ఎసిడిటీ, అజీర్తి మనిషిని ఓ చోట నిలువనీయవు. ఆహార ప్రియులైతే ఏం తినాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఎసిడిటీ బాధితులకు ఆయుర్వేద నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటిని పాటిస్తే.. సమస్యను నియంత్రించవచ్చు.
అతిగా తింటే అజీర్తితోపాటు ఎసిడిటీ వేధిస్తుంది. సకాలంలో పట్టించుకోకపోతే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి రుగ్మతలు వెంటాడతాయి. అధికంగా యాసిడ్స్ విడుదలైతే చేదు వాంతులు ఇబ్బందిపెడతాయి. దీనికితోడు గొంతు సమస్యలు వస్తాయి. ఆహారం మింగేటప్పుడు తీవ్ర ఇబ్బందిపడతారు. ఎసిడిటీని అధిగమించడంలో ఈ పద్ధతులు మనకు ఉపకరిస్తాయి.
80 శాతం మాత్రమే
జపాన్ ప్రజలు ఏ ఆహారమైనా సరే.. 80 శాతం కడుపు నిండేంత మాత్రమే తింటారు. కాబట్టే వారికి గుండెజబ్బులు, క్యాన్సర్, స్ట్రోక్, గ్యాస్ట్రిక్ సమస్యలు తక్కువ. ఇదే నియమాన్ని ఎసిడిటీ బాధితులకూ సూచిస్తారు నిపుణులు.
ఎంత నమిలితే అంత నయం
నోట్లో పెట్టుకొనే ప్రతి ముద్దనూ కనీసం 32 సార్లు నమలాలని చెబుతారు నిపుణులు. దీనిద్వారా లాలాజలం ఉత్పత్తి పెరిగి జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. అయితే బ్రెడ్స్, పుచ్చకాయ, పండ్ల వంటివి సాధ్యమైనంత తక్కువ నమలాలన్నది ఓ నియమం.
తింటూ తాగొద్దు
ఆహారం ఆరగిస్తున్నప్పుడు నీళ్లు, జ్యూస్, సోడా, శీతల పానీయాలు అస్సలు తాగొద్దని అంటారు. ఎందుకంటే, మనం తినేటప్పుడు విడుదలయ్యే యాసిడ్స్ను ద్రవపదార్థాలు తమలో కలుపుకొంటాయి. దీనివల్ల జీర్ణక్రియ మరింత ఆలస్యం అవుతుంది. తిన్న అరగంట తర్వాతే నీళ్లు తాగాలన్నది వైద్యుల సలహా.