బిడ్డకు ఆటిజం అని తేలింది. అయినా ఆ తల్లి బాధపడుతూ కూర్చోలేదు. అవరోధాలను అధిగమించి, కొడుకును ఉన్నతంగా తీర్చిదిద్దాలని సంకల్పించింది నమితా సోమాని. ఆమె భర్త పేరు సురేశ్ కుమార్. ఆ దంపతులు కోల్కతాలో ఉంటారు. వారికో బిడ్డ. పేరు కల్పేశ్. వయసు పెరిగేకొద్దీ ఆ చిన్నారిలో ఆటిజం లక్షణాలు కనిపించాయి. బిడ్డను మామూలు మనిషిని చేయడానికి నమిత చేయని ప్రయత్నమంటూ లేదు. ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధపడ్డారు. కానీ కల్పేశ్ పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. సాధారణ పాఠశాలలేమో సీటు ఇవ్వలేదు. దీంతో నమిత తన బిడ్డకోసం, తన బిడ్డలాంటి ఆటిజం పిల్లల కోసం ఓ పాఠశాలను నెలకొల్పాలని నిర్ణయించింది.
‘సోమాని మెమోరియల్ సెంటర్’ను స్థాపించింది. ప్రపంచవ్యాప్తంగా ఆటిజం సమస్యతో బాధపడుతున్నవారి కుటుంబ సభ్యులను ఆహ్వానించింది. అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించింది. అప్లయిడ్ బిహేవియర్ ఎనాలిసిస్ థెరపీ (ఏబీఏ) వంటి ఆధునిక సౌకర్యాలను తమ సంస్థ ద్వారా అందిస్తున్నది. అక్కడితో ఆగలేదామె. ఆటిజం వైద్య, పునరావాస, శిక్షణ కేంద్రంగా.. పశ్చిమ బెంగాల్లోని షిరాకోల్లో 52 ఎకరాల విస్తీర్ణంలో ఆటిజం కేర్ టౌన్షిప్ను నిర్మిస్తున్నది. సిబ్బంది గృహ సముదాయం, డేకేర్ సెంటర్, పాఠశాల, వృత్తివిద్య శిక్షణ సంస్థ, వైద్యశాల.. తదితర సౌకర్యాలన్నీ అక్కడ ఉంటాయి. ఆటిజం, అనుబంధ రుగ్మతలపై పరిశోధన కేంద్రాన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఆటిజం బాధితులు సమాజంలో గౌరవంగా బతికేలా చేయడమే తమ లక్ష్యమని చెబుతారు నమిత.