విహార విశేషాలు కథలుగా రాస్తారు. నవలగా తీర్చిదిద్దుతారు. ఈ యాత్రికుడు మాత్రం ప్రయాణంలోని విచిత్రాలను అందమైన చిత్రాలుగా ఆవిష్కరిస్తున్నాడు. కనులను దోచే ప్రకృతి వింతలనే కాదు, గుండెను తట్టిలేపే సామాజిక కోణాలనూ కుంచెతో క్యాన్వాస్పై ఒలికిస్తున్నాడు. తన విహార విశేషాలను పదమూడు వేలకుపైగా లైవ్ డ్రాయింగ్స్గా వేసి అబ్బురపరుస్తున్నాడు మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన పోచం ఏల్పుల.
బాల్యం నుంచీ అంతే. బొమ్మలు వేయడంలో పోచం ఏల్పుల మహా నేర్పరి. చెన్నూరులో చదువుకునే రోజుల్లో సత్యనారాయణ సార్ దగ్గర చిత్రకళలో ప్రాథమిక విషయాలు నేర్చుకున్నాడు. తర్వాత, చిత్రకారుడు మద్దూరి రాజలింగు ప్రోద్బలంతో తెలుగు విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ అభ్యసించాడు. ఛత్తీస్గఢ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పట్టా కూడా అందుకున్నాడు. పోచం వాళ్లది నిరుపేద కుటుంబం. చిత్రకళతో పేరుప్రఖ్యాతలు సాధించాలన్నది పోచం కల. కానీ, కుటుంబ బాధ్యతలు అతడిని ఉద్యోగంలో చేరేలా చేశాయి. జూబ్లీహిల్స్లోని ఓ పాఠశాలలో రెండేండ్లు డ్రాయింగ్ టీచర్గా పనిచేశాడు. ఆ సమయంలోనే చిత్రకళపై మరింత లోతుగా అవగాహన కలిగింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కళాయాత్ర చేయాలని సంకల్పించుకున్నాడు. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. పోచం యాత్రకు ముందస్తు ప్రణాళికలేం ఉండవు. టికెట్కు సరిపడా డబ్బులుంటే చాలు, రెండు జతల దుస్తులు, డ్రాయింగ్ బుక్స్ బ్యాగులో పెట్టుకొని రైలెక్కేస్తాడు. మజిలీ మజిలీలో మనసుకు నచ్చిన దృశ్యాన్ని చిత్రీకరిస్తాడు. చుట్టూ ఉన్నవారు గమనించి ఏదైనా పెడితే తింటాడు. లేదంటే పస్తులుంటాడు. రాత్రిపూట బస్టాండ్లోనో, రైల్వేస్టేషన్లోనో పడుకుంటాడు. ఎక్కడికి వెళితే అక్కడి వారితో స్నేహం చేస్తాడు. ఒక సైకిల్ సంపాదిస్తాడు. ఆ సైకిల్పై చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చుట్టేస్తాడు. అపురూప దృశ్యాలు కంటపడితే వాటిని క్యాన్వాస్పైకి ఎక్కించాక గానీ, అక్కడి నుంచి కదలడు. ఇలా వేలబొమ్మలు గీశాడు పోచం. ఆ ప్రయాణంలో ఎన్నో తీపి, చేదు అనుభవాలు. ఉత్తర ప్రదేశ్లో ఓ చోట బందిపోట్ల దాడికి గురయ్యాడు. ఓంకారేశ్వర ఆలయ పూజారులతో సన్మానం అందుకున్నాడు. ఛత్తీస్గఢ్లో అటు పోలీసులు, ఇటు మావోయిస్టులు తమ శత్రువేమోనని అనుమానించారు. హరిద్వార్లో సన్యాసుల ఆదరణ, దండకారణ్యంలో గిరిజనులతో సహవాసం, వాఘా సరిహద్దులో జవాన్ల సహచర్యం ఇలా జీవితానికి సరిపడా అనుభవాలను పోగు చేసుకున్నాడు. ఈ జ్ఞాపకాలు పదికాలాలూ నిలిచి ఉండేలా అద్భుత చిత్రాలుగా మలిచాడు. పోచం ఎటు వెళ్లినా సైకిల్ వెనుక త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. ఇప్పటి వరకు 16 రాష్ర్టాల్లో పర్యటన పూర్తి చేసుకున్నాడు. మరో రెండేండ్లలో మిగతా రాష్ర్టాలన్నీ పర్యటిస్తానని చెబుతున్నాడు. తన కళాయాత్ర వల్ల ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో విద్యార్థి చిత్రకారుడైనా తన ప్రయత్నం విజయవంతం అయినట్టేనంటాడు పోచం ఏల్పుల.
… రాజు అతికం