“కాకతీయుల కదన నైపుణి కాకతీయుల కవన పాండితి కాకతీయుల శిల్ప చిత్రము కాకతీయుల రాజ్య విభవము వేయేండ్లుగ నిలిచె కథలై వేలయేండ్లుగ నిలుచు చరితై జయము.. జయము కాకతీయులకు నగధీరులకు ప్రతిభాద్వితీయులకు”
.. అని కైమోడ్పులు అర్పిస్తూ కాకతీయులపై శతాధిక గ్రంథాలు రాశారు డాక్టర్ మలయశ్రీ. సాహితీవేత్త అయినా చరిత్ర అంటే, అందులోనూ కాకతీయ చక్రవర్తులు అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం. ఆ ఇష్టంతోనే వారి చరిత్రను అధ్యయనం చేశారు. సాహిత్యంలో కాకతీయుల ఆనవాళ్లను, నాటి సాంఘిక జీవనాన్ని శోధించారు. వాటన్నిటినీ తనదైన శైలిలో అక్షరబద్ధం చేశారు. ‘తొలి తెలుగు చక్రవర్తులు’ పేరిట నాటకాలను రూపుదిద్దారు. కాకతీయ సప్తాహాన్ని పురస్కరించుకుని ఆ విశేషాలను ‘జిందగీ’తో పంచుకున్నారు.
కాకతీయ చరిత్రపై ఇష్టం ఎలా ఏర్పడింది..?
మన తెలుగు నేల చాలా కాలం ఇతర భాషల ప్రాంతాల ప్రభువుల ఏలుబడిలోనే ఉంది. రెండువేల ఏండ్ల కింద ఆంధ్ర భృత్యులు శాతవాహనుల పాలనలోనే తెలుగు
వారంతా ఒక్కటిగా ఉన్నది. అయితే, శాతవాహన సామ్రాజ్యంలో ఇతర భాషల ప్రాంతాలూ ఉండేవి. ఇక చాళుక్య చక్రవర్తులు, రాష్ట్రకూటులు, విష్ణుకుండినులు ఈ నేలను ఏలినా ఇక్కడివారు కాదు. ఒక్క కాకతీయులే అచ్చంగా తెలుగువాళ్లు. అనుమకొండ, ఏకశిలానగరం (ఓరుగల్లు) వారి రాజధానులు. కాకతీయుల తరువాత ఈ తెలుగు నేలనంతా ఒక్క గొడుగు కింద ఏలినవారు ఎవరూ లేరు. అందుకే కాకతీయ సామ్రాజ్యం అంటే మొదటినుంచీ నాకు ప్రత్యేక అభిమానం.
నాటి, నేటి సాంఘిక జీవనంలో వ్యత్యాసాలు?
కాకతీయులు మనకు గొప్ప వారసత్వాన్ని అందించారు. వ్యవసాయ అభివృద్ధికి కృషిచేశారు. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ కాకతీయుల అద్భుత సృష్టి. వారి సామంతులు, మంత్రులు, సేనాధిపతులు సైతం చెరువుల తవ్వకాన్ని విరివిగా చేపట్టారు. రామప్ప, పాకాల, లక్నవరం మొదలైన జలాశయాలు ఇందుకు నిదర్శనం. ఇంత ఆధునిక కాలంలోనూ తెలంగాణలో కాకతీయుల నాటి సాంఘిక జీవనం కనిపిస్తుంది. ‘మిషన్ కాకతీయ’ లాంటి తెలంగాణ ప్రభుత్వ పథకాల రూపంలో కాకతీయుల స్ఫూర్తి కొనసాగుతున్నది.
కాకతీయుల శిల్పకళా సౌందర్యం ప్రత్యేకత?
కాకతీయులు నిర్మించిన ఆలయాలు అత్యున్నత శిల్పకళా సౌందర్యానికి చిరునామాలు. ఆలయాలపై అంగభోగం, రంగభోగం.. రెండూ ఉట్టిపడతాయి. శిల్పాలు జీవకళతో చూపరులను కట్టిపడేస్తాయి. అందులోనూ ఎన్నో విశిష్టతలు. ఇవి నాటి సాంఘిక జీవనానికి ప్రతిబింబాలు. కాకతీయులు అభివృద్ధి చేసిన నీటి వనరులకు, వ్యవసాయ అభివృద్ధికి తార్కాణాలు. ఆలయ మండపాలు, స్తంభాలు, సింహద్వారాలపై తామరలు, మకరతోరణాలు, లతలు, చేపలు, పూర్ణకుంభాల ప్రతిమలు కోకొల్లలుగా ఉండటం జలవనరులు, వ్యవసాయ అభివృద్ధికి వారు తీసుకున్న చర్యల గురించి తెలుస్తుంది.
కాకతీయ సాహిత్యం విశిష్టత?
కాకతీయ యుగంలో తెలుగు, సంస్కృత భాషలు రెండిటికీ రాజాశ్రయం లభించింది. ఎన్నో ఉత్తమ గ్రంథాలు వెలువడ్డాయి. వినుకొండ వల్లభరాయుడి ‘క్రీడాభిరామం’ కాకతీయుల సామాజిక జీవనానికి అద్దం పడుతుంది. పాల్కురికి సోమనాథుని ‘పండితారాధ్య చరిత్ర’లో స్పృశించని అంశమే లేదు. ఒకరకంగా ఇది తొలి తెలుగు విజ్ఞాన సర్వస్వం. పాల్కురికి మరో రచన ‘బసవపురాణము’ తొలి తెలుగు ద్విపద కావ్యమే కాకుండా, దేశి పురాణం కూడా! నీటి పారకం, వ్యవసాయ అభివృద్ధి, చెరువుల సంరక్షణ అంశాల గురించి కాకతీయుల శాసనాలు స్పష్టంగా తెలియజేస్తాయి.
మీ రచనలలో తెలుగు చక్రవర్తుల గురించి?
అనేక చరిత్ర పుస్తకాలు, తెలుగు విజ్ఞాన సర్వస్వాలు వెలువరించాను నేను. రుద్రదేవ, గణపతిదేవ, మహారాణి రుద్రమదేవి, ప్రతాపరుద్ర చక్రవర్తి నాటకాలకు ప్రాణంపోశాను. కాకతీయుల నాటి జీవితం- సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని నా రచనలు సాగాయి. ఇప్పటి తెలుగు భాషా రూపం అప్పుడు లేదు. ఆ తేడాను దృష్టిలో పెట్టుకుని నా నాటకాల్లో పాత్రోచిత భాషను సమకూర్చాను. సందర్భాన్ని బట్టి కన్నడ, మరాఠి, తమిళ, ఒరియా పదాలు ప్రయోగించాను. ‘ప్రతాపరుద్ర’లో తప్ప మరే నాటకంలోనూ ఉర్దూ, పార్సీ పదాలను వాడలేదు.
కాకతీయ ఉత్సవాల నిర్వహణ గురించి..?
చరిత్రను మరువకుండా ఉండేందుకు, భావితరాలకు ఘనమైన వారసత్వాన్ని అందించేందుకు ఇలాంటి ఉత్సవాలు ఎంతో దోహదపడతాయి.
…✍ మ్యాకం రవికుమార్