ఆ ఆవరణలో కాలుపెడితే.. ఏ ఇంద్రలోకంలోనో దేవకన్యల అలంకరణశాలలో ఉన్న అనుభూతి కలుగుతుంది. అక్కడలేని ఆభరణాలంటూ ఉండవు. రాణెమ్మల వజ్రాల ముక్కు పుడక నుంచి గిరిజనుల సంప్రదాయ చెవికమ్మల వరకూ.. అద్దాల అరలలో ముద్దొచ్చేలా దర్శనమిస్తాయి. వేల సంవత్సరాలనాటి డిజైన్లనూ చూడొచ్చు. దాదాపు ఎనిమిదొందల కళాఖండాలున్నాయి.
దేనికదే ప్రత్యేకం. పింక్సిటీ జైపూర్లోని ‘ఆమ్రపాలి మ్యూజియం’ ఆభరణాల విజ్ఞాన సర్వస్వం. ఆమ్రపాలి బ్రాండ్ సృష్టికర్తలు రాజీవ్ అరోరా, రాజేశ్ అజ్మీరా ఆలోచనల్లోంచి ప్రాణం పోసుకుందీ సంగ్రహ శాల. రెండు అంతస్తుల భవనంలో.. తొలి అంతస్తులో వెండి ఆభరణాలు కొలువై ఉన్నాయి. రెండో అంతస్తు నిండా స్వర్ణాభరణాలే. ఈ మ్యూజియాన్ని సందర్శిస్తే.. నగల తయారీ పరిణామక్రమాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు.