పండుగ పూట సమర్పించే ప్రతి నివేదనలో ఒక పరమార్థం ఉన్నది. బతుకమ్మ ఆట తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. పాయసాన్నప్రియా, దధ్యాన్నాసక్త హృదయా, ముద్గౌదనాసక్త చిత్తా, హరిద్రాన్నైక రసికా, గుడాన్న ప్రీత మానసా… అంటూ అమ్మకు ఏదో ఒక రూపంలో అన్నాన్ని నివేదిస్తారు. శరీరం నిలవాలంటే అన్నం కావాలి. అలసట తీరాలంటే ఆహారం తీసుకోవాలి. బతుకమ్మ ఆడి అలసిన పిల్లలకు అమ్మకు నివేదించిన ప్రసాదం పెడతారు. ప్రసాదం అంటే పది మందితో కలిసి పంచుకునేది. అది బలవర్ధకమైనదై ఉండాలి. రుచిగా ఉంటే మరీమరీ అడిగి తింటారు. ఎదుగుతున్న ఆడపిల్లలకు అది అవసరం కూడా! రాక్షస సంహారం కోసం తొమ్మిది రోజులపాటు పోరాడిన జగన్మాత ఆకలితో అలసిపోయి ఉంటుందనే భావనతో నాలుగో రోజు నానిన బియ్యంతో చేసిన నైవేద్యాలు సమర్పిస్తారు. అందుకే ఇవాళ్టి బతుకమ్మను ‘నాన బియ్యం బతుకమ్మ’గా పిలుస్తారు. నైవేద్యం కోసం మొదట బియ్యాన్ని కడిగి, నానబెట్టి, ఆ తర్వాత ఆరబెట్టి.. మెత్తగా పిండి చేస్తారు. అందులో పాలు, చక్కెర, నెయ్యి వేసి పాలకాయల్లా చిన్న ఉండలు చేస్తారు. వీటిని పచ్చిపిండి ముద్దలని పిలుస్తారు.
శరదృతువులో వచ్చే అనేక పండుగల్లో పచ్చిపిండి ముద్దలు ప్రత్యేక నివేదనగా సమర్పిస్తారు. కొత్తగా వడ్లు వచ్చే కాలం కాబట్టి, బియ్యానికి కొదువ ఉండదు. పైగా ఇవంటే అమ్మకు ఎంతో ప్రీతి. అందుకే, నానిన బియ్యంతో చేసిన పదార్థాలు నైవేద్యం పెడతారు.
డా॥ ఆర్.కమల