కరివరదుడైన దైత్యారి హరి యందు సురారి సుతుడైన ప్రహ్లాదుని నిసర్గ (సహజ, స్వాభావిక) భక్తికి ప్రధాన కారణం దేవర్షి నారదుని దివ్య సంసర్గ- సత్సాంగత్య, ప్రభావం. అసురరాజ సుతుడు అచ్యుతాత్ముడు! అతని మనో, బుద్ధుల నుంచి అచ్యుత పరమాత్మ ఎన్నడూ విచ్యుతుడు కాడు-జారిపోడు. ఇదెప్పుడు సంభవం? అంటే భక్తుడు కూడా తన నుంచి విభక్తుడు- విడిపోయినవాడు, కానప్పుడు. భగవంతునితో కూడి ఉంటే భక్తి, వీడిపోతే విభక్తి! ‘మయి తే తేషు చాప్యహమ్’- (నాలో వారుంటే వారిలో నేనుంటా) ఈ భగవద్గీతా వచనానికి ఇదే పరమార్థం.
నారదుడు ధర్మరాజుతో.. ఓ పాండుపుత్రా! ప్రహ్లాదుని అంతరంగంలో అచ్యుతభక్తి ఆనాటికానాటికి మెండుగా నిండసాగింది. ప్రాణపతి (స ఉ ప్రాణస్య ప్రాణః- పరమాత్మ ప్రాణుల ప్రాణానికి ప్రాణం), ముక్తులకు పరమగతి అయిన పురుషోత్తముని యందు ధ్యానరతి అతిశయించింది. ఆ ధ్యానస్థితిలో శ్రీహరి తనను చేరవచ్చినట్లు తోచగా, తాను తన మిత్రులను చేర మరచేవాడు. అసురారి అధోక్షజుడు తనతో ఆడుచున్నట్లు అనిపించగా, తాను తన తోటివారితో ఆటపాటలు మరచేవాడు. మాధవుడు తనతో మాట్లాడుతున్నట్లు అనిపించగా, కాయాధవుడు (కయాధువు కుమారుడు ప్రహ్లాదుడు) తనను పలకరించిన వారితో మారు పలకడం మరచేవాడు. చిత్తంలో చిన్మయరూపుడైన చక్రధారి మీద చూపు నిలిపి, ఆ తన్మయత్వంలో తన తనువును, ఈ మృణ్మయ జగత్తును చూడ మరచేవాడు. అనంతపద్మనాభుని పదపద్మ చింతనామృతంచే హృదంతరం- అంతరంగం నిండినట్లు కాగా, నిరంతరం ఆనందమయుడై అంతామరచి జడత్వం లేకనే జనానికి జడునివలె కన్పించేవాడు.
అవనీనాథా! అంతేకాదు..
అసురరాజ సుతునికి అన్నం తింటున్నా పన్నగశాయి చింతనే. మంచినీరు తాగుతున్నా, మనుషులతో ముచ్చటిస్తున్నా మాధవుని మీదే మనసు. ఆటలాడేటప్పుడు కూడా అచ్యుతుని గూర్చిన ఆలోచనే. నడుస్తున్నా, నవ్వుతున్నా.. నారాయణ నామ పారాయణే. లోకాన్ని దర్శిస్తున్నా దృష్టి మాత్రం శోకనాశకుని మీదే. ఇలా జాగ్రద్దశ అంతా జగన్నాథమయం కాగా చివరకు నిద్రలో కూడా భద్రమూర్తియైన కమలేశుని కలవరింతలే, కేరింతలే! ఈ విధంగా నరేంద్ర చంద్రా! నాగేంద్ర శయనుని చరణారవింద చింతనమనే మరందాన్ని ఆస్వాదించి ఆ మైకంలో ఈ లోకాన్నే మరచిన ఏకభక్తుడు ప్రహ్లాదుడు! ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని- ఈ నాలుగు విధాల భక్తులలో ‘జ్ఞానీ నిత్యయుక్తః ఏక భక్తిర్విశిష్యతే’ అని గీతాచార్యుని నిష్కర్ష! అనగా వీరిలో చతుర్థుడైన జ్ఞానియే సర్వథా కృతార్థుడు. కారణం? అతను ఏకభక్తి- అనన్యభక్తుడు. కనుక అందరిదీ భక్తే అయినా జ్ఞానిదే నిజమైన భక్తి- నిష్ఠారూపమైన పరాభక్తి. ‘ఆసీనః పర్యటన్నశ్నన్ శయానః ప్రపిబన్ బృవన్, నానుసంధత్త ఏతాని గోవింద పరి రంభితః’ ఈ భాగవత శ్లోకానికి సమర్థమైన సార్థక అనువాదమే పై శార్దూల వృత్తం. ‘పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్నశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్, ప్రలపన్ విసృజన్ గృహ్ణన్నున్మిషన్నిమిషన్నపి’ (కర్మ సన్న్యాస యోగం) అన్న గీతశాస్త్ర ధ్వనికి పై భగవత శ్లోకం పురాణం చేసే ‘ప్రతిధ్వని’! అని మనీషుల వ్యాఖ్య.
‘న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్’ (గీత)- ఈ జగత్తులో జీవించి ఉన్నవాడెవ్వడూ ఏదోఒక కర్మ చెయ్యకుండా ఒక్కక్షణమైనా ఊరకే ఉండలేడు. జీవన- నిర్వహణకైనా అవసరమైన పనులు చెయ్యక తప్పదు. అందరు వ్యక్తుల వలెనే ప్రహ్లాదుడు కూడా కర్తవ్య కర్మలు అన్నీ ఆచరిస్తాడు. కానీ, పరమాత్మ స్మరణ పూర్వకంగా! ‘మామనుస్మర యుధ్య చ’- (నన్ను స్మరిస్తూ స్వధర్మం నిర్వహించు) అనే కదా భగవదాదేశం! ఇది మహాయోగం!
‘కృష్ణ గ్రహ గృహీతాత్మా’- గొల్ల తల్లజుడు (యాదవ శ్రేష్ఠుడు) పిల్ల ప్రహ్లాదుని ఉల్లం (మనసు) కొల్లగొట్టాడట. అది ఎలాగో ఈ కింది సీస పద్యం మూసలో పోసి విశదీకరించాడు అమాత్యుడు..
నారద ఉవాచ- పృథ్వీపతీ! ఆ ప్రహ్లాదుడు విష్ణుస్మరణలో మునిగి మైమరచి చేష్టలు ఉడిగినవాడై ఒక్కచోట ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాడు. మనసంతా మాధవ భక్తి నిండగా ఒక్కోసారి గోవిందుని కీర్తనలు గొంతెత్తి గానం చేసేవాడు. విశ్వంలో విష్ణువు తప్ప వేరెవ్వరూ లేరని నొక్కి వక్కాణిస్తూ మరోచోట పకపక నవ్వేవాడు. పద్మాక్షుడనే పెన్నిధిని కనుగొన్నానని పొంగిపోతూ వేరొక్కచోట గంతులు వేసేవాడు. మరోమాటు ‘ముకుందా! మధుసూదనా!’ అని మైమరచి పిలుస్తుంటే కళ్లు చెమర్చగా ప్రేమతో ఒళ్లు పులకించేది. ఒక్కోసారి నేత్రాలు మూసి ఒకచోట నిర్లిప్తంగా నిలబడి ఉండేవాడు. మహారాజా! మనసంతా ఇలా మాధవార్పితం గావించి మనుగడ సాగించేవాడు. తాను పరమానంద మగ్నుడై ఉంటూ, దుస్సంగ దుష్ప్రభావ పీడితులైన దీనహీన మనస్కులకు కూడా మనశ్శాంతి చేకూరుస్తూ ఉండేవాడు. ‘మన్మనాభవ, మయ్యాసక్తమనాః’- నీ మనస్సును నాయందు దృఢంగా నిలిపి; ‘మయ్యర్పిత మనోబుద్ధిః’- మనోబుద్ధులను నాయందే ఉంచి; ‘మయ్యావేశ్య మనః’- నాయందు మనసు లగ్నపరచి.. గీతలోని ఈ ఆదేశ, ఉపదేశ వాక్యాలన్నిటికీ ఆదర్శభూతుడు, ఉదాహరణ స్వరూపుడే ప్రహ్లాదుడు!
శా॥ పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్, భాషించుచున్ హాస లీ
లా నిద్రాదులు సేయుచుం దిరుగుచున్ లక్షించుచున్ సంతత
శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతా స్వాద సం
ధానుండై మరచెన్ సురారిసుతుఁ డేతద్విశ్వమున్ భూవరా!
సీ॥ వైకుంఠ చింత వివర్జిత చేష్టుడై యొక్కడు నేడుచు నొక్కచోట,
నశ్రాంతహరి భావనారూఢ చిత్తుడై యుద్ధతుడై పాడు నొక్కచోట,
విష్ణుడింతయ కాని వేరొండు లేదని యొత్తిలి నగుచుండు నొక్కచోట
నలినాక్షుడను నిధానముఁ గంటి నేనని యుబ్బి గంతులు వైచునొక్కచోట,
ఆ॥ బలుకు నొక్కచోటఁ బరమేశు గేశవుఁ, బ్రణయహర్ష జనిత బాష్పసలిల
మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై, యొక్కచోట నిలిచి యూరకుండు!
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006