ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి భారీ అంచనాలతో ఎన్నో పాన్ ఇండియా సినిమాలు విడుదలయ్యాయి. చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్’ హిట్ టాక్ తెచ్చుకుంటే, ప్రభాస్ ‘రాజాసాబ్’ మాత్రం సెట్ చేసిన అంచనాలను అందుకొనే ప్రయత్నంతో పోరాడి ఫ్లాప్గా నిలిచింది. కలెక్షన్ల పరంగా కొన్ని సినిమాలు నిలబడినా, కథ, పాత్రల రూపకల్పన, ముఖ్యంగా మహిళా పాత్రల చిత్రణలో ఎక్కువగా విమర్శలు ఎదుర్కొన్నాయి.
రొటీన్ కథలు, ఎక్కువ హింస, హీరో చుట్టూ మాత్రమే తిరిగే స్టోరీలు ప్రేక్షకుల్లో విసుగును పెంచుతున్నాయని సినీ విశ్లేషకులు/క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు కొత్త కథలు, బలమైన ఎమోషన్స్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దక్షిణాది సినిమాలు, ఇప్పుడు అదే విజయ సూత్రాన్ని పదేపదే అనుసరించడంతో కొత్తదనం తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ముఖ్యంగా మహిళా పాత్రలను కేవలం కథకు, స్క్రీన్కు అలంకారంగా మాత్రమే చూపించడం కూడా వివాదాలకు దారితీస్తున్నది. అయితే ప్రేక్షకుల అభిరుచి మారుతున్నదని, కేవలం భారీ బడ్జెట్, స్టార్ హీరోలు మాత్రమే కాకుండా బలమైన కథ, సహజమైన పాత్రలకే భవిష్యత్తులో ఎక్కువ ఆదరణ ఉంటుందని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. ఈ మార్పును గుర్తిస్తేనే దక్షిణాది సినిమా మరోసారి దేశవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని కొనసాగించగలదని వారు తెలియజేస్తున్నారు.