పిల్లల్లో స్క్రీన్ టైమ్ తగ్గించాలనీ, ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలనీ నిపుణులు పదేపదే చెబుతున్నారు. అనేక అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి కూడా. మూడు నుంచి ఏడేళ్లలోపు పిల్లలపై గతేడాది నిర్వహించిన ఒక అధ్యయనంలో.. పిల్లల నిద్ర, శారీరక కార్యకలాపాలపై స్క్రీన్టైమ్ తీవ్రమైన ప్రభావం చూపుతున్నదని తేలింది. తాజాగా, సింగపూర్ ప్రధానమంత్రి కూడా ‘పిల్లలు-స్క్రీన్టైమ్’ గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
పిల్లల్లో ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్లను పెంపొందించడానికి తల్లిదండ్రులు, పాఠశాలలు, సమాజం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ‘స్క్రీన్ స్మార్ట్ ఫ్రమ్ ది స్టార్ట్’ అనే కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా, తల్లిదండ్రులు ఆచరించాల్సిన కొన్ని ఆలోచనలనూ పంచుకున్నారు.
ఫ్యామిలీ టైమ్ను స్మార్ట్ ఫోన్ టైమ్గా మార్చొద్దు. కుటుంబంతో గడిపే సమయంలో పిల్లల్ని స్మార్ట్ స్క్రీన్ల నుంచి దూరంగా ఉంచాలి. భోజన సమయాల్లో ఫోన్లను పూర్తిగా పక్కన పెట్టి.. కుటుంబాలన్నీ తమకంటూ ఒక ‘ఫ్యామిలీ సేఫ్టీ టైమ్’ను సృష్టించుకోవాలి.
పిల్లల పడక గదుల్లోకి స్మార్ట్ఫోన్ వెళ్లకుండా చూసుకోవాలి. ముఖ్యంగా, పడుకునే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొద్దు. ఎందుకంటే, రాత్రిపూట పిల్లలు ఏం చేస్తున్నారనేది పెద్దల అదుపులో ఉండదు. అంతేకాకుండా.. ఫోన్ లేని పడకగది మెరుగైన నిద్రకు, ఆరోగ్యకరమైన అలవాట్లకూ తోడ్పడుతుంది.
చిన్న పిల్లలకు స్మార్ట్ఫోన్ను ముందే పరిచయం చేయకండి. అవసరం అనుకుంటే.. అత్యవసర సమయంలో కాల్స్ చేయడానికి వీలుగా, ఇంటర్నెట్ సదుపాయం లేని మామూలు ఫోన్ను ఇవ్వొచ్చు. అయితే, ఈ ఏర్పాటు పిల్లలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని దూరం చేయడం కాదు. సాంకేతికతను బాధ్యతాయుతంగా నిర్వహించడానికి వారిని మరింత సిద్ధం చేయడమే!
ఈ డిజిటల్ యుగంలో పిల్లలు ఎప్పటికైనా స్మార్ట్ఫోన్ వినియోగించాల్సిందే! కాబట్టి, వారిలో చిన్న వయసులోనే డిజిటల్ బాధ్యతను పెంచాలి. సాంకేతికతను సమర్థంగా ఎలా వినియోగించుకోవాలో పిల్లలకు అవగాహన కల్పించాలి. దాంతో, వారు భవిష్యత్తులో సురక్షితమైన, బాధ్యతాయుతమైన
డిజిటల్ వినియోగదారులుగా మారుతారు.