గురుపూర్ణిమను గురువుకు సంబంధించినదిగా చెబుతారు. కానీ, నిజానికి ఇది భక్తునికి సంబంధించిన రోజు. విద్యార్థి, శిష్యుడు, భక్తుడు.. ఎవరికి వారు గురువు ఆశ్రయంలో తమ తమ లక్ష్యాలను అందుకునే ప్రయత్నం చేసేవారే. ఉపాధ్యాయుడు చెప్పే పాఠాల ద్వారా సమాచారం పొందుతాడు విద్యార్థి. మోక్ష సాధనే లక్ష్యంగా గురువు చూపిన బాటలో పయనిస్తూ ఉంటాడు శిష్యుడు. తన జీవిత పరమార్థం తెలుసుకోవడమే శిష్యుడి ప్రధాన కోరిక. అతని ప్రయత్నమంతా ‘తన’పైనే కేంద్రీకృతమై ఉంటుంది. గురువు అనుగ్రహంతో నిదానంగా జ్ఞాన సముపార్జన చేస్తాడు. ఏదో ఒకనాటికి అతడు ఆత్మజ్ఞానం పొందే అవకాశం ఉంటుంది.
భక్తుడు జ్ఞానం కోసం గురువును ఆశ్రయించడు. అతడు గురువుతో, అనంతత్వంతో, భగవంతునితో గాఢమైన ప్రేమలో మునిగిపోయి ఉంటాడు. సద్గురువు ఆశ్రయంలో తన గురించి తాను పట్టించుకోడు. జ్ఞానంతో అతడికి పనిలేదు. భగవంతునితో ప్రేమలో లీనమై ఉంటాడు. విద్యార్థులు కోకొల్లలుగా ఉంటారు. శిష్యులూ కొందరుంటారు. కానీ, భక్తులు అరుదుగా ఉంటారు. వారిని వెతికి పట్టుకోవడం కష్టమే!
బుద్ధుడి శిష్యులలో ఒకడైన సారిపుత్రుడు అలాంటి భక్తుడే. సారిపుత్రుడు ఆత్మజ్ఞానాన్ని పొందాడు. వెంటనే అతడి గురువైన బుద్ధుడు సారిపుత్రుడిని పిలిచి, ‘నాయనా! నీవు ఇక వెళ్లవచ్చు. ప్రపంచానికి మంచిని బోధించు. నా పనిని కొనసాగించు’ అన్నాడట. గురువు ఆజ్ఞమేరకు సారిపుత్రుడు బుద్ధుని సాంగత్యం వదిలి వెళ్లిపోసాగాడు. అతడికి పుట్టెడు దుఃఖం పొంగుకు వచ్చింది. కంటికీ మింటికీ ధారగా ఏడ్వటం మొదలుపెట్టాడు. ఆత్మజ్ఞానం పొందినవాడు ఇంతలా ఎందుకు బాధపడుతున్నాడో అక్కడున్న వారికి అర్థం కాలేదు. ‘ఎందుకు ఏడుస్తున్నావ్?’ అని అడిగారు. దానికి సారిపుత్రుడు, ‘నాకు ఈ ఆత్మజ్ఞానం ఎందుకు? ఇది నేను కోరుకున్నది కాదు. కొన్నాళ్లయ్యాక వచ్చినా బాగుండేది. మరికొంతకాలం బుద్ధుని దగ్గర ఉండే అదృష్టం కలిగేది. ఆయన పాదాల దగ్గర భక్తుడిగా ఉండటంలో గల ఆనందమే వేరు. అది కోల్పోయినందుకే ఏడుస్తున్నాను. ఆత్మజ్ఞానం కన్నా అదే గొప్పది’ అన్నాడట. భక్తిలోని సౌందర్యమిది. భక్తిభావం, ప్రేమ సంపూర్ణంగా వికసించినప్పుడే పరిపూర్ణమైన భక్తుడిగా మారుతారు.
ప్రేమ, భక్తి మిళితమైన భక్తుడికి భగవంతుడే మిన్నగా కనిపిస్తాడు. ఆత్మజ్ఞానం సాధించడం కన్నా, భక్తుడిగా ఉండిపోవడాన్నే గొప్పగా భావిస్తాడు. అలాంటి భక్తుల మధ్య భగవంతుడు సదా కొలువుదీరి ఉంటాడు.
శ్రీకృష్ణుడు శరీరాన్ని త్యజించడానికి ముందు తన మిత్రుడైన ఉద్ధవుడిని పిలిపించుకున్నాడు. కన్నీళ్లు నిండిన కండ్లతో కనిపించాడు కృష్ణుడు.
‘ఉద్ధవా! ఈ గోపికలు చాలా అందమైనవారు (మానసికంగా). వారికి నాపై భక్తి ఎంతటిదంటే… నేను దానిని భరించలేకున్నాను. నువ్వు వెళ్లి నా భక్తుల (గోపికలు)తో మాట్లాడు. వారి కృతజ్ఞత నుంచి, ప్రేమ నుంచి నన్ను విముక్తుడిని చేయమని చెప్పు. నా భక్తులు ఎక్కడైతే ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉంటారో, నేను అక్కడ వారితోనే ఉంటానని చెప్పు’ అన్నాడట శ్రీకృష్ణుడు. భక్తిపాశం అంతటి మహత్తరమైనది.
భక్తే నిజమైన ప్రేమ. దైవం సైతం ఆ ప్రేమలో మునిగిపోతాడు. భక్తుడు దైవం కోసం ఎంతగా తపిస్తుంటాడో, దైవమూ భక్తుడి కోసం అంతగా పరితపిస్తుంటాడు. తన భక్తుడిని అక్కున చేర్చుకోవాలని ఆరాటపడుతుంటాడు. వాళ్ల చెంతనే ఉండాలని కోరుకుంటాడు. భక్తుడు ఆనందించినప్పుడే భగవానుడికీ ఆనందం. అచంచలమైన ప్రేమతో భగవంతుడిని మెప్పించే భక్తునికి సంబంధించిన రోజు.. గురుపూర్ణిమ.
(రవిశంకర్జీ ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకులు)
శ్రీశ్రీ రవిశంకర్