ఆస్కార్. సినీ ప్రేమికుల కల. నామినేషన్ వరకు వెళ్లినా చాలు అనుకునేంత విజయం. కానీ ఓ భారతీయురాలు మూడుసార్లు ఆస్కార్ నామినేషన్ దశకు చేరుకుంది. ఏకంగా రెండుసార్లు అవార్డు దక్కించుకుంది. ఆమే గునీత్ మోంగా. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ నిర్మాతగా ఆస్కార్ అందుకున్న గునీత్కి ఇది మొదటి ఆస్కార్ కాదు. మొదటి చిత్రం అంతకన్నా కాదు. తన ప్రయాణం అడుగడుగునా ఓ సంచలనం. అంతులేని ఇన్స్పిరేషన్.
గునీత్ చిన్నతనం చాలా వేదనతో గడిచింది. కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉండేవి. దీంతో ఎప్పుడూ ఏదో ఒక గొడవ. ఓసారి ఆ కొట్లాటలో తన తల్లిని కళ్లముందే చంపబోయారు దాయాదులు. ఆ గండాల నుంచి బయటపడి, దూరంగా వెళ్లి అద్దెకొంపలో బతకసాగింది గునీత్ కుటుంబం. ఎప్పటికైనా ఓ ఇల్లు కట్టుకోవాలని కలలు కనేవాళ్లు ఆమె తల్లిదండ్రులు. ఆ కోరికను నిజం చేయాలని నిశ్చయించుకుంది తను. చదువుకుంటూనే సేల్స్గాళ్, ఎనౌన్సర్, యాంకర్, డీజే.. ఇలా చిన్నాచితకా కొలువులు చాలానే చేసింది. కుటుంబంతో కలిసి రూపాయి రూపాయి కూడబెట్టింది. చివరికి ఆ రోజు రానేవచ్చింది. తమకంటూ ఓ ఇంటిని బుక్ చేసుకున్నారు. కానీ, ఆ ఇల్లు పూర్తయ్యేలోగా.. ఆరునెలల వ్యవధిలోనే గునీత్ అమ్మ, నాన్న.. ఇద్దరూ చనిపోయారు. తల్లి గొంతు క్యాన్సర్తో, తండ్రి కిడ్నీల సమస్యతో ఎంతో వేదన అనుభవించి మరీవెళ్లిపోయారు. అంతే, గునీత్ గుండె పగిలిపోయింది. ఇంటిని అమ్మేసుకుని దిల్లీ నుంచి ముంబై మారిపోయింది.
కొత్త జీవితం ఇష్టమైన తల్లిదండ్రులు దూరమయ్యారు. సొంతింటి కల చెదిరిపోయింది. ఆ బాధను మర్చిపోవడానికి.. రేయింబవళ్లు పనిచేయడమే మందు అనుకుంది గునీత్. ఆ చాకిరి బాలీవుడ్లోనే సాధ్యం కాబట్టి, అక్కడే కాలుపెట్టింది. సినిమాలకు పనిచేసూ తన నొప్పిని మర్చిపోయే ప్రయత్నం చేసింది. ప్రొడక్షన్ హౌస్లను, దర్శకులను ముందుండి నడిపించే నిర్మాతగా మారింది. ‘పెడ్లర్స్’ అనే సినిమాకు డబ్బులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోతే, ఆ స్క్రిప్ట్ను ఏకంగా ఫేస్బుక్లో పెట్టిన ఆత్మవిశ్వాసం తనది. అలా క్రౌడ్ ఫండింగ్తో రూపొందిన ‘పెడ్లర్స్’ అయిదు రెట్లు లాభాలు వసూలు చేయడమే కాకుండా, అంతర్జాతీయ అవార్డులు కూడా గెలుచుకుంది.
ఆకాశం ఆమె హద్దు గునీత్లోని మేనేజ్మెంట్ స్కిల్స్ చూసి ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన టీమ్లో చేర్చుకున్నారు. తాను దర్శకత్వం వహించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’కు నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఇచ్చారు. ఇర్ఫాన్ ఖాన్ని అద్భుతమైన నటుడిగా పరిచయం చేసిన ‘లంచ్ బాక్స్’, సూర్య ఎంతో ఇష్టపడి తీసిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలకూ తనే నిర్మాణ బాధ్యతలు చూసుకుంది. గునీత్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా తీసిన ‘పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ అకాడెమీ అవార్డు గెలుచుకుంది. ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ‘ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్’ అందుకుంది. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’తో మరోసారి వార్తల్లో నిలిచిందామె. ‘నేను స్కూల్లో ఉండగా మా నాన్న నాకోసం తన బంగారు కడియాన్ని అమ్మేశారు. నేను గెలవడం కోసం, ప్రపంచాన్ని చూడటం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఎంత సాధించినా కన్నవాళ్లు పక్కన లేని లోటు ఉండి తీరుతుంది’ అంటుంది గునీత్.