Mega star Chiranjeevi Acharya | ‘స్వయంకృషి’తో ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు ఒక చక్రవర్తి. ప్రజలు అతనికి నీరాజనాలు పట్టారు. అంతలో..ఓ ప్రజాకార్యం కోసం దశాబ్దకాలం ప్రవాసంలోకి వెళ్లాడు.మళ్లీ తన రాజ్యంలో అడుగుపెట్టగానే.. అంతే ఆదరణ, అవే జయజయధ్వానాలు. మునుపటికి మించినవైభవం. దాంతో ఉప్పొంగిన కృతజ్ఞతాభావంతో ఆ రాజ్య సేవకుడిగానే జీవితాంతం ఉండిపోవాలనుకున్నాడు. ఈ కథలోని రాజ్యం తెలుగు సినీ పరిశ్రమఅయితే.. ఆ చక్రవర్తి అగ్రనటుడు కొణిదెల చిరంజీవి. దాదాపు దశాబ్ద కాలం వెండితెరకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. ‘ఖైదీ నెం150’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. కలెక్షన్ల సునామీ సృష్టించి, బాక్సాఫీస్ను షేక్ చేశారు.ఇనుమడించిన ఉత్సాహంతో వరుస సినిమాలు చేస్తున్న ఈ అగ్ర కథా నాయకుడి తాజా చిత్రం ఆచార్య’. తనయుడు రామ్చరణ్తో కలిసి నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు. ఈ నెల 29న ‘ఆచార్య’ ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవితో ‘నమస్తే తెలంగాణ’ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ( Mega Star Chiranjeevi Exclusive Interview )..
రామ్చరణ్, మీరూ కలిసి నటించాలనే ఆలోచన ఎవరిది?
ఆ క్రెడిట్ మాత్రం వాళ్ల అమ్మ సురేఖదే. చరణ్ను, నన్నూ కలిపి ఒక సినిమాలో చూడాలనేది ఆమె కోరిక. గెస్ట్ రోల్స్లో కనిపించాం కానీ, పూర్తిస్థాయి సినిమాలో నటించాలని కోరుకుంది. సురేఖ అను కున్నదానికి కొరటాల చెప్పిన కథ బాగా కుదిరింది.
మరో పాత్రలో చరణ్నే ఎందుకు తీసుకోవాలని అనుకున్నారు?
కథలో మరో శక్తిమంతమైన పాత్ర ఉంది. దానికి స్టార్డమ్ ఉన్న హీరో కావాలి. చరణ్ను అనుకున్నప్పుడు తను ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నాడు. ఆ సినిమాలో కొన్ని గెటప్స్ ఉన్నాయి. షూటింగ్ ఉన్నా లేకపోయినా వాటిని అలాగే ఉంచుకోవాలి. పైగా దర్శకుడు రాజమౌళి గురించి తెలుసు కదా, తన ప్రాజెక్ట్లోకి వెళ్లాక ఎవర్నీ బయటికి వెళ్లనివ్వడు. ఈ సమయంలో మరికొందరు హీరోలను కూడా ఈ పాత్రకు అనుకున్నాం. కానీ చరణ్ ఉంటేనే బాగుంటుందని అనిపించేది. రాజమౌళి ఈ కథ గురించి, ఇందులో చరణ్ ప్రాధాన్యం గురించి తెలిసి పంపించాడు.
ఆచార్య, సిద్ధ పాత్రలు ఎలా ఉంటాయి?
ఈ సినిమా చూస్తే మేమే ఈ రెండు పాత్రల్లో ఎందుకు నటించామనేది తెలుసుకుంటారు. ఇందులో మేం అన్నాదమ్ములం కాదు, గురు శిష్యులం కాదు. ఒక హృద్యమైన అనుబంధంతో మా పాత్రలు సాగుతుంటాయి. దర్శకుడు రెండు పాత్రలనూ అందంగా డిజైన్ చేశాడు. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే మంచి సినిమా ‘ఆచార్య’.
తండ్రీకొడుకులుగా సెట్లో మీ అనుభవాలు చెప్పండి..
ఇంట్లో కలిసి ఉండటం వేరు. వృత్తిపరంగా పనిచేయడం వేరు. ఆచార్య కోసం 12 రోజులు మారేడుమిల్లిలో షెడ్యూల్ కలిసి చేశాం. ఈ షూటింగ్ సమయంలో ఒకే ఇంట్లో ఉన్నాం. ఉదయమే లేచి జిమ్ చేయడం, సెట్స్కు కలిసి వెళ్లడం, కలిసి భోజనం చేయడం..ఇలా ఎంతో విలువైన సమయం గడిపాం. ఇదొక అద్భుతమైన సంఘటన. అందుకే అవన్నీ వీడియో క్యాప్చర్ చేసి పెట్టుకున్నా. ఈ విధంగా ఆచార్య ఎన్నో మధుర జ్ఞాపకాలు మిగిల్చింది. మా ఇద్దరికీ అందమైన అనుభూతిని అందించిన సినిమా ఇది.
నటనలో ఎవరు ఎవర్ని డామినేట్ చేశారు ?
ఎవరి పాత్రల మేరకు వాళ్లం నటించాం. నటన సహజంగా రావాలనేది నా ఉద్దేశం. అందుకే చరణ్కు నేనెప్పుడూ ఇలా నటించు, అలా నటించు అని సలహాలు ఇవ్వను. నేను చెప్పినట్లే చేస్తే తెరమీద ఇద్దరు చిరంజీవులు కనిపిస్తారు. చరణ్ తనదైన తరహాలో నటించాడు. మా సీన్స్లో కొన్నిసార్లు తను అనుకున్నట్లు రాకుంటే రీటేక్ చెప్పేవాడు. కథను బలంగా ముందుకు తీసుకెళ్లాలనేదే మా ఇద్దరి ప్రయత్నం. పాటలో నేను చరణ్ను డామినేట్ చేశానని సరదాగా అన్నానంతే. ఇద్దరం కలిసి ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాం. అంతేతప్ప పోటాపోటీగా నటించడం అనేది కాదు.
ఆర్ఆర్ఆర్ చిత్రానికి రామ్చరణ్కు వస్తున్న ప్రశంసల గురించి..!
‘ఆర్ఆర్ఆర్’లో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ పోటాపోటీగా నటించారు. హావభావాలు, అభినయం, డ్యాన్సులు, ఫైట్స్.. ఇలా ప్రతి విషయంలో ఎవరికి వారు తగ్గకుండా శ్రమించారు. వీళ్లిద్దరినీ అరేబియన్ జోడు గుర్రాల్లా నడిపించాడు రాజమౌళి. నేను తండ్రిగా గర్వించే స్థాయికి ఎప్పుడో ఎదిగాడు చరణ్. నటుడిగా కూడా ఎంతో పరిణతి చెందాడు.
ధర్మస్థలి నగరి, నక్సలిజం రెండు భిన్నమైన నేపథ్యాలు.ఈ కథలో అవి ఎలా కుదిరాయి?
రెండు భిన్నమైన అంశాలను కలిపి ఒకే కథలో అందంగా చెప్పడమే దర్శకుడు కొరటాల ప్రత్యేకత. అది తెరకెకించడంలో విజయం సాధించాడు. ఆచార్య విజయంపై పూర్తి నమ్మకాన్ని కలిగించాడు.
దాదాపు దశాబ్ద కాలం మీరు చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ఆ ఆకలి ఇప్పుడు వరుస చిత్రాలతో తీర్చుకుంటున్నారా?
నన్ను అడిగితే ఆకలి ఉండాలంటాను. అది నిరంతర ఆకలి. కడుపు నిండినట్లు వ్యవహరిస్తే మన వృత్తికి న్యాయం చేయనట్లే. పరిశ్రమకు వచ్చినప్పుడు ఎంత ఆకలితో వస్తాం. పేపర్లో చిన్న వార్త వస్తే చాలనుకుంటాం, పోస్టర్లో ఫొటో వస్తే నలుగురు స్నేహితులకు చెప్పుకొంటాం. సినిమాలో చిన్న వేషం దక్కితే ప్రపంచాన్నే జయించినట్లు ఆనందపడిపోతాం. చిత్ర పరిశ్రమలోకి రావాలనే బలమైన కోరిక వల్లే ఇంత ఆరాటపడతాం.
ఇప్పుడు అన్నీ లభించాక, ఆ కోరిక ఎంత తగ్గితే వృత్తికి అంత అన్యాయం చేసినట్లు. అందుకే మనలో ఆకలి తగ్గిపోకూడదు. నా అణువణువునా సినిమా మీద ఎనలేని ప్రేమ, ఇష్టం ఉన్నాయి. అందుకే దేవుడు నాకు పునర్జన్మ లాంటి సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చాడా అనిపిస్తుంటుంది. నాకు అనిపించి వెళ్లానో, ప్రజలు అడుగుతున్నారని వెళ్లానో గానీ రాజకీయాల్లో ఇమడలేకపోయాను. కొందరు పొలిటికల్గా విజేత కాలేదని అంటారు. కానీ, నేనుండాల్సిన చోటు అది కాదని తెలుసుకున్నా.
మళ్లీ నటించాలని అనుకున్నప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉండేవి ?
పదేండ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాం. మనపై ప్రేక్షకుల ప్రేమ, అభిమానం అలాగే ఉన్నాయా అనే సందేహం కలిగింది. ఎందుకంటే పదేండ్లలో ఓ తరం కొత్త హీరోలు వచ్చేస్తారు. ఆడియన్స్ డైవర్ట్ అవుతారు. తిరిగొచ్చాక నన్నే చూడాలని ఏముంది? మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్.. ఇలా చాలా మంది హీరోలే ఉన్నారు. అయినా నేను చేసిన ‘ఖైదీ నంబర్ 150’ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత సైరా కూడా మంచి సక్సెస్ అందుకుంది.
ఈ సినిమాల విజయాలు చూశాక నా ప్రేక్షుకుల పునాది బలంగా ఉందనే ధైర్యం కలిగింది. చిరంజీవి తెరపై కనిపిస్తే చాలు అనుకునే అభిమానుల ప్రేమ మారలేదు. దీంతో నాకు పరిశ్రమ పట్ల, ప్రేక్షకుల పట్ల మరింత కృతజ్ఞతాభావం ఏర్పడింది. అందుకే రెట్టించిన ఉత్సాహంతో సినిమాల్లో నటిస్తున్నాను. ఈ మధ్య ఒకే నెలలో నాలుగు సినిమాల్లో నటించాను. నేను చాలా బిజీగా ఉన్న 80, 90 దశకాలు గుర్తొచ్చాయి. ఈ క్రమంలోనే ‘ఆచార్య’ మీ ముందుకు వస్తున్నది. ఈ సక్సెస్ చరణ్ ఖాతాలోకి వెళ్తుందా, నాది అనిపించుకుంటుందా? అన్నది చూడాలి.
స్టార్ హీరోలకు అంత సులువుగా మంచి కథలు దొరకవు. యుద్ధాన్ని ఆయుధాలు వెతుకుంటూ వచ్చినట్లు మీకు మాత్రం స్టోరీస్ దొరుకుతున్నాయి..!
అవును. మంచి కథలు వస్తున్నాయి. అందులో కొన్ని రీమేక్స్ ఉన్నాయి. రీమేక్స్ విషయంలో మనం హద్దులు పెట్టుకోకూడదు. వాటిని తకువ చేసి చూడాల్సిన పనిలేదు. పరభాషలోని ఓ మంచి కథ మన ప్రేక్షకులకు మనదైన తరహాలో చూపిస్తుంటాం. నా సినిమాలు కూడా మిగతా భాషల్లో పునర్నిర్మాణం అయ్యాయి. వాస్తవానికి సొంత సినిమా చేసుకోవడం కంటే రీమేక్ తెరకెకించడమే సవాలు. ప్రతి దానికీ పోలికలు వస్తుంటాయి. నా కెరీర్ మొదలైనప్పటి నుంచీ రీమేక్స్ చేస్తున్నాను. ‘పున్నమి నాగు’, ‘మొగుడు కావాలి’, ‘ఠాగూర్’.. ఇలా నేను చేసిన రీమేక్స్ అన్నీ వాటి మాతృకలను మించిన విజయాలు సాధించాయి. ఒక సినిమా మన దగ్గర చేస్తున్నామంటే కథేంటో తెలుసుకుని ఆ ఒరిజినల్ను మర్చిపోతాను. ఇప్పుడు చేస్తున్న లూసిఫర్ రీమేక్ ‘గాడ్ ఫాదర్’, వేదాళం రీమేక్ ‘భోళా శంకర్’ కూడా మాతృకలకు భిన్నంగా ఉంటాయి.
దర్శకుడు కొరటాల శివ సినిమాలు కమర్షియల్ అంశాలతోపాటు సందేశాత్మకంగా ఉంటాయి. ‘ఆచార్య’లో ఆ మేళవింపు ఎలా ఉంటుంది?
వందశాతం ఇది కొరటాల తరహా చిత్రమే. అందులో నా ఇమేజ్, చరణ్ ఇమేజ్కు తగిన అంశాలను చేర్చారు. మాస్ అంశాలతో పాటు అంతర్లీనంగా సందేశాన్ని చెప్పారు దర్శకుడు. ఆ బ్లెండింగ్ చాలా బాగా కుదిరింది. ఇందులో చరణ్ది చిన్న క్యారెక్టర్ కాదు. తొలి భాగం సినిమాను నేను నడిపిస్తే, మలిభాగం చరణ్ ముందుకు తీసుకెళ్తాడు. దాదాపు సమానంగా ఉంటాయి రెండు పాత్రలూ. ఇది మా ఇద్దరి సినిమా. వినగానే నాకు నచ్చిన కథ ఇది. ఫస్ట్ నెరేషన్లో ఓకే చేసిన నా చిత్రాలన్నీ విజయాలు సాధించాయి. ఆచార్య మీదా ఆ నమ్మకమే ఉంది.
టికెట్ రేట్లపై తెలుగు రాష్ర్టాల ప్రభుత్వాలతో చర్చలు జరిపి ఒప్పించడం మీకెలాంటి సంతృప్తినిచ్చింది?
కళామతల్లి నాకు ఇంత పొజిషన్ ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకొనే అవకాశంగా భావించాను. దారి తప్పిన చిన్న పిల్లాడిలా అగమ్యగోచరమైన పరిస్థితి ఉండేది. ఇలాంటి సమయంలో చాలా మంది నిర్మాతలు నావైపు చూశారు. తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులతో నాకు మంచి అనుబంధం ఉంది. టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పుడు నేను చేతులు జోడించానని కొందరు అన్నారు. నేను చేతులు జోడించి అడిగింది నా స్వార్థం కోసం కాదు, పరిశ్రమ బాగు కోసం. ఇందుకు నేను సిగ్గుపడటం లేదు. అడిగిన వెంటనే ఇరు రాష్ర్టాల ప్రభుత్వాలు పాజిటివ్గా స్పందించాయి. వాళ్లకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా బాధ్యత తీసుకున్నట్లేనా?
ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అనే పదాన్ని నేను అంగీకరించను. ‘పెద్ద బిడ్డ’ అని పిలిస్తే చాలు. పరిశ్రమ ఏ ఒకరిదీ కాదు. అయితే, సమస్య వచ్చినప్పుడు ముందు నిలబడటానికి, పరిశ్రమ గొంతు అవడానికి ఎప్పుడూ సిద్ధమే.
తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిని చేరడంపై మీ స్పందన ఏంటి?
హద్దులు చెరిపేసి.. తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి చేరినందుకు గర్వించే మొదటి హీరోను నేనే. ఎందుకంటే నేను నటించిన రుద్రవీణ సినిమాకు నర్గీస్దత్ జాతీయ పురసారం తీసుకునేందుకు వెళ్తే, అకడ హాల్లో మన దక్షిణాది దిగ్గజ తారలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎమ్జీఆర్, రాజ్కుమార్.. ఇలా ఎవరి ఫొటోలూ లేవు. నేను హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆవేదన తెలిపాను. అప్పుడు తెలుగు సినిమా అంటే మదరాసీ అనేవాళ్లు.
ఈ ముద్ర పోగొట్టేందుకు నేను హిందీలో ‘ప్రతిబంధ్’, ‘ఆజ్ కా గుండారాజ్’, ‘జెంటిల్మన్’ సినిమాలు చేశాను. అటు తమిళం నుంచి కమల్ హాసన్, రజనీకాంత్ ప్రయత్నించారు. అప్పుడు మా సినిమాలకు హిందీలో దొరికిన స్థానం తకువ కాబట్టి ఆ ముద్రను చెరపలేకపోయాం. ఇవాళ ఎస్.ఎస్.రాజమౌళి, శంకర్, సుకుమార్, ప్రశాంత్ నిల్ లాంటి దర్శకులు మన సినిమాలను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు. అటు కన్నడ నుంచి ‘కేజీఎఫ్’ లాంటి చిత్రాలు బాలీవుడ్తో పోటీ పడుతున్నాయి. సాంకేతికంగా హాలీవుడ్తో సమానంగా నిలుస్తున్నాం. మనదైన ఓ ఉనికి కోసం మొదట ప్రయత్నించిన హీరోగా ఇవన్నీ నాకు గర్వకారణం.
దర్శకులతో స్నేహితుడిలా ఉంటారని అంటారు?
నేను పనిచేస్తున్న మోహన్ రాజా, బాబీ, మెహర్ రమేష్ వీళ్లంతా ప్రతిభావంతులు. నాకు బాగా పరిచయం ఉన్నవారే. ముందు నేను మెగాస్టార్ అనే స్థాయిని వాళ్ల ముందు చూపించను. స్నేహితుల్లా చూసుకుంటా. దాంతో వాళ్లకు నాతో కలిసి పనిచేసే చనువు ఏర్పడుతుంది. నాతో మాట్లాడే ధైర్యం వస్తుంది. ఆ సౌఖ్యం వాళ్లకు కల్పిస్తుంటా. నేను ఏదైనా సరిగ్గా చేయకున్నా నాతో చెప్పే చనువు ఇస్తాను.
ఇంత సుదీర్ఘమైన కెరీర్ చూసిన తర్వాత మీలో ఇంకా ఉత్సాహాన్ని నింపుతున్నది ఏంటి?
మొదట్లో పేరు, డబ్బు కోరుకున్నాం, ఆ రెండూ దకాయి. ఇప్పుడు వాటి కోసం కాదు, వీటన్నిటిని మించి నేను ఇంకా ఏదో ఆస్వాదిస్తాను.. ఆత్మ సంతృప్తి కోసం సినిమాలు చేస్తున్నా. నా అభిమానులకు, ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు పనిచేస్తున్నా. ముంబైలో సల్మాన్ ఖాన్తో ‘గాడ్ ఫాదర్’ సినిమా కోసం మూడు రోజులు వరుసగా పనిచేసి, తర్వాతి రోజు ఉదయం 154వ చిత్రం సెట్స్కు వెళ్లాను. ఇంత తీరిక లేకుండా పనిచేసే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అందుకు సంతోషపడతా. చాలా మందికి చేద్దామంటే పని లేదు. నాకు ఇచ్చినప్పుడు కష్టపడేందుకు ఏ ఇబ్బందీ లేదు. నా కెరీర్లో ఇప్పుడున్నంత బిజీగా ఎప్పుడు లేనేమో.. నా స్పీడు ఇప్పటితో ఆపను.. ఇంకా చాలా సర్ప్రైజింగ్ ప్రాజెక్ట్స్ సంప్రదింపుల దశలో ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తా.
-మడూరి మధు ( Maduri Mattaiah )