లక్షణమైన టీచర్ ఉద్యోగం మానేసి ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ఓ పాఠశాలను స్థాపించారు ఫరీదా రాజ్. రెమెడియల్ ఎడ్యుకేటర్గా తన అనుభవాలకు పుస్తకరూపం ఇచ్చారు. తాజాగా,మల్టిపుల్ స్లిరోసిస్ గురించి మరో పుస్తకం వెలువరించారు. ఆ వ్యాధిపై వచ్చిన మొదటి సమగ్ర రచన ఇదే! 70 ఏండ్ల వయసులోనూ బోధన, పరిశోధన, రచనతో తలమునకలై పిల్లలు, టీచర్లకే కాదు సమాజానికి కూడా కొత్త పాఠాలు చెబుతున్నారు ఫరీదా. ఆ అనుభవాలు ఆమె మాటల్లోనే..
మాది ముంబై. అక్కడే బోధన మొదలుపెట్టాను. కొందరు పిల్లలు వేగంగా నేర్చుకోలేరు. రాయడం, చదవడంలోనూ మందగమనమే. Bని Dలా రాస్తారు. ఫార్టీ వన్ (41)ని ఫోర్టీన్ (14)గా పలుకుతారు. ప్రతి
తరగతిలో ఇలాంటివారు ఇద్దరో ముగ్గురో ఉంటారు. స్కూల్ అయిన తర్వాత సాయంత్రం పూట.. ఆ పిల్లలకు పాఠాలు చెప్పేదాన్ని. టీచర్ ఉద్యోగానికి నెలకు 460 రూపాయల జీతం ఇచ్చేవారు. ఆ డబ్బు బస్సు ఛార్జీలకు కూడా సరిపోయేది కాదు. అందుకే, దూరదర్శన్లో ఫ్రీలాన్సర్గా రంగ్ తరంగ్, సప్తాహి కార్యక్రమాల వ్యాఖ్యాతగా చేశాను. స్కూల్లో నెల జీతం కంటే దూరదర్శన్ పారితోషికమే ఎక్కువగా ఉండేది! కాకపోతే, బోధన వృత్తిలోని సంతృప్తి వేరు. పిల్లలకు పాఠాలు చెబుతున్నప్పుడు ఎంతో ఆనందంగా అనిపించేది. సెరిబ్రల్ పాల్సీ (మెదడు సంబంధ వ్యాధి)తో బాధపడే పిల్లలు నేర్చుకోవడంలో చాలా ఇబ్బంది పడేవారు. వాళ్లకంటూ ప్రత్యేక శిక్షణ అవసరం. ఆ నైపుణ్యం పెంచుకోడానికి నేను ఇంగ్లండ్ వెళ్లాను. అందుకు బ్రిటిష్ కౌన్సిల్ స్కాలర్షిప్ ఇచ్చింది. ఇంగ్లండ్ నుంచి వచ్చిన తర్వాత రెమెడియల్ టీచర్గా కొత్త కెరీర్ మొదలు పెట్టాను.
వివాహం తర్వాత నా నివాసం హైదరాబాద్కు మారింది. ఇక్కడా అంతే. పిల్లలే నా ప్రపంచం. ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం సికింద్రాబాద్లోని బోయిన్పల్లిలో ‘సెంటర్ ఫర్ స్పెషల్ ఎడ్యుకేషన్’ అనే సంస్థను ప్రారంభించాను. సాయంత్రం స్కూల్ తర్వాత పిల్లలు నా దగ్గరికి వచ్చేవారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలను అర్థం చేసుకుంటే ఎక్కువ మేలు జరుగుతుంది. ఆ విషయాన్ని చాటుతూ ‘బ్రేకింగ్ త్రూ అండర్స్టాండింగ్’ అనే పుస్తకం రాశాను. ఆ ప్రభావమే కావచ్చు. ప్రత్యేక అవసరాలున్న పిల్లల పట్ల ఉపాధ్యాయుల దృక్పథంలో చాలా మార్పు వచ్చింది. పుస్తకం తెలుగు, మరాఠీ భాషల్లోకి అనువాదమైంది. తదుపరి రచన.. ‘బ్రేక్ ద సైలెన్స్’ మరో సంచలనం.
కొవిడ్లో మా సెంటర్ను మూసేయాల్సి వచ్చింది. బడులు లేవు. ఆటల్లేవు. ఇంట్లోనే ఉండిపోయి.. స్మార్ట్ ఫోన్లకు బానిసలు కావడం వల్ల చాలామంది మానసిక సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ సమస్యలపై దృష్టి సారించినప్పుడు మల్టిపుల్ స్లిరోసిస్ బాధితుల మానసిక సమస్యలు నా దృష్టికి వచ్చాయి. మన దేశంలో మల్టిపుల్ స్లిరోసిస్ బాధితులు ఎంతోమంది ఉన్నారు. మెదడు, వెన్నెముకలో గాయాల కారణంగా శరీరం అనేది కేంద్ర నాడీ వ్యవస్థ నియంత్రణలో ఉండదు. దీనికి మందులేదు. మాట తడబడటం, చూపు మసకబారడం, చూపు మందగించడం, కంటి కదలికల్లో నొప్పి, తల తిరగడం, బడలిక, జ్ఞాపకశక్తి లోపించడం.. దీని లక్షణాలు. న్యూరాలజిస్ట్లే ఈ రుగ్మతను నిర్ధారించగలరు. మల్టిపుల్ స్లిరోసిస్ బాధితుల్లో మహిళలు ఎక్కువ. దీనికి కారణం ఏమిటన్నది డాక్టర్లకూ తెలియదు. వైద్యులు గుర్తించకపోవడం వల్ల ఎంతమంది మల్టిపుల్ స్లిరోసిస్ బాధితులున్నారన్నది లెక్క తేలడం లేదు. వారి కోసం నావంతు ప్రయత్నం చేయాలనుకున్నాను. మల్టిపుల్ స్లిరోసిస్ సొసైటీ ఆఫ్ ఇండియాలో చేరాను. ప్రస్తుతం, కార్యవర్గ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నాను.
మల్టిపుల్ స్లిరోసిస్కు మందు లేకపోయినా వైద్యుల సహాయంతో జీవనశైలిలో మార్పు చేసుకుని.. సమస్య తీవ్రత తగ్గించుకోవచ్చు. ఆ ప్రయత్నంలో మంచి ఆహారం, వైద్యుల సహకారం అవసరం. ఆ విషయాలన్నీ వివరిస్తూ మల్టిపుల్ స్లిరోసిస్ బాధితుల కోసం కూడా ఓ పుస్తకం రాయాలనుకున్నాను. అలా, ‘అన్ బ్రేకబుల్ స్పిరిట్’ రచనకు పూనుకున్నాను. ఇందుకు మూడేండ్లు పరిశోధన చేశాను. బాధితులు, కుటుంబ సభ్యులు, డాక్టర్లతో మాట్లాడాను. గతంలో రాసిన పుస్తకాల కంటే ఇది చాలా భిన్నమైంది. మా సొసైటీ కృషి వల్ల సమాజంలో అవగాహన పెరిగింది. మార్పు వస్తున్నది. కంపెనీలు పాలసీలకు సవరణలు తెస్తున్నాయి. సామాజిక వెనుకబాటు వల్ల ముస్లిం మహిళల్లో పునరుత్పత్తి ఆరోగ్యం, మానసిక సమస్యలు గుర్తించాను. ఆ ఊబి నుంచి వాళ్లు బయటపడేలా అవగాహన పెంపొందించాలనుకున్నాను. నా రచనలు ఏ ఒక్కరికి ఉపయోగపడినా.. నా అంత అదృష్టవంతులు ఉండరని అనుకుంటాను.
కపిల్దేవ్కు సమకాలికుడైన రంజీ క్రికెటర్ విజయ్ మోహన్ రాజ్ .. మా ఆయన. బోధన, రచన, పరిశోధనలో కుటుంబం అండగా నిలిచింది. నా ఇష్టాలకు ఎన్నడూ ఆంక్షలు లేవు. నా ప్రయాణాలకు మా ఆయన సహకారం ఎంతో ఉంటుంది. రోజూ బయటికి వెళ్లి వచ్చిన తర్వాత ఆ విశేషాలు తనకు చెబుతుంటాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్లకు చిరుతిండి సిద్ధం చేస్తాను. హోమ్ వర్క్ చేయిస్తాను. తెల్లవారు జామున 4.30కి నిద్ర లేస్తాను. ఇరుగుపొరుగు లేచే సమయానికి మా ఇంట్లో పనులన్నీ పూర్తి చేస్తాను.
-నాగవర్ధన్ రాయల