ఎనిమిదేండ్ల నవ తెలంగాణ వైభవం నలుదిక్కులకూ విస్తరించింది. ఇదొక అభివృద్ధి ప్రయోగశాల. ప్రగతి నమూనా. కాబట్టే, మన కల్యాణలక్ష్మిని తమిళనాడు యథాతథంగా అమలు చేస్తున్నది. మన భగీరథను హర్ ఘర్ జల్ మిషన్గా, రైతు బంధును పీఎం కిసాన్ యోజనగా సాక్షాత్తు కేంద్రమే అనుకరించింది.
తెలంగాణ సన్నబియ్యం ముందు బ్రహ్మాండమైన బాస్మతి అయినా చిన్నబోవాల్సిందే. ఆ తెలుపు మెరుపు చూసి మల్లెపువ్వులు కూడా ముడుచుకు పోవాల్సిందే.
బిర్యానీ అరబ్బు సైనికుల గుడారాల్లో పుడితే పుట్టిందేమో కానీ..హైదరాబాద్ బావర్చీల చేతిలో పడ్డాకే నవాబుల భవంతులలో చోటు సంపాదించింది. ప్రపంచానికంతా పరిచయమైంది. హైదరాబాదీ బిర్యానీ మెనూలో లేకపోతే, స్టార్ హోటల్ అయినా షట్టర్ దించాల్సిందే. ఇప్పుడు.. మన బిర్యానీ గ్లోబల్ వంటకం.
ప్రపంచంలోని చాలా దేశాలకు వజ్రానికి, గాజు ముక్కకూ తేడా తెలియని రోజుల్లోనే ఈ గడ్డ మీద జాతి వజ్రాల వేట మొదలైంది. గనులను తవ్విన ఘన వారసత్వం మనది. ‘ఫాదర్ ఆఫ్ ఆల్ డైమండ్స్’ కోహినూర్ మనదే!
ప్రపంచ దేశాలు కొవిడ్ను సమర్థంగా నిలువరించడం వెనుక.. హైదరాబాద్ టీకా ఉంది. భారత్ బయోటెక్ ‘కొవాగ్జిన్’ సంజీవనిలా సాయపడింది. మొండి మహమ్మారులను అడ్డుకోగల అనేక వ్యాక్సిన్లు తెలంగాణలో తయారవుతాయి. క్యాన్సర్ మందులను సైతం మన ఫార్మా కంపెనీలు అందిస్తున్నాయి.
ఇక్కడ రూపొందిన సాఫ్ట్వేర్ అమెరికా అధ్యక్ష భవనాన్ని నడిపిస్తుంది. ఇక్కడ సిద్ధమైన అప్లికేషన్ యాపిల్ వ్యూహాలకు కొత్త జీవం పోస్తుంది. ఇక్కడ విశ్లేషించిన డాటాతోనే వారెన్ బఫెట్ కీలక నిర్ణయాలు తీసుకుంటాడు. మన బిడ్డలకు కోడింగ్ కొట్టినపిండి.
తెలంగాణ ఇక్కత్.. ఫ్యాషన్ దస్కత్. తెలంగాణ పసుపు ముత్తయిదువల పారాణి. తెలంగాణ పేరిణి శివతాండవం తొలి భారతీయ యుద్ధ నృత్యం. ఒకటా రెండా.. ఆది నుంచీ తెలంగాణ ఆవిష్కరణల జెండా సగర్వంగా రెపరెపలాడుతూనే ఉన్నది. ఇది మన విజయం.. జన విజయం..ఘన విజయం. జై తెలంగాణ!
ప్రపంచ ప్రసిద్ధిచెందిన కోహ్- ఇ- నూర్ మొగలుల దగ్గర ఉన్నప్పుడు 191 కారెట్ల బరువు ఉండేది. దానికి మరింత మెరుగు తెచ్చేందుకు బ్రిటిష్ రాజవంశపు ఆభరణాల తయారీదారులు 105.6 కారెట్లకు కత్తిరించారు. ప్రస్తుతం ఈ వజ్రం బ్రిటిష్ రాణి ఎలిజబెత్ కిరీటంలో కొలువుదీరింది. ఒకప్పటి కుతుబ్షాహీ సామ్రాజ్యంలోని కొల్లూరు గనుల్లో ఈ వజ్రం తవ్వితీశారు. చాలా చేతులు మారి, 1656లో మొగల్ చక్రవర్తి షాజహాన్ చేతికి చేరినట్లు తెలుస్తున్నది. 1739లో నాదిర్షా ఢిల్లీని ముట్టడించినప్పుడు దోచుకెళ్లిన అపార సంపదలో కోహినూర్ ఒకటన్నది వాస్తవం. ఆయన మరణం తర్వాత అది అహ్మద్ షా అబ్దాలీ చేతుల్లోకి వెళ్లిపోయింది. అబ్దాలీ కొడుకు షా షుజా దీనిని పంజాబ్ పాలకుడు మహారాజా రణ్జీత్ సింగ్కు అప్పగించాడు. 1849లో పంజాబ్ను ఆక్రమించుకున్న బ్రిటిష్ వాళ్లు ఈ వజ్రాన్ని ఇంగ్లాండుకు తరలించారు.
‘సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచింది.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి. కొండలు, చెరువులు, పచ్చటి పంటపొలాలు, చిట్టడవులతో ప్రకృతి సౌందర్యంతో అలరారే ఈ ఊరిని రెండు అంశాలు ప్రత్యేకంగా నిలుపుతాయి. ఒకటి పోచంపల్లి ఇక్కత్ డిజైన్ కాగా, మరొకటి ఆచార్య వినోబా భావే ప్రారంభించిన ‘భూదాన’ ఉద్యమానికి తొలి అడుగు ఇక్కడే పడటం. పోచంపల్లి ఇక్కత్ డిజైన్కు 2004లో భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. ఇక్కత్.. మలేషియా, ఇండోనేషియా పదం. దీనికి ‘టై అండ్ డై’ అని అర్థం. పోచంపల్లికి ఇక్కత్ డిజైన్ను 1953లో కర్నాటి అనంతరాములు పరిచయం చేశారు. ఆయన గుజరాత్, వారణాసి వెళ్లి దీనికోసం శిక్షణ పొందారు. ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. గద్వాల, నారాయణపేట చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, తేలియా రుమాలు, వరంగల్ డురీలకూ భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించడం విశేషం.
బిర్యానీలలో.. హైదరాబాదీ బిర్యానీ ఘుమఘుమలది ప్రత్యేకమైన స్థానం. రుచిలో దానికదే సాటి. అసలైన బిర్యానీ అంటే హైదరాబాదీ బిర్యానీ అని చాలామంది మాంసాహార ప్రియుల మాట. ఒకానొక సమయంలో హైదరాబాదీ బిర్యానీలో 140కిపైగా రకాలు ఉండేవని అంటారు. బాస్మతి బియ్యానికి గొర్రె, మేక, కోడి, రొయ్యలు, చేప మాంసం, మసాలాలు కలిపి ఈ బిర్యానీ తయారు చేస్తారు. అరబ్ సైనికుల కోసం వండిన ఒకానొక సాధారణ వంటకం.. హైదరాబాదీ బావర్చీల చేతిలో పడి కొత్త రూపం దాల్చింది. కొత్త రుచులు సొంతం చేసుకుంది. స్విగ్గీ సంస్థ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. భారతీయులు అత్యంత ఇష్టంగా ఆరంగించే రుచులలో హైదరాబాదీ బిర్యానీ ఒకటి.
తెలంగాణలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ప్రధానమైంది. ప్రత్యేకించి భారత ఐటీ రంగాన్ని ప్రపంచ పటంలో నిలపడంలో హైదరాబాద్ నగరం కీలకపాత్ర పోషించింది. 2014 15లో రాష్ట్ర ఆవిర్భావ సమయానికి రూ. 66,276 కోట్లు ఉన్న తెలంగాణ ఐటీ ఎగుమతులు, 2020 21 నాటికి 1,45,522 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఉద్యోగుల విషయానికి వస్తే 2014 15లో 3,71,774 మంది ఐటీ రంగంలో పనిచేస్తుండగా, 2020 21కి అది 6,28,615కు చేరుకుంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్మహీంద్ర లాంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్ నుంచి పనిచేస్తున్నాయి.
నిర్మల్ పట్టణం కేంద్రంగా ఆవిర్భవించిన కళాఖండాలు నిర్మల్ కొయ్యబొమ్మలు. వీటి తయారీకి స్థానిక అడవుల్లో దొరికే మెత్తటి పొనికి కర్రను ఉపయోగిస్తారు. కొయ్యను ఎండబెట్టి, ఆ తర్వాత వివిధ ఆకారాల్లో బొమ్మలుగా మలుస్తారు. వాటికి సహజ రంగులు, ఆకు పసర్లతో నగిషీలు అద్దుతారు. ఇళ్ల అలంకరణలో ప్రధాన ఆకర్షణగా నిలిచే నిర్మల్ బొమ్మలు ప్రపంచ ప్రసిద్ధిచెందాయి. కొయ్యబొమ్మలకు మాత్రమే కాదు చిత్రకళకు కూడా పెట్టింది పేరు నిర్మల్. ఇక్కడి చిత్రకళ మీద రాజపుత్ర, మొగల్, అజంతా చిత్రకళ ప్రభావం కనిపిస్తుంది. విదేశీ ఇంటీ రియర్ డిజైనర్లు సైతం గృహాలంకరణలో నిర్మల్ బొమ్మలకు స్థానం ఇస్తున్నారు.
హైదరాబాదీ హలీం.. రంజాన్ మాసపు ప్రత్యేక వంటకం. నిర్ణీత ఉష్ణోగ్రత, పీడనం కోసం.. ప్రత్యేకంగా నిర్మించిన బట్టీల్లో రాగి పాత్రలను ఉంచుతారు. వంటకు కలపను మాత్రమే వాడతారు. గోధుమరవ్వ, నెయ్యి, ఎముకలు లేని గొర్రె(పొట్టేలు) మాంసం, పుట్నాల పప్పు, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా హలీం తయారీకి ముఖ్యమైన దినుసులు. పిస్తాహౌజ్, ప్యారడైస్, కేఫ్ 555, హైదరాబాద్ హౌజ్ వంటివి హలీం తయారీకి ప్రసిద్ధిచెందిన సంస్థలు. రంజాన్ సీజన్లో మలేషియా, సింగపూర్, సౌదీ అరేబియా తదితర దేశాలకూ హలీం ఎగుమతి అవుతుంది. హలీం తినడానికే హైదరాబాద్ వచ్చే విదేశీ పర్యాటకులూ ఉన్నారు. పక్కా శాకాహార హలీం హైదరాబాదీల మరో ఆవిష్కరణ.
ఇదొక ప్రాచీన నగిషీ కళ. వెండి, బంగారాన్ని ఉపయోగిస్తారు. చిన్నచిన్న పూసలు, మెలితిరిగిన దారాలు, ఈ రెండిటి కలబోతతో కళాఖండాలను
తయారుచేస్తారు. ఈ కళకు ఇటాలియన్, ఫ్రెంచి మూలాలు ఉన్నాయని అంటారు. లాటిన్ పదాలు ఫైలమ్ దారం, గ్రేనమ్ పూసలు కలిసి ఇంగ్లిష్ పదం ఫిలిగ్రీ ఏర్పడింది. ఈ కళకు కరీంనగర్ పెట్టింది పేరు. చెంచాలు, సిగరెట్ పెట్టెలు, గుండీ పెట్టెలు, యాష్ ట్రేలు, ఆభరణాలు, పాన్దాన్లు, అత్తరుదాన్లు ప్రత్యేకం. నెమళ్లు, చిలుకలు, చేపలు అలంకరణలో ప్రముఖంగా కనిపిస్తాయి. జాలి లాంటి అలంకరణతో ఇట్టే ఆకట్టుకుంటాయి. వీటికి విశ్వవ్యాప్తంగా
ఆదరణ ఉంది.
తెలంగాణ రాష్ట్ర నృత్యం.. పేరిణి. కాకతీయుల అనంతరం కాలపరీక్షలో మరుగునపడిన పేరిణికి నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణ ప్రాణప్రతిష్ఠ చేశారు. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి బావమరిది జాయప సేనాని రచన ‘నృత్త రత్నావళి’లో ఈ నాట్యం ప్రస్తావన ఉంది. రామప్ప ఆలయం శిల్పాల విన్యాసం ఆధారంగా రామకృష్ణ పేరిణిని పునఃసృష్టించారు. యుద్ధభూమికి వెళ్లడానికి ముందు సైనికులకు ఉత్సాహాన్ని కలిగించేందుకు ఈ నాట్యాన్ని శివాలయంలో ప్రదర్శించేవారు. అందుకే పేరిణి శివతాండవం అనే పేరు స్థిరపడిపోయింది. తెలంగాణ అవతరణ తర్వాత.. పేరిణి ప్రపంచ దేశాలకూ పయనం అవుతున్నది. అమెరికా లాంటి దేశాల్లో నృత్య పాఠశాలలూ వెలుస్తున్నాయి.
కాకతీయుల నిర్మాణాల్లో తలమానికం.. రామప్పగుడి. ములుగు జిల్లా పాలం పేటలో ఉన్న 808 ఏండ్లనాటి ఈ గుడికి తాజాగా యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రాల జాబితాలో చోటు లభించింది. అలా మధ్యయుగాల నాటి కాకతీయ శిల్పకళ విశ్వవ్యాప్త గుర్తింపునకు నోచుకున్నట్లయింది. కాకతీయ మహాసేనాని రేచర్ల రుద్రుడి ఆదేశాల మేరకు ఈ గుడిని నిర్మించారు. నిర్మాణానికి 40 ఏండ్ల సమయం పట్టింది. శిల్పకళకు ప్రసిద్ధిచెందిన ఖజురహో, కోణార్క్, బేలూరు హలేబీడు ఆలయశిల్పాలను క్లోరైట్, లేటరైట్, ఖోండరైట్ లాంటి మెత్తటి శిలలను ఉపయోగించారు. కానీ రామప్పలో మాత్రం అత్యంత కఠినమైన శిలల్లో ఒకటైన నల్లశాణపు (బ్లాక్ బసాల్ట్) రాళ్లను వాడారు. పునాదుల కోసం శాండ్బాక్స్ సాంకేతికతను ఉపయోగించారు. ప్రధాన ఆలయ నిర్మాణానికి ఎర్ర ఇసుకరాయి, నల్లశాణపు రాయిని వాడగా, గోపుర నిర్మాణంలో మాత్రం తేలికైన ఇటుకలను ఉపయోగించారు.
నిర్మాణం పూర్తయి 60 ఏండ్లు దాటినా వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలో ఉన్న రాణి సరళాసాగర్ ఆనకట్ట భారతదేశంలో, ఆమాటకొస్తే ఆసియా ఖండంలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. సైఫన్ సాంకేతికతను ఉపయోగించి దీనిని కట్టడం విశేషం. అంతకు మునుపు ఇలాంటి నిర్మాణ శైలిని అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉపయోగించారు. వనపర్తి సంస్థానాధీశుడు రాజా రామేశ్వర రావు కాలంలో ఈ ఆనకట్ట నిర్మించారు. ఆయన తల్లి సరళాదేవి పేరుమీదుగా సరళాసాగర్ అని పెట్టారు. దీనికి పునాదిరాయిని 1949 సెప్టెంబర్ 15న అప్పటి హైదరాబాద్ మిలిటరీ పాలకుడు జనరల్ జయంత్నాథ్ చౌదరి వేశారు. 1959లో నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ ఆనకట్టను నాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు. కాగా, దీని నిర్మాణానికి అవసరమైన సాంకేతిక అధ్యయనం కోసం రాజావారి స్నేహితుడు ఇంజినీర్ పీ.ఎస్.రామకృష్ణ రాజు కాలిఫోర్నియా వెళ్లడం విశేషం. ఈ డిజైన్ను అనుసరించి దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు ప్రాణంపోసుకున్నాయని అంటారు. ఈ నిర్మాణం యువ ఇంజినీర్లకు ఓ డిజైనింగ్ పాఠం.
1999లో 600 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఏర్పాటుచేసిన జీనోమ్ వ్యాలీతో హైదరాబాద్ ఫార్మా ప్రస్థానం మొదలైంది. ఇది ప్రస్తుతం ప్రపంచంలో టీకా ఉత్పత్తి ఏర్పాట్లలో మూడోవంతు వాటాను కలిగి ఉంది. ఈ క్రమంలో ప్రపంచాన్ని కొవిడ్ 19 మహమ్మారి కమ్మేసినప్పుడు టీకాల పరిశోధన, అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైన సంస్థలు గణనీయమైన కృషిచేశాయి. జీనోమ్ వ్యాలీ కేంద్రంగా పనిచేసే ‘భారత్ బయో టెక్’, ‘బయలాజికల్ ఇ’.. భారతదేశంతోపాటు, అల్పమధ్యాదాయ దేశాల కోసం కొవిడ్ 19 టీకాలను ఉత్పత్తి చేసి, ఎగుమతి చేశాయి. రష్యా సృష్టించిన స్పుత్నిక్ వి టీకాను డా.రెడ్డీస్ ల్యాబ్స్ దేశీయంగా తయారుచేస్తున్నది. ప్రపంచానికి అవసరమైన కొవిడ్ 19 టీకాల తయారీ, సరఫరా వేగంగా, నాణ్యంగా జరగడంలో మన ఫార్మా క్లస్టర్ పాత్ర అనన్యసామాన్యం.