శరన్నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలవుతాయి కదా! బతుకమ్మ ఉత్సవాలు భాద్రపద అమావాస్య నుంచి ఎందుకు ప్రారంభిస్తారో తెలియజేయండి?
తెలంగాణ ప్రజల సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. ఇది జానపదులు ఉల్లాసంగా నిర్వహించుకునే పెద్ద ఉత్సవం. ఈ పండుగ పుట్టుక వెనుక వేర్వేరు కథనాలు వాడుకలో ఉన్నాయి.
ప్రాచీన కాలంలో నవాబులు, పెత్తందార్ల అఘాయిత్యాలకు బలైపోయిన అమాయక గ్రామీణ ఆడపడుచుల మరణాలకు కన్నీళ్లు రాలుస్తూ వారిని పితృదేవతలకు సమానంగా ఆరాధిస్తుంటారనేది ఒక కథనం. ఆ అమావాస్య రోజునే పితరులతోపాటు ఆ అబలలను స్మరించుకునే సంస్కృతిలో భాగంగా అదే రోజు బతుకమ్మ పండుగను మొదలుపెట్టడం సంప్రదాయమైంది. వారిని పార్వతీ అమ్మవారికి ప్రతీకలుగా భావిస్తూ పెత్తర అమావాస్య మొదలు దుర్గాష్టమి వరకు వేడుక నిర్వహిస్తారు. తొమ్మిది రోజులపాటు రకరకాల పూలను పేర్చి, బతుకమ్మను తీర్చి శక్తిని ఆవాహన చేసి ఆటపాటలతో అర్చించడం ఆచారంగా మారింది.
బతుకమ్మ వెనుక చారిత్రక నేపథ్యమూ ప్రచారంలో ఉంది. ప్రాచీన కాలంలో చాళుక్యులకు రాజధానిగా విలసిల్లింది మన వేములవాడే. ఈ చాళుక్యులను జయించిన చోళులు తమ ఆరాధ్య దైవమైన బృహదీశ్వరుణ్ని తంజావూరుకు తరలించుకు పోయి బృహదీశ్వరీ దేవి వియోగ దుఃఖానికి కారణమయ్యారు. ఆ బాధను తలచుకొని జానపదులు అమావాస్య రోజున అమ్మవారిని పూవుల రూపంలో పేర్చి అశ్రు తర్పణం విడిచి తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడటం సంప్రదాయంగా మారింది. వేములవాడలో పూజలందుకుంటున్న రాజేశ్వరుడే బృహదీశ్వరుడనీ, రాజరాజేశ్వరి బృహదీశ్వరి అనీ.. జానపదుల మాటలలో బతుకమ్మగా మారిందని ఒక కథనం. అందుకే బతుకమ్మ పండుగకూ, శరన్నవరాత్రులకూ ఈ వైవిధ్యం ఏర్పడింది.
డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370