ఆయన పాట వింటే.. ‘ఊఁ’ అంటూ ఉర్రూతలే! జానర్ ఏదైనా ‘ఉహ్హూ’ అనడాలు ఉండవు. ‘సూపర్ మచ్చి’ అన్నాడా.. ‘టాప్ లేచిపోద్ది’ అంతే! ‘జిల్ జిల్ జిగేలు రాణి’ అంటూ ఎత్తుకున్నాడా.. ‘రంగస్థలం’ దద్దరిల్లాల్సిందే!! పదేండ్ల వయసులోనే పదనిసలతో ఆటాడుకున్న సంగీత దర్శకుడు ‘దేవి’ శ్రీ ప్రసాద్. 23 ఏండ్ల స్వర ప్రస్థానంలో వంద చిత్రాల మార్కుకు చేరువయ్యాడు. ‘పుష్ప’తో జాతీయస్థాయిలో ఇప్పుడు డీఎస్పీ పేరు మార్మోగుతున్నది. ఆయన సంగీత దర్శకత్వం వహించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా తన ప్రయాణంలో పోగేసుకున్న కొన్ని అనుభవాలు ‘జిందగీ’తో పంచుకున్నాడు.
‘పుష్ప’ పాటలకు ఖండాంతర గుర్తింపు దక్కడంపై మీ స్పందన..
ఈ విషయంలో సుకుమార్, అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్కు నేను కృతజ్ఞతలు చెప్పాలి. అందరూ కలిస్తేనే ఆడియోకు ఇంత ఘన విజయం దక్కిందని అనుకుంటున్నా. ఐదు భాషల్లో సినిమా విడుదల కావడం కూడా పాటలు ఎక్కువ మందికి చేరేందుకు దోహదమైంది. నాకు తెలుగు, తమిళం, హిందీ తెలుసు కాబట్టి పాటలను డబ్బింగ్లా కాకుండా మాతృకలాగే ఉండేలా చూసుకున్నాం. ఏ భాషలో ఏ గాయనీ గాయకులు పాడాలనే విషయంలోనూ పెద్ద కసరత్తే జరిగింది. సుకుమార్తో ఎప్పుడూ చెప్పేవాడిని నువ్వు జాతీయస్థాయికి వెళ్లాలని, అలాగే అల్లు అర్జున్ను కూడా పాన్ ఇండియా సినిమాలు వదలొద్దు… అనేవాడిని. వాళ్లకు అంత ప్రతిభ ఉందని నాకు తెలుసు. నా మాటలు ‘పుష్ప’తో నిజం కావడం సంతోషంగా ఉంది.
‘పుష్ప’లాంటి మాస్ సినిమా తర్వాత ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే కుటుంబ కథా చిత్రానికి పని చేస్తున్నారు. ఈ తేడా ఎలా అనిపిస్తున్నది?
వెంటవెంటనే భిన్నమైన చిత్రాలకు సంగీతాన్ని అందించడం నాకు కొత్తగా అనిపిస్తుంటుంది. దాన్ని సవాలుగా తీసుకుని పనిచేస్తుంటా. ‘రంగస్థలం’ సినిమా చేస్తున్నప్పుడు ‘భరత్ అనే నేను’ చిత్రానికి పాటలు, నేపథ్య సంగీతం అందించాను. ఆ రెండు సినిమాలు వేటికవి భిన్నమైనవి. రెండూ విజయం సాధించాయి. ఇప్పుడు ‘పుష్ప’ తర్వాత ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాకు స్వరాలు అందిస్తున్నా. ఇది పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రం. పెద్ద కుటుంబంలో ఉండే సరదాలు, సంతోషాలతో సాగుతుంది. నేను బాగా ఆస్వాదించాను. పుష్ప రెండో భాగంలో పాటలు ఎలా ఉండాలో మొదటి సినిమా సమయంలోనే నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఆ పాటలపై కసరత్తు జరుగుతున్నది.
దర్శకుడు కిషోర్ తిరుమలతో మీకిది నాలుగో సినిమా. అతనిలో ఏ ప్రత్యేకత గమనించారు?
ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ రెండూ బాగా హ్యాండిల్ చేయగల దర్శకుడు కిషోర్ తిరుమల. ఆయన పాటలన్నీ పాత్రల ద్వారా వస్తుంటాయి. కథ చెప్పేటప్పుడే పాటలు ఏ సందర్భంలో రావాలి, పాటలో ఏం చెప్పాలి, ఎలా రావాలో స్పష్టంగా వివరిస్తాడు. దాంతో మాకు పాటల రూపకల్పన సులభం అవుతుంది. కిషోర్ తిరుమల సినిమాల్లో ఇప్పటిదాకా వచ్చిన అన్ని చిత్రాల్లోకి ఇదే బెస్ట్ ఆడియో అవుతుంది.
‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చూస్తున్నప్పుడు మీ కుటుంబం గుర్తొచ్చిందా?
అవును.. మాది చాలా పెద్ద కుటుంబం. అమ్మ తరఫున, నాన్న వైపు చాలామంది బంధువులు ఉండేవారు. చిన్నప్పటి నుంచి నేనంటే వాళ్లకు చాలా ఇష్టం. సొంతూరికి వెళ్లినప్పుడు బాబాయ్లు, పిన్ని, అత్తయ్యలు, మామయ్య.. ఇలా అందరితో సరదాగా ఉండేది. ఈ సినిమాకు పనిచేస్తున్నప్పుడు వాళ్లతో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. శర్వానంద్ ‘శంకర్దాదా..’ సినిమా నుంచే తెలుసు. మేం కలిసి సినిమా చేయాలని అనుకునేవాళ్లం. ఈ సినిమాతో కుదిరింది.
మీ కుటుంబంలో ఏ మహిళకు ముందు జోహార్లు చెబుతారు.
ఎవరి జీవితంలోనైనా ‘అమ్మ’కే ముందు జోహార్లు చెప్పాలి. నాన్న అనారోగ్యంగా ఉంటే కొన్నేండ్లపాటు ఆయనకు సేవలు చేసి బతికించింది అమ్మ. అందుకే అమ్మకు తానూ ఓ పిల్లాడే అని చెప్పుకొనేవారు నాన్న. మేము ఇలా జీవితాల్లో స్థిరపడగలిగాం అంటే అమ్మ శ్రమే కారణం.
సోషల్ మీడియా ప్రభావంతో పాట చేరిక బాగా పెరిగింది కదా, ఇది సంగీతానికి గొప్ప సమయం అనుకోవచ్చా?
సంగీతానికి మంచి కాలం అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది. యాభై, వందేండ్ల కిందటి పాటలూ గుర్తు పెట్టుకుంటాం. ఇప్పటికీ సాలూరి రాజేశ్వరరావు, కేవీ మహదేవన్, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, మైకేల్ జాక్సన్ పాటలు వింటుంటాం. మరి వాళ్లు పాటలు చేసే సమయానికి సోషల్ మీడియా లేదు. కానీ, ఆ పాటలు చిరకాలం నిలిచిపోయాయి. పాట బాగుంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ, సోషల్ మీడియా వల్ల పాటకు గొప్పదనం రాదు. మంచి సంగీతం తరాలు దాటి ప్రయాణిస్తూనే ఉంటుంది. వ్యూస్, రీల్స్, వైరల్ కావడం పాటకు దక్కే అదనపు బహుమతులు.
దాదాపు పాతికేండ్ల మీ ప్రయాణాన్ని ఎలా నిర్వచిస్తారు?
సంగీతం మీద ఉన్న అపారమైన ప్రేమే నన్ను ఇంకా ఉత్సాహంగా స్వరాలు అందించేలా చేస్తున్నది. నేను సంగీత దర్శకుడిని అని అనుకోను. సంగీత ప్రేమికుడిని. సంగీత దర్శకుడు అంటే అదో ఉద్యోగంలా అనిపిస్తుంది.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఏంటి?
వెంకటేశ్, వరుణ్తేజ్ నటిస్తున్న ‘ఎఫ్ 3’, చిరంజీవి-దర్శకుడు బాబీ సినిమా, పవన్కళ్యాణ్ ‘భవదీయుడు భగత్సింగ్’, వైష్ణవ్ తేజ్ ‘రంగరంగ వైభవంగా’తో పాటు తమిళంలో కొన్ని చిత్రాలు ఉన్నాయి.
– రమేష్ గోపిశెట్టి