తెలంగాణ ఇలవేల్పు యాదగిరిగుట్ట నర్సన్న పెండ్లికొడుకు అవుతున్నాడు. కొండల్లో వెలిసిన ఉగ్రమూర్తి కల్యాణం వేళకు ముసిముసి నవ్వులతో సిద్ధమవుతాడు. ఉగ్ర తత్వం, వీరత్వంతో ఊగిపోయే వాడు కాస్తా అలివేణి చిటికెన వేలు పట్టుకోగానే లక్ష్మీవల్లభుడై పొంగిపోతాడు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం లక్ష్మీదేవి, నరసింహస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా ప్రహ్లాదుడిని కాపాడటానికి హుటాహుటిన ఆవిర్భవించిన నరసింహుడి తత్వాన్ని సింహావలోకం చేసుకుందాం…
సమయాసమయాలు లేవు. స్థల ఔచిత్య నియమాలు అంతకన్నా లేవు. దివాసంధ్యల ప్రస్తావన లేదు. ఉన్నదల్లా ఒక్కటే… ప్రహ్లాదుడి అణువణువులో నిండిన నారాయణుని భక్తి. అనంతమైన ప్రకృతిలో నిండిన పరమాత్మను దర్శించిన ప్రహ్లాదుడికి మాత్రమే తెలుసు భగవంతుడు సర్వవ్యాపి అని! తాను పిలిస్తే దైవం వస్తాడని అతడి నమ్మిక. అందుకే, స్తంభాన్ని చీల్చుకుని ఉగ్రనారసింహుడు ఆవిర్భవించాడు. క్షణాల్లో క్రోధాన్ని ఆవహింపజేసుకుని, తమోగుణప్రధాన రూపమై, తానే రుద్రుడై శ్రీహరి నరసింహుడిగా వచ్చాడు. ఆగ్రహం, అనుగ్రహం ఒకే సమయంలో ప్రకటించగల మూర్తి నరసింహస్వామి.
నరసింహావతారంలోని మరొక విశిష్టత – ఇది శివ, విష్ణు అంశల కలయిక. స్థితి కారుడైన విష్ణువు నర రూపం, లయకారుడైన శివుడి సింహస్వరూపం రెండూ కలిసి నరసింహ స్వరూపంగా ఆవిర్భవించాయి. విష్ణుమూర్తి సర్వాంతర్యామిత్వాన్ని నరసింహావతారం చాటి చెబుతుంది. ఇదే పరమాత్మ అంతర్యామిత్వం, విష్ణుతత్వం కూడా. ఇక బ్రహ్మపురాణంలో నరసింహ అవతార గాథ ఇతర పురాణాల కన్నా చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఇందులో ప్రహ్లాదుడి ప్రస్తావన, హిరణ్యకశిపుడి విష్ణుద్వేషం ఉండవు. కేవలం రుషులు, మునులు, దేవతల బాధా నివృత్తి కోసమే విష్ణుమూర్తి నరసింహుడిగా అవతరించినట్లు చెబుతుంది.
విష్ణుపురాణంలో కొంత విభిన్నమైన గాథ కనిపిస్తుంది. మిగిలిన అంశాలన్నీ పోతన రాసిన ప్రహ్లాద చరిత్ర తీరులోనే ఉన్నప్పటికీ, తండ్రి చేసిన తప్పుల్ని మన్నించమని ప్రహ్లాదుడు వేడుకోవటంతో శ్రీహరి అంగీకరించటం, పితాపుత్రులిద్దరూ కలిసి కొంతకాలం జీవించటం జరుగుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి విష్ణువు నరసింహరూపంలో హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. వీటితోపాటు పద్మ, విష్ణుధర్మోత్తర, స్కాంద, కూర్మ, లింగ, మత్స్య, భాగవత, నరసింహ, హరివంశ పురాణాల్లో కూడా నరసింహావతార విశేషాలు ఉన్నాయి. వీటన్నిటిలో భాగవత పురాణంలో ఉన్న నరసింహ అవతార గాథ విస్తారంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. శత్రుత్వాన్ని వహించిన వాడైనప్పటికీ హిరణ్యకశిపుడు నిరంతరం విష్ణు నామాన్ని స్మరిస్తూనే ఉంటాడు. భక్తుడైన ప్రహ్లాదుడి దృష్టి మరొక వస్తువు మీద కొన్ని క్షణాల పాటు ఉంటుందేమో కానీ, హిరణ్యకశిపుని చిత్తం మాత్రం నిరంతరం విష్ణుద్వేషంతో నిండి ఉండేది. ఫలితంగా నరసింహుడి చేతిలో హిరణ్యకశిపుడు అంతమయ్యాడు. లౌకిక దేహాన్ని వదిలిన హిరణ్యకశిపుడు స్వర్గలోకాన్ని చేరుకుంటాడు. ఆశ్చర్యం అనిపించకమానదు. ద్వేషించినవాడికి సైతం మోక్షాన్ని ప్రసాదించే అనుగ్రహమూర్తి నరసింహస్వామి అని ఈ వృత్తాంతం ద్వారా తెలుస్తుంది.
మంత్రమూర్తి నరసింహుడు
నరసింహుడు కేవలం అవతారమూర్తి మాత్రమే కాదు. ఆ స్వామి మంత్రమూర్తి. వేదాంతాలుగా భాసిల్లే ఉపనిషత్తుల్లో నరసింహతత్వం వర్ణితమై ఉంది. నరసింహుని పరబ్రహ్మస్వరూపం, తత్వం స్వామి నామ మంత్రాన్ని పరిశీలిస్తే అవగతమవుతుంది. ‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం- నృసింహం భీషణం భద్రం మృత్యుఃమృత్యుం నమామ్యహం’ ఈ నామరూప మంత్రంలో ఒక్కో నామం నరసింహుడి ఒక్కో తత్వాన్ని ప్రకటిస్తుంది.
ఉగ్రం- నృసింహుడు ఉగ్రమూర్తి. ఈ ఉగ్రత్వం వల్ల సకల లోకాలు పాలించబడుతున్నాయి. నరసింహుని హుంకారాన్ని విన్నంతమాత్రంలోనే అంతర్గత, బహిర్గత శత్రునాశనం జరుగుతుంది.
వీరం- సకల కార్యకారణాలకు మూలంగా ఉన్న శక్తినే వీరం అంటారు. నరసింహస్వామి వీరమూర్తి. అంటే, ఆయన సకల కార్యకారణ స్వరూపుడు.
మహావిష్ణుం- అన్నిలోకాల్లో అంతటా ఉండే నరసింహ తత్వానికి ఈ నామం ప్రతీక. సకల ప్రపంచంలోని జీవరాశులన్నిటిలో తానే వ్యక్తంగాను, అవ్యక్తంగాను పరమాత్మ భాసిస్తాడు.
జ్వలంతం- ఈ నామంలో నరసింహుని యోగతత్వం ప్రకటితమవుతుంది. సకల లోకాల్లో, సర్వాత్మల్లో తన తేజస్సును ప్రకాశింపజేయడం ద్వారా వాటి ప్రకాశానికి కారణమైన నరసింహతత్వమే ‘జ్వలంతం’ శబ్దానికి అర్థం.
సర్వతోముఖం- ఇంద్రియ సాయం లేకుండా సకల విశ్వాన్ని చూడగల పరమాత్మ తత్వమే సర్వతోముఖత్వం. నరసింహుడు సర్వతోముఖుడు. సృష్టి ఆరంభంలో ఉన్న పరమాత్మ, ఆ తర్వాత ప్రపంచ నిర్వహణ కోసం అనేక శక్తులుగా మారిన తత్వమే సర్వతోముఖత్వం.
సృసింహం- సకల జీవుల్లో సింహం శ్రేష్ఠమైనది. అందుకనే పరమాత్మ లోకాలను ఉద్ధరించటానికి సింహాకృతి ప్రధానంగా ఆవిర్భవించాడు. సింహం పర్వతగుహల్లో నివసిస్తుంది. భక్తుల హృదయగుహల్లో నరసింహుడు కొలువై ఉంటాడు.
భీషణం- నరసింహుడి శాసనశక్తి ప్రతీక భీషణత్వం. సూర్యచంద్రాదుల ప్రకాశకత్వం, అష్టదిక్పాలకుల నిర్వహణతో సమస్తం నరసింహుని భీషణశక్తి కారణంగా నడుస్తున్నాయి. అత్యంత భయంకరమైన స్వరూపం ఇది.
భద్రం- భయాన్ని కలిగించే భీషణుడైన పరమాత్మే, ఆ భయాన్ని పోగొట్టి అభయాన్ని కూడా ఇస్తాడు. అదే భద్రత్వం. నరసింహ తత్వంలోని మరో కోణానికి ప్రతీక ఇది. తనను శరణు వేడిన వారికి భద్రత్వాన్ని ఇస్తాడు స్వామి.
మృత్యుఃమృత్యుం- స్మరణ మాత్రం చేత అపమృత్యువును దూరం చేసే వాడు, మృత్యువుకే మృత్యువైన వాడు నరసింహుడు.
ఉగ్రమూర్తి అయినప్పటికీ నరసింహస్వామి పూర్తిగా కరుణాంతరంగుడు. కన్నతండ్రి బిడ్డను అదిలించేటప్పుడు ఎలా ఉగ్రత్వాన్ని ప్రదర్శిస్తాడో, పరమాత్మ కూడా అంతే! ఆ ఉగ్రమూర్తిలోని శాంతమూర్తిని ఉపాసన చేస్తే శుభపరంపరలే కలుగుతాయి. మృగస్వభావం ప్రతి మనిషిలో అంతర్లీనంగా ఉంటుంది. అయితే అది పరిధి దాటకూడదు. అలాకాకుండా, మృగస్వభావం మితిమీరితే ప్రతి మనిషీ హిరణ్యకశిపుడే అవుతాడు. అప్పుడు భగవంతుడి అంశ దానిని తప్పకుండా సంహరిస్తుంది. నరసింహావతారం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. కాబట్టి, మృగత్వం మానవత్వాన్ని ఎప్పుడూ దిగజార్చకూడదు. నరసింహ ఉపాసన ద్వారా అరిషడ్వర్గాలు అదుపులోకి వస్తాయి. ఇందుకు తగిన మానసిక శక్తి, అంతులేని ధైర్యం ఫలితాలుగా అందుతాయి. లక్ష్మీనారాయణుడే లక్ష్మీనరసింహుడు. ఉగ్ర నరసింహుడే లక్ష్మీవల్లభుడు. రూపం మాత్రమే వేరు… తత్వం మాత్రం ఒకటే!
– డా॥ కప్పగంతు రామకృష్ణ