ఆమె.. ఆమె కాదు. కానీ, తనకంటూ ఓ గుర్తింపును ఆశించింది. సాధారణ మనిషిలా బతకాలనుకుంది. కానీ, సమాజం తీవ్ర వివక్ష చూపడం ఆమెను కదిలించింది. బాధపెట్టింది. చివరికి, తాను చదువుకున్న చదువునే ఉపాధి మార్గంగా మార్చుకున్నది. తన కాళ్లపై తాను నిలబడుతూ మరికొందరికి భరోసా ఇస్తున్నది.. బ్యాగరి సిరి.
నిర్మల్ జిల్లాకు చెందిన బ్యాగరి సిరి బీఎస్సీ (నర్సింగ్) పాసైంది. నిర్మల్లో శ్రీసిరి ప్రథమ చికిత్సాలయం నడుపుతున్నది. ఇక్కడి వరకూ ఆమె సాగించిన ప్రయాణంలో ఎన్నో అవరోధాలు. ప్రాథమిక విద్యను నిర్మల్ జిల్లాలో పూర్తిచేసింది సిరి. హైదరాబాద్లో బీఎస్సీ చదివింది. తన శరీరంలోని మార్పులను ఆమోదిస్తూ.. నర్సింగ్ ద్వితీయ సంవత్సరంలో ఉండగానే ట్రాన్స్జెండర్గా మారింది. ఆ తర్వాత, కుటుంబం తలుపులు మూసుకుపోయాయి. దయలేని సమాజం ఉపాధి అవకాశాలనూ దూరం చేసింది. దీంతో జీవనాధారం కోసం భిక్షాటన చేసింది. అక్కడా సవాళ్లే. రాజకీయాలే. దీంతో పార్ట్టైమ్ కొలువులు చేస్తూ.. బీఎస్సీ నర్సింగ్ పాసైంది. కొంత పెట్టుబడితో వరంగల్లో సొంతంగా ఫార్మసీ ప్రారంభించింది. అలా కొందరికి ఉద్యోగ అవకాశాలూ కల్పించింది.
యుక్త వయసులో ట్రాన్స్జెండర్లుగా మారిన వారిలో రకరకాల కారణాలతో ఆత్మన్యూనత పెరిగిపోతుంది. అలాంటివారిని చేరదీసి సమాజంలో ఎలా ఉండాలో తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నది సిరి. ఈ మధ్యే నిర్మల్లోని విశ్వనాథ్పేట్ కాలనీలో శ్రీసిరి ప్రథమ చికిత్సాలయం పేరిట ట్రాన్స్జెండర్స్ కోసం ప్రాథమిక వైద్యశాల ప్రారంభించింది. అభాగ్యులకు అండగా ఓ ఆర్గనైజేషన్ స్థాపించేందుకు కృషి చేస్తున్నది. మూడో ప్రకృతి మనుషులకు విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలపై అవగాహన పెంచేందుకు సిద్ధం అవుతున్నది సిరి.
– రాంపెల్లి నరేందర్