నరసింహుడి అవతారం ఓ అద్భుతం. పద్నాలుగు భువనాలు ప్రకంపించిన సన్నివేశం. ఉన్నట్టుండి వచ్చాడు. ఉగ్రరూపంతో నిలిచాడు. షరతులు వర్తించాయి. పరిధులు గుర్తున్నాయి. ఆ భీకర అవతార మూర్తిని కళ్లప్పగించి చూడటం హిరణ్యకశిపుడి వంతైంది. మనసు అర్పించి ఉప్పొంగడం ప్రహ్లాదుడి సొంతమైంది. నరసింహ ఉపాసనకు ఆధ్యాత్మిక మార్గమైంది. నరసింహ జయంతి సందర్భంగా ఆ స్వామి అవతార విశేషాన్ని ప్రస్తావించుకుందాం.
దేవాదిదేవుడి సర్వాద్భుత లీలలను మళ్లీ మళ్లీ స్మరించుకొని, వాటిలో ఇమిడి ఉన్న భగవత్ తత్తాన్ని అర్థం చేసుకోవాలి. అందుకు ఆయా దేవతల అవతార తిథులు, ఉత్సవాలు దోహదం చేస్తాయి. వైశాఖ శుక్ల చతుర్దశి నరసింహ జయంతి. ఆ రోజే ప్రహ్లాదుడి పిలుపున హరి.. నరకేసరిగా అవతరించాడు. ఈ సందర్భంగా నరసింహ తత్తాన్ని సింహావలోకనం చేసుకుందాం.
ఏతద్య ఆదిపురుషస్య మృగేన్ద్రలీలాం
దైత్యేన్ద్రయూథపవధం ప్రయతః పఠేత
దైత్యాత్మజస్య చ సతాం ప్రవరస్య పుణ్యం
శ్రుత్వానుభావమకుతోభయమేతి లోకమ్
భక్తాగ్రేసరుల్లో ప్రహ్లాదుడు ఉత్తముడు. ప్రహ్లాద వైభవాన్ని, దైత్యేంద్రుడైన హిరణ్యకశిపుని వధలీలను, ఆది పురుషుని దివ్య చరితాన్ని ఎవరు శ్రద్ధతో పఠిస్తారో, వింటారో, వారు ఏ ఆపదలు, భయాందోళనలూ లేని ఆధ్యాత్మిక జగత్తును తప్పక చేరుతారు. (శ్రీమద్భాగవతం 7.10.47)
పూర్వం హిరణ్యకశిపుడనే దైత్యరాజు ఉండేవాడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు శ్రీహరికి పరమభక్తుడు. తన విరోధిగా భావించే శ్రీహరిని ప్రహ్లాదుడు భక్తితో సేవించడాన్ని హిరణ్యకశిపుడు సహించలేకపోయాడు. కొడుకును శ్రీహరి భక్తి నుంచి తప్పించడానికి అనేక రకాలుగా ప్రయత్నించి విఫలమయ్యాడు. అయినా ప్రహ్లాదుడి భక్తిలో మార్పు లేదు. ఈ పరిణామాలతో కోపోద్రిక్తుడైన హిరణ్యకశిపుడు ఒకరోజు ప్రహ్లాదునితో ‘ఇవాళ నేను నిన్ను యమపురికి పంపిస్తాను’ అని ఊగిపోయాడు. శ్రీమద్భాగవతంలోని ఈ వాక్యం యమధర్మరాజు అని ఒకరు ఉన్నారని, ఆయన యమపురిలో ఉంటాడని తెలుపుతుంది. ఆయనే విశ్వవ్యవహారాలను సరిచూసే ప్రధాన న్యాయమూర్తి. జీవుని మరణానంతరం అతని పాపపుణ్యాలను బేరీజు వేసి అందుకు అనుగుణంగా శిక్షలు విధించి, తదుపరి జన్మ నిర్ణయం జరుగుతుంది. అయితే, ప్రహ్లాదుడి వంటి పరమ భాగవతోత్తముడు, యమధర్మరాజుకు సైతం పూజనీయుడన్న సంగతి అసురేంద్రుడికి తెలియకపోవడం విచారకరం.
మూలాధారం నరసింహం
ప్రహ్లాదుడి భక్తిని ఆక్షేపిస్తూ ‘ఎవని శక్తి కారణంగా నువ్వు మూర్ఖుడిలా మొండిగా, భయం లేనివాడిలా నా శాసనాలను ధిక్కరిస్తున్నావు?’ అని హిరణ్యకశిపుడు ప్రశ్నించాడు. దానికి ప్రహ్లాదుడు ప్రసన్న వదనంతో ‘ఓ అసురవర్యా! ఎవరితో మీరు మీ శక్తియుక్తులను పొందగలుగుతున్నారో, ఆయనే నా శక్తికీ మూలాధారం. ఆయనే సకల శక్తులకూ మూలాధారమైన పరంధాముడు శ్రీహరి’ అని పలికాడు.
సకల జీవులలోని శక్తికి మూలాధారం నరసింహుడే. అభక్తులకు కర్మానుసారం వారు పొందవలసిన శక్తిని వారికి ప్రసాదిస్తాడు. కానీ, భక్తుడికి అవసరమైతే తనతో సరిసమానమైన శక్తిని అనుగ్రహిస్తాడు స్వామి.
ప్రహ్లాదుని మాటలకు మరింత ఆగ్రహించిన హిరణ్యకశిపుడు ‘ప్రహ్లాదా! నువ్వు నిరంతరం ఎవరినో నన్ను మించిన ఉత్తముడు అని, సమస్త సృష్టికీ అతీతుడు అని, చరాచర జీవులను నియంత్రించే వాడని, సర్వాంతర్యామి అని వర్ణిస్తుంటావు. ఎవడు వాడు? వాడెక్కడున్నాడు? వాడే అంతటా ఉన్నట్లయితే నా ముందున్న ఈ స్తంభంలో చూపగలవా?’ అని కోపంగా ప్రశ్నించాడు.
ఆవేశంలో అన్నా, అజ్ఞానంతో పలికినా హిరణ్యకశిపుడు పలికిన మాటలు ప్రాధాన్యం కలిగినవి. ఎప్పుడూ తానే సర్వోత్తముడినని హిరణ్యకశిపుడు భావించినా, నిజమైన సర్వోత్తముడు ఎవరన్నది ప్రహ్లాదుడికి తెలుసు. శ్రీహరే సర్వోత్తముడన్న విషయం భగవద్గీత పేర్కొన్నది.
షరతులకు లోబడి..
ఏక దేశ స్థితస్యాజ్ఞేర్ జ్యోత్స్నా విస్తారినీ యథా
పరస్య బ్రహ్మణఃశక్తిస్తతేధమ్ అఖిలమ్ జగత్
(విష్ణు పురాణం)
ఒకేచోట స్థితమై ఉన్న అగ్ని తేజస్సు చుట్టూరా ఎలాగైతే వ్యాపిస్తుందో, అలాగే పరబ్రహ్మ స్వరూపుడైన ఆ దేవదేవుని శక్తులు ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాయి. భగవంతుని గుణగణ వైభవాలను, సర్వవ్యాపకత్వాన్ని పరిపూర్ణంగా తెలిసిన ప్రహ్లాదుడు, భగవంతుడు ఈ స్తంభంలో తప్పక ఉన్నాడని నిస్సంకోచంగా సమాధానమిచ్చాడు. ప్రహ్లాదుని మాటలను విన్న హిరణ్యకశిపుడు తన రాజ సింహాసనం నుంచి లేచి పిడికిలి గుద్దుతో స్తంభాన్ని పగలగొట్టాడు. ఆ స్తంభం నుంచి సర్వాద్భుతమైన నరమృగ శరీరంతో నరసింహావతారుడై స్వామి అరుదెంచాడు. స్తంభోద్భవుడైన ఆ నరసింహుని దివ్య సుగుణమిదే. అటు తన భక్తుడైన బ్రహ్మదేవుని వరాలను, ఇటు తన ప్రియ భక్తుడైన ప్రహ్లాదుని మాటలను నిష్ఫలం చేయకుండా నరమృగ రూపుడై, స్తంభజుడై ఆవిర్భవించాడు.
క్రోధ మూర్తి.. కరుణ మూర్తి
భగవంతుడు క్రోధాన్ని కలిగి ఉండటం కొందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు. అయితే, సర్వోన్నతమైన శక్తికీ ఒక రూపముందని, ఆ రూపం సమస్త భావాలకూ నిలయమన్నది ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన సత్యం. ఏ నేరమూ ఎరుగని తన భక్తుడైన ప్రహ్లాదుడి పట్ల కిరాతకంగా వ్యవహరించినందుకు గానూ భగవంతుడు కోపోద్రిక్తుడయ్యాడు. సర్వానికీ మూలాధారమైన ఆ భగవంతుడే ప్రేమ, క్రోధమనే భావాలకూ మూలం. మనమంతా ఆ పురుషోత్తముడి అంశలం కాబట్టి, మనలోనూ ఆ భావాలున్నాయి. కానీ, మనలోని క్రోధం దుష్పరిణామాలకు హేతువు. కాగా, భగవంతుడి క్రోధం ఆరాధనీయమైనది. ఇదే భగవంతునికీ మనకూ ఉన్న వ్యత్యాసం.
‘సమస్త శక్తికీ మూలాధారమైన నృసింహ భగవానుడికి ప్రణామాలు. ఓ స్వామీ! వజ్రాయుధం వంటి నీ గోళ్లతో, దంతాలతో మాలోని ప్రాపంచిక కర్మఫలాలను కాంక్షించే అసుర లక్షణాలను నశింపజేయి. మా హృదయంలో సదా నెలకొని ఉంటూ, మాలోని అజ్ఞానాన్ని పారద్రోలి మమ్మల్ని అనుగ్రహించిన, మీ కృపను మేము ఈ భౌతిక ప్రపంచంలో, జీవన పోరాటంలో నిర్భయత్వాన్ని పొందగలం’ అంటుంది శ్రీమద్భాగవతం (5.18.8). నృసింహ జయంతి సందర్భంగా నరసింహస్వామిని మనసారా ఆరాధిద్దాం. ఆ దేవదేవుడిపై మరింత సేవాభావాన్ని, ఆకర్షణను పెంపొందించడానికి ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే’ మంత్రాన్ని
నిత్యం పఠిద్దాం.
అసుర ప్రవృత్తులు
హిరణ్యకశిపుని వంటి అసురులే లోకంలో భగవంతుడు, సర్వోత్తముడంటూ మరెవ్వరూ లేరని అంటుంటారు. సృష్టిలోని ప్రతిదీ అనుకోకుండా యాదృచ్ఛికంగా సంభవించాయని వారి అభిప్రాయం. అంతేగాక, స్త్రీ-పురుషుల మధ్య ఉన్న కామమే అన్నిటికీ మూలమనే కాల్పనిక తత్త్వాలనూ వినిపిస్తుంటారు. సృష్టికర్త ఒకరున్నారని, సమస్త సృష్టిని నియంత్రిస్తున్నదీ ఆయనేనన్న సత్యాన్ని వారు అంగీకరించరు. భగవంతుడు లేడని అలా చెబుతూనే మరోవైపు తానే భగవంతుడినని ప్రకటించుకుంటారు! అసురుల లక్షణమిదే. తన శక్తియుక్తులన్నీ ప్రహ్లాదుడిని ఏమీ చేయలేకపోవడాన్ని చూశాక గానీ, హిరణ్యకశిపుడు తనను మించిన శక్తి మరొకటున్నదా అని ఆలోచించలేకపోయాడు.