పన్నెండు మెట్ల కిన్నెరపై ఆయన వేళ్లు చకచకా కదలాడతాయి. ఏక్తారను సితార్ కన్నా మిన్నగా పలికించగలడు. కిక్రీ వాద్య విన్యాసం చేస్తూ ఆయన చెప్పే విక్రం రాజు కథ వింటే ఫికర్లన్నీ దూరం అవుతాయి. ఆదిలాబాద్ జిల్లా దివ్యగూడకు చెందిన కుమ్రం లింగు కిన్నెరకే తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆ గిరిజన వాద్యకారుడి అంతరంగం..
ఈ వాయిద్యాలతోని నాకు అరవై ఏండ్ల అనుబంధం. ఇప్పుడు నాకు 70 ఏండ్లు. పదేండ్లు ఉన్నప్పటి నుంచీ ఏక్తారా, కిక్రీ, కిన్నెర పలికించడంలో పట్టు దొరికింది. నేను చదువుకున్నది నాలుగో తరగతి వరకే. మా బాబాయి ఆడ లక్ము కథలు చెప్పేవాడు. ఆయనతో నేనూ అక్కడికి పోయేటోణ్ని. ఆయన దగ్గరే పాటలు, దేవతల కథలు నేర్చుకున్నా. కిన్నెర వాయిస్తూ పాటలు పాడటం, కిక్రీతో కథలు చెప్పడం, భజనలు ప్రదర్శించడం అలవాటైంది.
ఇదే నా సంపద..
నా సంగీత పరికరాలను నేనే స్వయంగా తయారు చేసుకుంటా. ఇవే నా సంపద. అందుకే చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తా. తెలుగు, హిందీ, మరాఠి, గోండి అనర్గళంగా మాట్లాడగలను. ఉట్నూర్ ఐటీడీఏ సహకారంతో తెలుగునాట గ్రామగ్రామాన ఎన్నో ప్రదర్శనలు ఇచ్చా. గిరిజనుల భక్తి,
ఆచారాలు, సామాజిక దృక్పథం కలిగించే పాటలు.. దేవతల, విక్రం రాజు కథలు, జననం, మరణం కథలు చెప్పేవాణ్ని. ఏకధాటిగా 12 గంటలు ప్రదర్శన ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. చాలా అవార్డులు, ప్రశంసా పత్రాలు వచ్చాయి. ముఖ్యమంత్రుల సమక్షంలో కూడా కళను ప్రదర్శించా. ఓ చానల్లో ప్రసారమైన ‘రేలారే రేలా..’ కార్యక్రమంలోనూ పాల్గొన్నా. ఇప్పుడు ప్రదర్శనలు తగ్గించా. పాతతరం కళలను నేర్చుకోవడానికి ఇప్పుడు ఎవరూ ముందుకు రావడం లేదు. అరుదైన వాయిద్యాలు మా తరంతోనే కాలంలో కలిసి పోతాయా? అనిపిస్తుంటుంది. యువత ప్రాచీన కళలకు జీవం పోయాల్సిన అవసరం ఉంది. మనిషిని కళలు మంచి మార్గంలో నడిపిస్తాయి. మానసిక ప్రశాంతతను ఇస్తాయి. చెడు అలవాట్లను దూరం చేస్తాయి. జీవితానికి ఓ సార్థకతను ఇస్తాయి. కళ బతికితేనే సమాజంలో సంతోషం.
– బాకే రఘునాథ రావు