భారత సంతతి బ్రిటిష్-అమెరికన్ మధుర్ జాఫ్రీ సుప్రసిద్ధ వంటల పుస్తకాల రచయిత్రి, టీవీ చెఫ్, ఉపాధ్యాయురాలు, నటి. తాజాగా, అమెరికాకు చెందిన జేమ్స్ బయర్డ్ ఫౌండేషన్ ఆమెను జీవన సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసింది. ‘అమెరికా ప్రజల్లో ఆహారం, భోజన విధానం, పోషకాలకు సంబంధించిన ఆలోచనల మీద అపార ప్రభావం చూపిన వ్యక్తుల్లో మధుర్ ఒకరు’ అని ఈ సందర్భంగా ఫౌండేషన్ పేర్కొంది.
ఈ పురస్కారానికి ఎంపికైన తొలి భారతీయురాలు, దక్షిణాసియాకు చెందిన వ్యక్తి మధుర్. పాకశాస్త్ర రంగంలో మధుర్ కృషికిగాను గతంలో బ్రిటిష్ రాణి ఎలిజబెత్-2 ‘కమాండర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్’ (సీబీఈ) గౌరవాన్ని ప్రసాదించారు. 2022లో భారత ప్రభుత్వం పద్మభూషణ్తో గౌరవించింది. ఇటీవలి జీవితకాల పురస్కారంతో కలిపి మధుర్ ఇప్పటికి తొమ్మిదిసార్లు జేమ్స్ బయర్డ్ ఫౌండేషన్ నుంచి వివిధ గౌరవాలు అందుకున్నారు.
‘షేక్స్పియర్ వాలా’లో ఆమె నటనకు 1965 బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లోనే సిల్వర్ బేర్ వరించింది. భారతీయ వంటకాలను పరిచయం చేస్తూ రచించిన ‘ఎన్ ఇన్విటేషన్ టు ఇండియన్ కుకింగ్’, ‘కరీ ఈజీ’ (శాకాహార కూరల మీద), ‘వరల్డ్ వెజిటేరియన్’, ‘అల్టిమేట్ కరీ బైబిల్’ లాంటి అనేక వంటల పుస్తకాలను రచించారు మధుర్. వీటిలో చాలావరకూ అవార్డులు గెలుచుకున్నాయి. అందుకే ఆమెను ‘గాడ్మదర్ ఆఫ్ ఇండియన్ కుకింగ్’ అని పిలుచుకుంటారు. ‘ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం రావడం సంతోషకరం’ అని పేర్కొన్నారు మధుర్. ఆమె కెరీర్ నటనతో మొదలైంది. తల్లి సాయంతో వంట నేర్చుకున్నారు. మొదటి భర్తతో విడాకుల తర్వాత, కుటుంబ పోషణ కోసం కుకరీ క్లాసులు తీసుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత కాలంలో వంటల పుస్తకాలు రాయడం ప్రారంభించారు. అవి ప్రపంచ దేశాల్లో బెస్ట్ సెల్లర్స్గా నిలిచాయి. మధుర్ను ఉన్నత స్థానంలో నిలబెట్టాయి.