ఆంగ్ల సంవత్సరాదిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. మరి.. తెలుగు సంవత్సరాది అయిన ఉగాది సంగతి? రెండు తెలుగు రాష్ర్టాలతోపాటు దేశం నలుమూలలా వేర్వేరు పేర్లతో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో ఉగాదికి అటుఇటుగా సౌరమాన క్యాలెండర్ ప్రకారం ఈ పండుగను జరుపుకొంటారు. ప్రాంతాలను బట్టి వేర్వేరు సంప్రదాయాలను పాటిస్తారు.
యుగాది: కర్ణాటకలో ‘యుగాది’ పేరుతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. అయితే, వీరి సంప్రదాయాలు మన ఉగాదికి దగ్గరగా ఉంటాయి. మన ‘ఉగాది పచ్చడి’ లాగే, కన్నడిగులు ‘బేవు-బెల్ల’ తింటారు. బేవు అంటే వేప పువ్వు. చేదును కష్టాలకు సంకేతంగా భావిస్తారు. బెల్ల అంటే బెల్లం. తియ్యని దీని రుచి సుఖాలకు సంకేతంగా చెబుతారు. జీవితంలో కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని ‘బేవు బెల్ల’ పరమార్థం. అయితే, ఉగాది పచ్చడిలా కాకుండా.. దీనిని పొడి రూపంలో తీసుకుంటారు. ఇక మన దగ్గర పోలెల మాదిరిగానే.. వీళ్లు ఓబట్టు చేసుకుంటారు. వీటిని నెయ్యితో కలిపి తింటారు. పులిహోరను పోలి ఉండే చిత్రాన్న, పెసరపప్పు, కీరదోస ముక్కలతో చేసే కోసంబరి (సలాడ్).. వీరి యుగాది స్పెషల్ వంటకాలు.

నవ్రే: కశ్మీరీ పండిట్లు ‘నవ్రే’ పేరుతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ‘నవ్’ అంటే కొత్త. ‘రే’ అంటే సంవత్సరం అని అర్థం. ఈ రోజున కశ్మీరీలు పాటించే అత్యంత ముఖ్యమైన ఆచారం.. ‘థాల్ బరన్’. పండుగకు ముందురోజు రాత్రే ఒక పెద్ద పళ్లెంలో బియ్యం, పెరుగు, ఉప్పు, పంచదార, వాల్నట్స్, నాణేలు, ఒక చిన్న అద్దం, కొత్త పంచాంగం, కలం, పూలు ఉంచుతారు. ఉదయాన్నే ఇంట్లోని పెద్దలు ఈ పళ్లేన్ని తీసుకువచ్చి, కుటుంబ సభ్యులందరికీ చూపిస్తారు. నిద్రలేవగానే శుభప్రదమైన ఈ వస్తువులను చూడటం వల్ల ఆ ఏడాది మొత్తం ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతాయని వారు నమ్ముతారు. పండుగ సందర్భంగా.. ‘శారికా దేవి’ ఆలయాన్ని సందర్శించడం వీళ్ల ఆచారం.

గుడి పడ్వా: మహారాష్ట్ర, గోవా రాష్ర్టాల్లో.. గుడి పడ్వా పేరుతో పండుగ చేసుకుంటారు. కేవలం నూతన సంవత్సరంలాగే కాకుండా.. అక్కడి చారిత్రక విజయాలకు, పంటల రాకకు చిహ్నంగానూ ఈ వేడుకను భావిస్తారు. ఈ పండుగలో అత్యంత ముఖ్యమైనది.. ఇంటి గుమ్మం వద్ద ‘గుడి’ని ప్రతిష్ఠించడం. పొడవైన వెదురు కర్రకు పట్టు వస్త్రం కట్టి, దానిపై వేప ఆకులు, మామిడి ఆకులు, చక్కెర గొలుసు ఉంచుతారు. కర్ర చివరన వెండి/ రాగి కలశాన్ని బోర్లించి పెడతారు. ఈ ‘గుడి’ని విజయానికి చిహ్నంగా భావిస్తారు. ఇక బ్రహ్మ దేవుడు విశ్వాన్ని ఈ రోజే సృష్టించాడని మరాఠావాసులు నమ్ముతారు. అందుకే దీనిని.. ‘బ్రహ్మధ్వజం’ అని కూడా పిలుస్తారు. రావణుడిపై విజయం సాధించి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఇలాగే జెండాలు (గుడి) ఎగురవేసి స్వాగతం పలికారని ఇక్కడివాళ్లు చెబుతారు. గుడి పడ్వా పర్వదినాన.. చవులూరించే శ్రీఖండ్, పురణ్ పోలి, కనేగి లాంటి ప్రత్యేక వంటకాలను ఆరగిస్తారు.

సజిబు నోంగ్మా పాన్బా: మణిపూర్లోని మెయితెయి తెగ జరుపుకొనే నూతన సంవత్సరమే.. ‘సజిబు నోంగ్మా పాన్బా’. వారి సంప్రదాయ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ‘సజిబు’ నెలలో మొదటి రోజున వస్తుంది. పండుగ సందర్భంగా ప్రతి ఇంట్లో రకరకాల శాకాహార వంటకాలను తయారు చేస్తారు. వీటిని తినడానికి ముందు ఇంటి ప్రధాన ద్వారం వద్ద దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక ఈ పండుగలో అత్యంత ఆసక్తికరమైన అంశం.. చెయిరావోబా. అంటే పర్వతారోహణం. పర్వతం పైకి ఎక్కడం అనేది జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి, అభివృద్ధి చెందడానికి సంకేతంగా వీళ్లు భావిస్తారు. మధ్యాహ్నం భోజనం తర్వాత, ప్రజలందరూ సమీపంలోని కొండలను, పర్వతాలను ఎక్కుతారు. ఇంఫాల్లోని ‘చీరావో చింగ్’ కొండపైకి.. ఈ రోజున వేలాది మంది ప్రజలు తరలివస్తారు.