే…
నాకు మూగజీవులంటే ప్రేమ. పద్దెనిమిదేండ్ల నుంచీ వీధి జంతువులకు సేవ చేస్తున్నాను. ఇంట్లో మా పిల్లలతో పాటే పద్దెనిమిది కుక్కలు ఉండేవి. ఎస్బీఐ ఆర్సీటీలో నేను క్రాఫ్ట్ టీచర్ని. మొదట్లో రోడ్ల మీద తిరిగే కుక్కలు, ఆవులకు ఆహారం వండిపెట్టేదాన్ని. ఆ బాధ్యతలో కుటుంబ సభ్యులూ సాయపడేవారు. దాంతోపాటే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు ఆహారం, దుస్తులు ఇచ్చేదాన్ని. ఏడాదికోసారి పేద పిల్లలకు స్కూల్ యూనిఫామ్లు, నిరుపేద మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశాను. ఒకసారి వీధి కుక్కలకు ఆహారం పెట్టి తిరిగి వస్తుండగా నాకు యాక్సిడెంట్ అయింది. తలకు ఏడు కుట్లు పడ్డాయి. దాదాపు నెల రోజులు బయటికి రాలేకపోయాను. అప్పటివరకూ నేను సేవచేసిన ఆశ్రమాలవాళ్లు కానీ, నా నుంచి సాయం పొందినవాళ్లు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా నన్ను పలకరించలేదు. ‘మీరు అన్నం తెచ్చిన క్యాన్లు తీసుకుపోవడానికైనా రాలేదేం? ఏమైపోయారు?’ అని కూడా అడగలేదు. దాంతో నా మనసు విరిగిపోయింది. అప్పటి నుంచీ మూగజీవాల కోసమే పని
చేయాలని నిర్ణయించుకున్నాను. అదే దారిలో నడుస్తున్నాను.
కొవిడ్ సమయంలో…
కొవిడ్ లాక్డౌన్లో వీధి జంతువుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పిడికెడు ముద్ద పెట్టేవారు కూడా కరువయ్యారు. అందరూ మనుషులకు ఆహారం పొట్లాలు సరఫరా చేస్తున్న సమయంలో, నేను ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల్లోని మూగజీవాల కడుపునింపాను. రోజూ 30 నుంచి 35 కిలోల భోజనం వండి వీధి కుక్కలకు, పశువులకు పెట్టాను. అప్పుడే పూర్తిస్థాయిలో ఓ ఆశ్రమం నిర్వహించాలనే ఆలోచన వచ్చింది. మూడేండ్ల క్రితం దానవాయిగూడెంలో నెలకు పదివేల రూపాయల అద్దెకు ఒక ఇల్లు తీసుకున్నాను. అక్కడే మూగ జీవాలకు నీడనిస్తున్నాను. నా దగ్గర 90 కుక్కలు, 20 పిల్లులతో పాటు కుందేళ్లు, గుర్రాలు ఉన్నాయి. వీటిలో కాళ్లు విరిగినవి, నడుములు పడిపోయినవి, పక్షవాతం, షుగర్, కిడ్నీ ఫెయిల్యూర్ తదితర వ్యాధులతో బాధపడుతున్నవి అనేకం. ఎక్కడైనా మూగజీవాలు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్టు తెలిస్తే వెళ్లి తెచ్చుకుంటాను.
దవాఖానాకు తీసుకెళ్లి చికిత్స చేయిస్తాను. గాయాలైనవాటికి మూడు పూటలా డ్రెస్సింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకే కట్లు కట్టడం, వ్యాక్సిన్లు వేయడం నేర్చుకున్నా. ఎండాకాలం వాటికి కూలర్లు పెట్టాం. ఆరోగ్యం బాగా దెబ్బతిన్నవాటిని బోన్లలో ఉంచుతాను. ఇక్కడ ముప్పై దాకా మంచాలున్నాయి. నిరంతరం వీటికి సేవలు చేయడం వల్ల ఓ దశలో నాకు చర్మవ్యాధి వచ్చింది. నెమ్మదిగా తగ్గించుకున్నా. నేను ఎప్పుడూ ఇదే పనిలో ఉండటంతో నా భర్త విసిగిపోయారు. ‘నేను కావాలా? కుక్కలూ పిల్లులూ కావాలా?’ తేల్చుకోమంటూ హెచ్చరించారు. ఇవి నాకు పిల్లలతో సమానం. ఏం సమాధానం చెప్పగలను? నా నిర్ణయం నచ్చక ఆయన ఇల్లు విడిచి వెళ్లి పోయారు. ఆ అమాయక ప్రాణుల కోసం నా జీవితాన్నీ త్యాగం చేశాను. నా దృష్టిలో ఇదొక తపస్సు.
సాయం కోసం…
ఆశ్రమం పెట్టాక జంతువులే ప్రపంచంగా మారాయి. ఏడాదిగా పనికి వెళ్లలేదు. దీంతో నెలకు ముప్పై అయిదు వేల జీతం ఆగిపోయింది. ఒక గార్మెంట్ హౌస్ నడిపేదాన్ని. దాంతో కొంత డబ్బు సమకూరేది. కొవిడ్ తర్వాత అదీ మూతబడింది. వీటిని సంరక్షించడంలో నా ఇద్దరు కొడుకులు, మా అమ్మాయి, అల్లుడు సాయం చేస్తున్నారు. మందులు, ఆహారం కలిపి నెలకు 80 వేల రూపాయల దాకా ఖర్చు అవుతున్నది. ప్రస్తుతం మా అవసరాలు కనాకష్టంగానే తీరుతున్నాయి. ఎవరైనా సాయం చేస్తే తీసుకుంటున్నాం. బియ్యం, గిన్నెలు, పాత బట్టల్లాంటివి కూడా మాకు ఉపయోగపడతాయి. ఇక్కడ మా ఆశ్రమం ఉండటం చాలామందికి ఇష్టం లేదు. పొరపాటున గేటు దాటి బయటికి వెళ్లిన ఓ కుక్కపిల్లను ఎవరో రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ మూగజీవాల కోసం కొంత స్థలం ఇవ్వమని కలెక్టరును కోరాలని అనుకుంటున్నాం. ఎవరేం మాట్లాడినా సరే నా ప్రాణం ఉన్నంత వరకూ జంతు సేవ చేస్తూనే ఉంటాను. తమవంతు సాయం చేయాలనుకునేవారు 9989683987 నంబరులో సంప్రదించవచ్చు.
…?లక్ష్మీహరిత ఇంద్రగంటి
బండారి మహేశ్