ఈ వయసు పిల్లలు ఇన్ని నీళ్లు తాగాలని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే శరీరానికి నీటి అవసరం వయసు, ఆటలు, వాతావరణం, చెమట, అనారోగ్య సమస్యలను బట్టి ఉంటుంది. అందరూ ఒకే విధమైన జీవన శైలి, అలవాట్లను కలిగి ఉండరు. కాబట్టి అందరూ ఇంత పరిమాణంలో నీళ్లు తాగాలని చెప్పలేం. సాధారణంగా ఒకటి నుంచి నాలుగేళ్ల లోపు పిల్లలు రోజుకు 1 లీటరు నీళ్లు తాగాలి. అయిదు నుంచి తొమ్మిదేళ్ల లోపు పిల్లలు రోజుకు 1.5 లీటర్ల నీళ్లు తాగాలి. తొమ్మిది నుంచి పద్నాలుగేళ్ల లోపు పిల్లలు 2 లీటర్ల నీళ్లు తాగాలి. వేడి వాతావరణం, ఆటలను బట్టి దప్పిక వేస్తే ఎక్కువ నీళ్లు తాగాల్సి ఉంటుంది.
కొంతమంది పిల్లలు నీళ్లు తాగరు. ఫ్రూట్ జ్యూస్ ఇస్తే శరీర నీటి అవసరం తీరుతుందని మార్కెట్లో ఉన్న బేవరేజ్ డ్రింక్స్ కొంటున్నారు. అవి వంద శాతం ఫ్రూట్ జ్యూస్ అంటారు. కానీ, అందులో నాన్ షుగర్ స్వీట్నెస్, యాడెడ్ షుగర్స్, రంగులు, నిల్వ రసాయనాలు కలుపుతారు. వీటితో ఆరోగ్య సమస్యలు వస్తాయి. షుగర్ వల్ల దంత సమస్యలు, ఒబెసిటీ వచ్చే ప్రమాదం ఉంది. వాటికి బదులుగా ఇంట్లోనే పండ్లతో జ్యూస్ తయారు చేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తాగుతారు. దీని నుంచి శరీరానికి కావాల్సిన నీటితోపాటు ఎనర్జీ, ఖనిజ లవణాలు కూడా అందుతాయి.
తొమ్మిది నుంచి పదమూడేళ్లలోపు పిల్లలకు 180 మిల్లీ లీటర్లు జ్యూస్ ఇవ్వొచ్చు. 13 ఏళ్లు పైబడిన వాళ్లు 250 మిల్లీ లీటర్ల జ్యూస్ తాగొచ్చు. అలాగే పుచ్చకాయ, ఖర్బూజ, స్ట్రాబెర్రీ, నారింజ పండ్లు తినమని ఇవ్వాలి. పండ్ల రసాలు బయట కొన్నా రంగులు, నిల్వ రసాయనాలు, షుగర్ లేనివి కొనివ్వాలి. పిల్లలకు కార్బొనేటెడ్ డ్రింక్స్ అసలే కొనొద్దు. వీటిలో చక్కెర అధిక మోతాదులో ఉంటుంది. కెఫిన్ కూడా ఉంటుంది. దీని వల్ల దాహం పెరుగుతుంది. పిల్లలు ఆటలు ఆడేప్పుడు నీళ్లు తాగరు. దాహమని చెప్పరు. కాబట్టి పెద్దలు గంట, అరగంటకు ఒకసారి నీళ్లు తాగాలని పిల్లలకు చెప్పాలి. తాగకపోతే పెద్దలే తాగించాలి.