Aripina Jayalakshmi | ‘చెత్తమ్మా.. చెత్త ’ అరుపులాంటి పిలుపు. తలుపులు తెరుచుకున్నాయి. ‘ఏంటే? చాలా రోజుల నుంచి రావట్లేదు’ అడిగింది ఓ ఇంటి యజమాని. ‘అమెరికా వెళ్లినా అమ్మగారూ’ చెప్పిందా అమ్మాయి. అతిశయోక్తి కాదు. అబద్ధం లేదు. చెత్త ఏరుకునే ఆ బాలిక ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నది. ఆ మధ్య అమెరికాలోనూ పర్యటించింది. ఎన్నో వేదికలెక్కి ప్రసంగించింది. అవార్డులు గెలిచింది. అంతేనా, చిల్డ్రన్స్పార్లమెంట్కు ప్రధానిగా వ్యవహరించింది. ఛేంజ్ మేకర్ అవార్డు విజేత కూడా అయిన అరిపిన జయలక్ష్మి.. ఐఏఎస్ సాధించి తన జీవితాన్ని మార్చుకుంటానని చెబుతున్నది.
రాయలసీమలోని చిన్న పల్లెటూరు మాది. ఉపాధి వెతుక్కుంటూ అమ్మానాన్న హైదరాబాద్ వచ్చారు. దిల్సుఖ్నగర్ దగ్గర సింగరేణి కాలనీలో గుడిసె వేసుకున్నారు. బతుకుదెరువు కోసం ముగ్గు అమ్మడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు చెత్త ఏరే పనిలో చేరిపోయారు. ఆ సంపాదనతో పొట్టకూ బట్టకూ వెళ్లిపోతుంది. మా వాళ్లు వెనకేసింది లేదు. మేము ఉంటున్న గుడిసె ఒక్కటే మా ఆస్తి. వానొస్తే నీటి ధారలకు గిన్నెలు పెడతాం. చుట్టమొస్తే జాగాలేక అన్నయ్య పొరుగింట్లో తలదాచుకుంటాడు.
‘మీకేం ఇవ్వలేం. బాగా చదివిస్తాం. మీరే స్వశక్తితో ఎదగాలి. అసలైన ఆస్తి అక్షరం ఒక్కటే’ అని స్పష్టంగా చెప్పారు నాన్న. అన్నయ్యను, నన్ను, చెల్లిని మలక్పేట ప్రభుత్వ స్కూల్లో చేర్పించారు. మాది చెత్త ఏరుకునే కుటుంబమని తెలిసి.. తోటి విద్యార్థులు చులకనగా చూసేవాళ్లు. ఇంకొంతమంది మాట్లాడటమే మానేశారు. ఆ వివక్షను చిరునవ్వుతో భరించాను. మాకూ కష్టం తెలియాలనే ఉద్దేశంతో చిన్నప్పుడే మమ్మల్ని చెత్త పనిలో దించారు నాన్న. ఏడో తరగతి నుంచీ వెళ్తున్నా. దీనివల్ల కొన్నిసార్లు బడికి ఆలస్యం అయ్యేది. టీచర్లు కోపగించుకునేవారు. మేం చెత్త సేకరించే కాలనీ వాళ్లు మాత్రం ఇప్పటికీ మా చదువులకు సహకరిస్తున్నారు. పుస్తకాలకు, బట్టలకు తమవంతు సాయం చేస్తారు.
పిల్లి గుడిసెల బస్తీలో మా అమ్మమ్మ ఉంటుంది. అక్కడ ఒక ఎన్జీవో పేద పిల్లలకు ట్యూషన్లు చెబుతున్నది. ఆ ట్యూషన్లో తరచూ వేడుకలు జరిగేవి. పిల్లల పాటకు నేను డప్పు కొట్టే దాన్ని.‘నువ్వు చాలా యాక్టివ్గా ఉన్నావు. బాగా మాట్లాడుతున్నావు. చిల్డ్రన్స్ పార్లమెంట్ ప్రోగ్రామ్లో పాల్గొంటే బావుంటుంది’ అని సలహా ఇచ్చారు వాళ్లు. దీంతో ఉత్సాహంగా పేరు నమోదు చేసుకున్నాను. ఓటింగ్లో పిల్లల పార్లమెంట్కు ప్రధానిగా ఎంపికయ్యాను. మా సంస్థ ప్రతి సంవత్సరం ఒక లక్ష్యాన్ని ఎంచుకుని పని చేస్తుంది. పదిహేను రోజులకు ఒకసారి బస్తీ సమస్యలు చర్చించుకుంటాం. బస్తీలో దోమల్ని నిర్మూలించాలని మా క్యాబినెట్ తీర్మానించింది. ఆ మేరకు, అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ సార్కు వినతిపత్రం ఇచ్చాం. మా బస్తీకి ఫాగ్ మెషీన్ పంపారాయన. అది నా మొదటి విజయం. ఆ తర్వాత, 2.5 లక్షల మంది బాల పౌరులకు ప్రాతినిధ్యం వహించే ప్రపంచ స్థాయి చిల్డ్రన్స్ ప్రైమ్ మినిస్టర్గా కూడా ఎంపికయ్యాను. ఇందులో వివిధ దేశాల విద్యార్థులు క్యాబినెట్ మంత్రులుగా ఉంటారు. ఆన్లైన్లో మా పార్లమెంట్ సమావేశాలు జరిగేవి. నేను చాలా ఉత్సాహంగా పాల్గొనేదాన్ని.
కొవిడ్తో మా కార్యకలాపాలు తగ్గాయి. దీంతో నా పదవీ కాలాన్ని పొడిగించారు. ఆ ఏడాది అంగన్వాడీల సమస్యల్ని తీసుకున్నాం. చాలా బస్తీలు తిరిగి సర్వే చేశాం. 21 ప్రాంతాల్లో కొత్త అంగన్వాడీల అవసరం ఉందని, 56 అంగన్వాడీల్లో బ్రేక్ఫాస్ట్ సౌకర్యం కల్పించాలని చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కార్యదర్శి దివ్యా దేవరాజన్ మేడమ్ను అడిగాం. ఆమె సానుకూలంగా స్పందించారు. ‘వాతావరణ మార్పుల గురించి రెండు నిమిషాల వీడియో తీసి బ్రిటిష్ హైకమిషన్ నిర్వహిస్తున్న ఓ పోటీకి పంపించు. నీకు కావాల్సిన టెక్నాలజీ సపోర్ట్ మేం ఇస్తాం’ అని నాకు సలహా ఇచ్చారు కూడా. దివ్య మేడమ్ చొరవతో ఒక వీడియో చేశాను. పోటీలో రెండో స్థానం వచ్చింది. బ్రిటిష్ హై కమిషన్ వాళ్లు పార్టీకి ఆహ్వానించారు. నా నేపథ్యం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఛేంజ్ మేకర్ అవార్డ్డుకు దరఖాస్తు చేయమని సూచించారు. 2021లో ఛేంజ్ మేకర్ అవార్డు వచ్చింది. తెల్లవారు జామున నాలుగు గంటలకే నిద్ర లేస్తాను. నేను, నాన్న, అమ్మ, అన్నయ్య, చెల్లి చెత్త
బండి తీసుకుని.. మా ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలనీకి వెళ్తాం. నాలుగొందల ఇండ్లు తిరిగి చెత్త సేకరిస్తాం. ఇంటికి రాగానే చకచకా సిద్ధమైపోయి.. గంటన్నరలో కాలేజీలో ఉంటాను. బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్లో బీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఏదైనా సమస్యతో అధికారులను కలిసినప్పుడు చిన్న ఫోన్కాల్తోనే పని జరిగి పోతుంది. అది చూశాక.. ఐఏఎస్ ఆఫీసర్ కావాలని నిర్ణయించుకున్నా. నలుగురూ సహకరిస్తే కచ్చితంగా లక్ష్యాన్ని సాధిస్తాను.
రెండేండ్ల క్రితం.. యునైటెడ్ స్టేట్స్, ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ‘గాంధీ – కింగ్ ఎక్సేంజ్ ఇనీషియేటివ్ స్కాలర్షిప్’ కోసం దరఖాస్తు చేశాను. నాలుగొందల మందిలో పదిమంది ఎంపికయ్యారు. వారిలో నేనూ ఒకదాన్ని. మా బృందం 14 రోజులు ఢిల్లీలో, 14 రోజులు అమెరికాలో పర్యటించింది. మానవ హక్కులు, గాంధీయిజం, మార్టిన్ లూథర్ కింగ్ పౌర హక్కుల ఉద్యమాల గురించి
అధ్యయనం చేసింది.
– నాగవర్ధన్ రాయల
– కేశమౌని మహేశ్ కుమార్