భారతదేశానికి రైతు వెన్నెముక. ఆ రైతుకు వెన్నుదన్ను ట్రాక్టర్! ఇది అందుబాటులోకి వచ్చాక కర్షకుడి కాయకష్టం కాస్త తగ్గింది. ఆ ట్రాక్టర్ల ఉత్పత్తిలో ఎందరెందరు ఉన్నా… టఫె ప్రస్థానం ప్రత్యేకమైనది. తండ్రి వారసత్వంగా వచ్చిన వ్యాపార సామ్రాజ్యాన్ని ఒంటిచేత్తో నిలబెట్టిన ఘనత ఆ సంస్థ చైర్పర్సన్ మల్లికా శ్రీనివాసన్కు చెల్లుతుంది. పురుషాధిక్య వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తూ… లాభాల లెక్కలు తేలుస్తున్నది. దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన మహిళా సీఈవోల్లో ఒకరిగా, ట్రాక్టర్ రారాణిగా ఎదిగిన ప్రస్థానం ఇది..
Mallika Srinivasan | పెద్దయ్యాక ఏమవుతావ్? ఈ ప్రశ్నకు చాలామంది దగ్గర సరైన జవాబు ఉండదు. స్పష్టత లేనివాళ్లకు ఏ ఇబ్బందీ లేదు. డాక్టర్ను చూడగానే డాక్టర్ అవ్వాలనీ, నచ్చిన టీచర్ తారసపడితే.. ఆమెలా ఉపాధ్యాయురాలు కావాలనీ భావిస్తుంటారు. కానీ, పెద్దయ్యాక ఏమవ్వాలో స్పష్టత ఉన్నవాళ్లకే పెద్ద సమస్య! చదువులో తడబడ్డా, మార్కుల్లో వెనుకబడ్డా తన లక్ష్యం అందుకోలేనేమో అని కంగారు మొదలవుతుంది. ఆ స్థానంలో ఓ వ్యాపారవేత్త కూతురు ఉంటే! ఆమె సంఘర్షణ ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మల్లికా శ్రీనివాసన్దీ ఇదే పరిస్థితి. తండ్రి శివశైలం ఆటోమొబైల్ రంగంలో రారాజు. ఆమె పుట్టేనాటికే వాళ్లకు పరిశ్రమలు ఉన్నాయి. మల్లిక పెరిగేకొద్దీ.. వాళ్ల పరిశ్రమ మరింత విస్తరించింది.
ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ (టఫె)కు మాతృసంస్థ ‘ది అమల్గమేషన్స్ గ్రూప్’! మల్లిక వాళ్ల తాతయ్య దీనిని ప్రారంభించారు. కొన్నాళ్లకు సంస్థ పగ్గాలు శివశైలం అందుకున్నారు. ఆటోమొబైల్ రంగంలో ఈ సంస్థది తిరుగులేని ఆధిపత్యం. ట్రాక్టర్లు, వ్యవసాయ ఉపకరణాల ఉత్పత్తుల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన సంస్థగా పేరొందింది. ‘ఏం కావాలన్నది నీ ఇష్టం!’ అని తల్లిదండ్రులు మల్లికకు చిన్నప్పుడే స్వేచ్ఛనిచ్చారు. ఆమె మాత్రం వ్యాపారవేత్తగా రాణించాలని ఏనాడో బలంగా నిశ్చయించుకున్నారు. అందుకు తగ్గట్టుగా మేనేజ్మెంట్ విద్య చదివారు. మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ ఎకనామిక్స్ పూర్తిచేశారు. అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. వ్యాపార సూత్రాలన్నిటినీ వల్లె వేసి తండ్రి వ్యాపార సంస్థలో ఉద్యోగిగా ప్రస్థానం మొదలుపెట్టారు మల్లిక.
వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎదిగిన మల్లికా శ్రీనివాసన్ను జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ఎన్నో వరించాయి. 2022 సంవత్సరానికి గానూ ఫోర్బ్స్ నుంచి ఆసియాలో శక్తిమంతమైన 50 మంది మహిళా వ్యాపారుల్లో ఆమె చోటు దక్కించుకున్నారు. శివశైలం 2007లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకోగా, మల్లిక 2014లో ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
టఫెలో జనరల్ మేనేజర్గా పనిచేసిన ఆమె ఇప్పుడు ఆ సంస్థకు చైర్పర్సన్ స్థాయికి ఎదిగారు. సంస్థ లాభాలను ఏటికేడూ పెంచుతూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు. టఫెను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ట్రాక్టర్ తయారీ సంస్థగా నిలబెట్టారు. ఈ విజయం ఆమెకు అనుకున్నంత తేలికగా రాలేదు. ముప్పయ్ ఏండ్ల వ్యాపార ప్రస్థానంలో మల్లికకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. విపత్కర పరిస్థితులూ వచ్చాయి. అన్నిటినీ ఎదుర్కొని నిలబడ్డారు. ట్రాక్టర్ల తయారీ, అమ్మకం, ఆదాయాల పరంగా మనదేశంలో ‘మహీంద్రా’ తర్వాతి స్థానంలో టఫె ఉండటం ఆమె వ్యాపార దక్షతకు రుజువు. ప్రపంచవ్యాప్తంగా 82 దేశాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నది అంటే ఆమె ఎంత సమర్థంగా పనిచేస్తున్నదో అంచనాకు రావొచ్చు.
తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగానో, సమాజ పోకడలను అనుసరించో, స్నేహితుల ప్రభావంతోనో చాలామంది యువతీయువకులు తమకు ఆసక్తి లేని రంగాల వైపు బలవంతంగా వెళ్తుంటారు. కానీ, మనసుకు నచ్చిన, మనం మెచ్చిన దారిలో నడిస్తే ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించొచ్చు అంటారు మల్లిక. అంతేకాదు, స్త్రీ సాధికారతకు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. వర్క్ప్లేస్లో మహిళల సంఖ్య అధికంగా ఉండాలని ఆమె ఎప్పుడూ చెబుతుంటారు. అందుకు తగ్గట్టుగా తన సంస్థలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దివ్యాంగ మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. మరోవైపు సామాజిక సేవలోనూ మల్లిక చొరవ అద్భుతం. తల్లిదండ్రుల పేరిట ‘ఇందిరా శివశైలం’ ట్రస్ట్ స్థాపించి విద్య, వైద్య సంస్థలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. కర్ణాటక సంగీతం ప్రాచుర్యానికి కృషి చేస్తున్న మల్లికా శ్రీనివాసన్ నేటి మహిళా లోకానికి ఆదర్శం!!