శ్రీ కృష్ణుడిని ఒక్కొక్కరూ ఒక్కోలా భావించి పూజించేవారు. గోపికలు ప్రియుడిగా ఆరాధించేవారు. గోపబాలురు కన్నయ్యను స్నేహితుడిగా భావించేవారు. ద్రౌపది ‘అన్నా’ అని పిలిచింది. దేవకీ వసుదేవులు, యశోదా నందులు కొడుకుగా లాలించారు.
శిశుపాలుడు శత్రువుగా తలచాడు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా శ్రీకృష్ణుడిని కొలిచారు. ఒకే కృష్ణుడిలో ఎవరికి వారు తమకు ఇష్టమైన రూపాన్ని దర్శించేవారు. నచ్చిన పేరుతో పిలిచారు. ఎవరు ఎలా పిలిచినా అందరికీ భగవానుడు తన ప్రేమను పంచాడు. దైవం ఒకటే అనే భావన లేకుండా చేసే పూజలు అవిధి పూర్వకాలనీ, అజ్ఞానంతో కూడినవని గీతాచార్యుడు తెలియజేశాడు. ఈ సత్యాన్ని తెలుసుకొని భగవంతుడు ఒక్కడే, భగవన్నామం ఒక్కటే అని నిశ్చయానికి రాగలిగితే అది సార్థకమవుతుంది.