వరలక్ష్మీ వ్రతం వేళ ఇంటిని అలంకరించుకోవడం అతివలకు మనసైన పని. ఆ అలంకరణలో దేవతా మూర్తులతోపాటు రకరకాల బొమ్మలనూ భాగం చేస్తుంటారు. అలాంటివాళ్ల కోసం ముద్దులొలికే అమ్మాయి బొమ్మలతోపాటు సిరికళ ఉట్టిపడే అష్టలక్ష్మి బొమ్మల్నీ తయారు చేస్తున్నారు హైదరాబాద్కు చెందిన దివ్య తేజస్విని. కరోనా సమయంలో ఆమె స్థాపించిన లలితా డాల్స్ సంస్థ ఆ ఇంట సిరులొలికిస్తున్నది.
కొవిడ్ చాలామందిని ఉద్యోగాలు కోల్పోయేలా చేసింది. దిక్కుతోచని పరిస్థితులను ఏర్పరచింది. కానీ అలాంటి సందర్భంలోనూ సృజనాత్మకంగా ఆలోచించారు దివ్య తేజస్విని. అవసరం అన్ని ఆవిష్కరణలకు అమ్మ అన్నట్టు.. దివ్య అవసరాలు బొమ్మల సంస్థ పుట్టుకకు దారితీశాయి. ఇప్పుడు అదే సంస్థ తనతోపాటు మరికొన్ని కుటుంబాలకూ దారి చూపిస్తున్నది.
పాపాయిదే తొలి బొమ్మ
ఎమ్మెస్సీ పూర్తి చేసిన దివ్య కొవిడ్ లాక్డౌన్ నాటికి హైస్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు. కరోనా ప్రారంభం నుంచే బళ్లు మూతబడటంతో ఆమెకు జీతం రాలేదు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న భర్తకూ ప్రాజెక్టు నిలిచిపోయింది. కుటుంబాన్ని ఎలా నడిపించాలో తోచని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో తన మూడేండ్ల పాపాయి కోసం ఒక బొమ్మకు చీరకట్టి దాన్ని అందంగా ముస్తాబు చేసిచ్చారు. దాన్ని చూసిన వాళ్లంతా ఎంతో ముచ్చటగా ఉందన్నారు. తనకున్న ఈ ప్రతిభను సంపాదనా మార్గంగా మార్చుకోవాలని భావించారు దివ్య. చిన్నతనంలో దివ్య వాళ్ల అమ్మ రకరకాల పూసలతో బొమ్మల కోసం బట్టలు అల్లేవారు. ఆమె స్ఫూర్తితోనే దివ్య కూడా బొమ్మల్ని అందంగా ముస్తాబు చేయడం నేర్చుకున్నారు.
అందుకే తన సంస్థకు అమ్మ పేరిట ‘లలితా డాల్స్’ అని నామకరణం చేశారు. తన ఇన్స్టాగ్రామ్ పేజీతోపాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుశ్రీయెన్సర్ల ద్వారా బొమ్మలకు ప్రచారం కల్పించారు. కొద్ది రోజుల్లోనే మంచి ప్రాచుర్యం వచ్చింది. నోములు, వ్రతాలు, బొమ్మల కొలువులతోపాటు పెండ్లి, వివాహ నిశ్చితార్థం, సీమంతం తదితర కార్యక్రమాలకు విభిన్న రకాల బొమ్మలను తయారు చేస్తున్నారు. దోగాడే కృష్ణుడి బొమ్మలూ, సీమంతం బొమ్మలకూ మంచి స్పందన వస్తున్నదంటారామె. ‘నెల రోజులు ముందుగానే ఆర్డర్ తీసుకుని సందర్భాన్ని బట్టి వాళ్లకు కావల్సిన బొమ్మ, బొమ్మల సెట్టు తయారు చేస్తున్నాం.
బట్టల నుంచి జుట్టు, నగల దాకా బొమ్మల అలంకరణ మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాం. అందుకే ఇప్పుడు మాకు విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. మా బొమ్మల ధర రూ.250 మొదలుకొని రూ. 25,000 వరకూ ఉంది. నెలలో సుమారు పాతిక ఆర్డర్లు తీసుకుంటున్నాం. సీజన్ని బట్టి రూ.30 వేల నుంచి రూ.70 వేల దాకా రాబడి ఉంటున్నది. ఇక, ఈ పనిలో మావారి సహకారం ఎంతో ఉంది. మా ఉపాధి కోసం ప్రారంభించిన ఈ సంస్థ ద్వారా నలుగురు ఆడపిల్లలకు ప్రత్యక్షంగా, మరో పదిహేను మందికి పరోక్షంగా పని ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది’ అంటారు దివ్య.