నాకు 29 ఏండ్లకు పెండ్లయింది. రెండేండ్ల వరకూ గర్భం దాల్చలేక పోయాను. 32 ఏండ్ల వయసులో కూతురు పుట్టింది. ప్రస్తుతం నా వయసు 34 ఏండ్లు. ఇప్పుడు, రెండో బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటున్నా. అయితే, ఈ వయసులో బిడ్డను కనడం ఆరోగ్యపరంగా మంచిదేనా? లేదంటే, పుట్టబోయే బిడ్డకు ముప్పు కలుగుతుందా? నేను గర్భం దాల్చాలని అనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఏ వయసులో బిడ్డను కనడం తల్లీబిడ్డలకు శ్రేయస్కరం?
ఓ సోదరి
జ: ముప్పై ఐదేండ్ల వయసు దాటాక గర్భం దాల్చడాన్ని ‘ఎల్డర్లీ గ్రావిడా’ అంటారు. సాధారణంగా స్త్రీకి 25 ఏండ్ల తర్వాతి నుంచే అండం నాణ్యత తగ్గుతూ ఉంటుంది. దానివల్ల పుట్టబోయే బిడ్డలో జన్యుపరమైన లోపాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. 35 ఏండ్ల వయసులో గర్భం దాల్చిన మహిళల్లో.. ప్రతి ఇరవై ఐదు మందిలో ఒకరికి జన్యు లోపాలున్న బిడ్డ పుట్టే ఆస్కారం ఉంది. ఈ వయసులో పిల్లల్ని కనడంవల్ల తల్లిలో బీపీ, షుగర్ స్థాయులు పెరగవచ్చు. కండరాల పటుత్వం తగ్గడంతో సాధారణ కాన్పు జరిగే అవకాశాలు మృగ్యం అవుతాయి. ఈ వయసులో రెండో బిడ్డను కనేవాళ్లతో పోలిస్తే, మొదటిసారి తల్లి అయ్యేవాళ్లకు ఇబ్బందులు మరీ ఎక్కువ. ఇలా పుట్టిన వాళ్లలో ఆటిజం, తక్కువ బరువు సమస్యలు ఉంటాయి. 35 ఏండ్లు దాటినకొద్దీ శరీరంలో కొలాజిన్ స్థాయులు తగ్గుతాయి. ఈ కొలాజిన్ ఎముకలను దృఢంగా ఉంచుతుంది, చర్మం వదులుకాకుండా చూస్తుంది. అలాగే గర్భాశయ ముఖద్వారం దగ్గర కొలాజిన్ అవసరమైన స్థాయిలో లేకపోవడం వల్ల నెలలు నిండకుండానే కాన్పు జరుగవచ్చు. అది కూడా సిజేరియన్ కావచ్చు. ఏ విధంగా చూసినా, 35 ఏండ్లు దాటకముందే పిల్లల్ని కనడం ఆరోగ్యకరం. లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీ అనివార్యం అనుకున్నప్పుడు, ఆరోగ్యవంతమైన అండాలను భద్రపరిచే టెక్నాలజీ అందుబాటులో ఉంది. దాన్ని ఉపయోగించుకుని పండంటి బిడ్డకు జన్మనివ్వొచ్చు. ఎటూ మీరు రెండోసారి గర్భం దాల్చాలనుకుంటున్నారు కాబట్టి, డాక్టర్ను సంప్రదించి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి.
డా. కావ్యప్రియ వజ్రాల
కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్
యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ