ఒంటరి ప్రయాణంలో భయం కనిపిస్తుంది. బృందంగా అడుగేస్తే.. భయానికే భయం వేస్తుంది. కాబట్టే, పాతిక దేశాలకు చెందిన ఎనభైరెండు మంది మహిళామణులు చేతులు కలిపి ఏకంగా అంతర్జాతీయ రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోప్ టీమ్గా ఏర్పడి స్విట్జర్లాండ్లోని 4,164 మీటర్ల ఎత్తయిన బ్రిథార్న్ పర్వతాన్ని అధిరోహించారు. ఆ బృందంలో భారతీయులు కూడా ఉన్నారు.
అంచల్ ఠాకూర్, శిబానీ ఘరత్, చార్మి డేధియా.. ముగ్గురూ ముగ్గురే. ‘హండ్రెడ్ పర్సెంట్ విమెన్ క్యాంపెయిన్’ పేరుతో స్విట్జర్లాండ్ టూరిజం శాఖ నిర్వహించిన ఈ సాహస యాత్ర లక్ష్యం ఒక్కటే.. మహిళల ప్రతిభ, నైపుణ్యం, చొరవ ప్రపంచానికి పరిచయం చేయడం. ఆ దూకుడును రికార్డులకు ఎక్కించడం. గత ఏడాది స్విస్ ప్రభుత్వం ఈ మేరకు ఒక ప్రకటన ఇచ్చింది. ఆ పిలుపునకు చాలామంది స్పందించారు.
వివిధ వడపోతల తర్వాత.. మన దేశం నుంచి ముగ్గురు మాత్రమే ఎంపిక అయ్యారు. ‘సమాజంలో ఉన్న వివక్ష పర్వతాలకు లేదు. ఆడైనా, మగైనా సాహసులను సాదరంగా స్వాగతిస్తాయి. ఈ విజయం నాలాంటి ఎంతోమంది మహిళలకు కొత్త స్ఫూర్తినిస్తుంది’ అంటారు ఆ ముగ్గురిలో ఒకరైన చార్మి.