సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే వేళ… దేశమంతా సంక్రాంతి హేల కనిపిస్తుంది. పతంగులతో పిల్లలు, పిండివంటలతో పెద్దలు బిజీబిజీగా గడిపేస్తుంటారు. సంక్రాంతిని తాము లోహ్రీగా చేసుకుంటామని చెబుతున్నది పంజాబీ ముద్దుగుమ్మ హన్సికా మోత్వానీ. పంటలు చేతికొచ్చి తమ రాష్ట్రంలోని పల్లెలన్నీ ధాన్యలక్ష్మితో తులతూగుతూ ఉంటాయని చెప్పుకొచ్చింది.
‘ఆ రోజు మేం ఉదయాన్నే లేచి గురుద్వారాకు వెళ్తాం. ఇంట్లో అంతా సందడిగా ఉంటుంది. ఆటపాటలతో రోజంతా సంతోషంగా సాగిపోతుంది. పిల్లల ఆటలు కొనసాగుతుండగానే.. పెద్దలు రకరకాల వంటకాలు చేస్తారు. లోహ్రీ సందర్భంగా కొన్ని సంప్రదాయ వంటకాలు, తీపి పదార్థాలు చేస్తారు. అవన్నీ సిద్ధమయ్యాక మధ్యాహ్నం అందరం కలిసి ఘనమైన విందు భోజనం చేస్తాం. నాకు స్వీట్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. కానీ, పండుగకు మాత్రం స్వీట్ల విషయంలో షరతులు పెట్టుకోను. చిక్కీ, నువ్వుల లడ్డూలు ఇష్టంగా తింటా’ అని సంక్రాంతి కబుర్లు చెప్పుకొచ్చింది హన్సిక.