ఏడేండ్ల వయసులోనే కంటిచూపు కోల్పోయాడు. తల్లిలేదు. తండ్రి లేడు. అక్క ఉన్నా ఆదుకోలేని పరిస్థితి. చూపు లేకపోతేనేమి.. చెరువులో చేపలు పడుతూ ఆత్మస్థైర్యానికి చిరునామాగా నిలుస్తున్నాడు. అతని పేరు ఒడపెల్లి ఎల్లాగౌడ్. వయసు 35 ఏండ్లు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగాపురంలో ఉంటాడు. అప్పుడు ఎల్లాగౌడ్కు ఏడేండ్లు. రెండో తరగతి చదువుతున్నాడు. అంతదాకా బాగానే ఉన్న అతనికి ఏదో అంతు తెలియని వ్యాధి సోకింది. కంటిచూపు పూర్తిగా కోల్పోయాడు. చదువు మానేసి ఇంట్లోనే ఉండిపోయాడు. అమ్మానాన్న తోడుగా ఉండటంతో ఎలాంటి సమస్య రాలేదు.
ఎవ్వరూ లేని ఒంటరి
ఎల్లాగౌడ్ తల్లికి కూడా చూపు సరిగ్గా లేదు. తండ్రి యాదగిరి కల్లుగీస్తూ తాటిచెట్టుపై నుంచి కిందపడి మంచానికే పరిమితం అయ్యాడు. పైసా ఆదాయం లేదు. మూడేండ్లు మంచం పట్టిన యాదగిరి తర్వాత కాలం చేశాడు. కొద్దిరోజులకే తల్లీ చనిపోయింది. అమ్మమ్మ దగ్గరైనా ఉందామని వెళితే కొద్దిరోజులకే ఆమె కూడా కన్నుమూసింది. అక్క ఉందిగానీ ఆమెదీ కడు పేదరికం. ఇలా విధిరాతకు ఎల్లాగౌడ్ ఒంటరివాడయ్యాడు. ఆకలైతే అన్నం పెట్టేవాళ్లు లేరు. దూపయితే నీళ్లు ఇచ్చేవాళ్లు లేరు. కనీసం ఎలా ఉన్నావని పలకరించే వాళ్లు లేని దుస్థితి. చూపు లేకపోవడంతో ఏ పనీ దొరకలేదు. అలాగే ఉండిపోతే లాభం లేదనుకున్నాడు ఎల్లాగౌడ్. ఏదో ఒక పనిచేస్తేనే తను బతకగలనని నిర్ణయించుకున్నాడు.
సాయం చేసే చేతుల కోసం
ఊళ్లో పెద్ద చెరువు ఉంది. చూపు బాగున్నవారే దాంట్లో చేపలు పట్టాలంటే వెనకాముందు అవుతారు. అలాంటిది మనోధైర్యంతో చెరువులో చేపలు పట్టడం నేర్చుకున్నాడు ఎల్లాగౌడ్. జీవితమంతా కష్టాలతోనే ప్రయాణిస్తున్న అతను చేపలు పట్టడాన్నే జీవన ఆధారంగా మార్చుకున్నాడు. ఎవరూ దగ్గరికి రాకున్నా, ఎవరూ చేరదీయకున్నా ఒంటరిగానే నిత్యం పోరాటం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చేపలు పట్టగా వచ్చే పైసలకు తోడుగా ప్రభుత్వం ఇచ్చే రూ.3000 పింఛన్ తోడైంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. రేపటి పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న అతణ్ని నిత్యం వెంటాడుతున్నది. తనను ఆదుకొని అండగా నిలిస్తే తన జీవితానికి, కష్టానికి సార్థకత చేకూరుతుందని ప్రాధేయపడుతున్నాడు. సాయం చేసే చేతులు ఎల్లాగౌడ్ను చేరదీయాల్సిన అవసరం ఉంది!