పరిశోధనాశాలలో కొన్ని ప్రత్యేక ప్రక్రియల ద్వారా జీవం ఉన్న సూక్ష్మక్రిములలోని రోగాన్ని కలిగించే శక్తిని తొలగించి, సజీవ టీకాలను ఉత్పత్తి చేస్తారు. ఇవి నిర్జీవ టీకాల కన్నా శక్తిమంతమైనవి. ఎందుకంటే, ఇవి శరీరంలో ప్రత్యుత్పత్తి జరపడం వల్ల సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది.. ఈ టీకాలను ఒకేసారి ఇస్తే సరిపోతుంది. ఉదా: వైరస్ నుంచి మీజిల్స్, బ్యాక్టీరియా నుంచి బీసీజీ టీకాలు.
నిర్జీవ టీకాలు
ఉష్ణోగ్రతతో కాని, రసాయనాలతో కాని సూక్ష్మ జీవులను చంపి తయారు చేస్తారు. ఈ టీకాలు ఏమంత శక్తిమంతమైనవి కావు. ఉదా: కలరా టీకాలు. ఆ తరువాత వచ్చే సమస్యలూ ఎక్కువే. టాక్సాయిడ్ బ్యాక్టీరియా స్రవించిన టాక్సిన్ను సేకరించి.. కొన్ని ప్రత్యేక ప్రక్రియల ద్వారా అందులోని విష లక్షణాన్ని నిర్మూలిస్తారు. ఆ తర్వాత దాంతో డిప్తీరియా, టెటనస్ టీకాలను తయారు చేస్తారు.
మిశ్రమ టీకాలు
ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్కసారి టీకా ఇవ్వాలంటే.. పిల్లలు అనేకసార్లు ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల ఖర్చు ఎక్కువ. సమయమూ వృథా అవుతుంది. అంతేకాదు, ఒక్కొకటి ఒక్కోసారి ఇచ్చినట్టయితే.. అన్ని డోసులు పూర్తిగా ఇవ్వకముందే పిల్లలకు అంటు వ్యాధులు రావచ్చు. కాబట్టి కొన్ని టీకాలలో 2-6 రకాలు కలిపి ఇస్తారు. ఉదా: బ్యాక్టీరియా మిశ్రమ టీకా డీపీటీ. ఇది మూడు వ్యాధుల నుంచి రక్షణనిస్తుంది. వీటిని విడివిడిగా ఇచ్చినప్పటి కంటే.. మిశ్రమ రూపంలోనే బాగా పనిచేస్తాయి. వైరస్ రకానికి చెందిన మిశ్రమ టీకాలకు ఉదాహరణ ఎంఎంఆర్. ఇది కూడా మూడు వ్యాధుల నుంచి రక్షిస్తుంది. డీపీటీ, హెపటైటిస్-బి, హిబ్, ఐపీవీ టీకాలను కలిపి మిశ్రమ టీకాగా అభివృద్ధి పరిచారు. దీనివల్ల తొమ్మిదిసార్లు ఇంజెక్షన్లు చేయించే బదులు, మూడుసార్లు చేయిస్తే ఆరు రకాల వ్యాధుల నుంచి రక్షణ చేకూరుతుంది. మిశ్రమ టీకాలు మిగతా టీకాల్లానే పనిచేస్తాయి. అదనంగా వచ్చే సమస్యలేమీ ఉండవు.
పాలీ సాకరైడ్ టీకాలు
బ్యాక్టీరియా ఉపరితలంపై ఉండే ఒకరకమైన చక్కెర పదార్థం నుంచి దీన్ని తయారు చేస్తారు. ఉదా: హిబ్ టీకా, మెనింగోకాకల్ టీకా, న్యూమెకాకల్ టీకా. రీ- కాంబినెంట్ టీకాలు కూడా సమర్థమైనవే. వీటిని జెనెటిక్ ఇంజినీరింగ్ ద్వారా తయారు చేస్తారు.
– డాక్టర్ కర్రా రమేశ్రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు