తోబుట్టువుల మధ్య అనురాగం, రక్షణ, పరస్పర గౌరవానికి ప్రతీక.. రక్షాబంధన్! ఈ పండుగ రోజున సోదరుడి చేతికి కట్టే రాఖీ.. కేవలం ఒక దారం మాత్రమే కాదు. అతని ఆయురారోగ్యాలు, ఉన్నతిని కాంక్షిస్తూ సోదరి అందించే దివ్యమైన ఆశీస్సు కూడా. అందుకే, రాఖీల ఎంపికలో డిజైన్, ఆకర్షణతోపాటు విశేష ప్రాముఖ్యత కలిగిన రంగులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే, జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ప్రతి రంగూ ఒక ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి, సోదరుడి రాశి స్వభావానికి సరిపడే రంగు రాఖీని ఎంచుకోవడం వల్ల సానుకూల ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
మేషం : వీరికి ఎరుపు రంగు రాఖీ అత్యంత అనుకూలం. ఇది వారిలోని ధైర్యాన్ని, చురుకుదనాన్ని మరింత పెంచుతుంది.
వృషభం : ఆకుపచ్చ లేదా లేత నీలం రాఖీలు ఈ రాశివారికి శ్రేయస్కరం. ఇవి వారికి మానసిక స్థిరత్వాన్ని, సుఖశాంతులను చేకూరుస్తాయి.
మిథునం : వీరికి పసుపు లేదా లేత ఆకుపచ్చ రాఖీ సరిపోతుంది. ఇది వారి జిజ్ఞాసను, సంభాషణా నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది.
కర్కాటకం : ఈ రాశి వారికి తెలుపు లేదా వెండి రంగు రాఖీ శ్రేష్టం. ఇది వారికి భావోద్వేగ స్థిరత్వాన్ని, ప్రశాంతతను అందిస్తుంది.
సింహం : నారింజ, బంగారు లేదా రాయల్ రెడ్ రంగు రాఖీలు.. సింహరాశి వారికి అనువైనవి. ఇవి వారి నాయకత్వ లక్షణాలను, ఆత్మవిశ్వాసాన్ని మరింత ప్రకాశింపజేస్తాయి.
కన్య : ఈ రాశి వారికి లేత ఆకుపచ్చ లేదా లేత గోధుమ రంగు రాఖీలు కట్టడం మంచిది. ఇది వారి ఏకాగ్రతను, కార్యాచరణను పెంచుతుంది.
తుల : లేత నీలం లేదా గులాబీ రంగు రాఖీలు వీరికి సరిపోతాయి. వారిలో సామరస్యాన్ని, ప్రేమపూర్వక సంబంధాలను బలపరుస్తాయి.
వృశ్చికం : వీరికి ముదురు ఎరుపు, మెరూన్ లేదా ముదురు గోధుమరంగు రాఖీలు అనుకూలంగా ఉంటాయి. వారి సంకల్ప బలాన్ని కాపాడతాయి.
ధనుస్సు : పసుపు, కాషాయం లేదా పర్పుల్ (ఊదా) రాఖీలు అత్యుత్తమం. ఇవి వారిలోని ఆశావాదాన్ని, జ్ఞానాన్ని విస్తరింపజేస్తాయి.
మకరం : నేవీ బ్లూ, బూడిద (గ్రే) లేదా ముదురు ఆకుపచ్చ రాఖీలు శ్రేయస్కరం. ఇవి క్రమశిక్షణను, వృత్తిపరమైన పురోగతిని ప్రోత్సహిస్తాయి.
కుంభం : స్కై బ్లూ లేదా వయోలెట్ రంగు రాఖీలు వీరికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి సృజనాత్మకతను, స్నేహభావాన్ని పెంపొందిస్తాయి.
మీనం : ఈ రాశి వారికి లేత పసుపు, సీ-గ్రీన్ లేదా లావెండర్ రాఖీలు అనువైనవి. ఇవి భావోద్వేగ సమతుల్యతను, మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.