భారతీయత గోవును కన్నతల్లితో పోలుస్తుంది.
వ్యవసాయం, పాడి పరిశ్రమ, ఆయుర్వేదంలో దేశవాళి ఆవుల స్థానం వెలకట్టలేనిది. ‘గోవుల సాయంతో సేద్యాన్నే కాదు.. ఏకంగా ఓ ఆర్థిక వ్యవస్థను నిర్మించవచ్చు’ అంటున్నది బెంగళూరుకు చెందిన శివాలి మిగ్లానీ. ఆమె తన సోదరి రాధికతో కలిసి ‘ఏ2 నేచురల్స్’ అనే స్టార్టప్ను ప్రారంభించింది. ఆవులను సంరక్షించేందుకు ‘దేశీ కౌస్ ఫర్ బెటర్ ఇండియా’ పేరుతో ఓ ట్రస్టును కూడా ఏర్పాటుచేసింది. ఆవులకు స్వచ్ఛమైన, నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నది. శివాలి స్థాపించిన గోశాలలో వందలకొద్దీ దేశవాళి ఆవులు ఉన్నాయి. సాదుకొనే ఆసక్తి ఉన్నవారికి ‘గోదాన్’ పేరుతో దత్తత ఇస్తున్నది శివాలి. గో ఆధారిత జీవన శైలిపై అధ్యయనాలనూ ప్రోత్సహిస్తున్నది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఫైనాన్స్లో పట్టా పొందిన శివాలి గోవుల పెంపకాన్ని ఓ సామాజిక వ్యాపారంగా తీర్చిదిద్దుతున్నది. ‘ఆవులు మనిషి వికాస క్రమంలో ఓ భాగం. దురదృష్టవశాత్తు ఈ మూగజీవుల్ని రాజకీయాల్లోకి లాక్కొచ్చారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుందామె.