బాగా ముదిరిపోయి, శరీరాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తే తప్ప క్యాన్సర్ వ్యాధిని కనిపెట్టలేం. ఆ దశలోనూ పెద్ద పెద్ద పరీక్షలు తప్పవు. ఈ పరిస్థితిలో కొంత మార్పును తీసుకువచ్చేలా క్యాలిఫోర్నియాకు చెందిన టెరసకి ఇన్స్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ ఇన్నోవేషన్ శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగాన్ని చేశారు. అందులో భాగంగా శరీరంలో క్యాన్సర్ ఆనవాళ్లను పసిగట్టే కాంటాక్ట్ లెన్స్ను తయారు చేశారు. యాంటీబాడీ కాంజుగేటెడ్ సిగ్నలింగ్ మైక్రో చాంబర్ కాంటాక్ట్లెన్స్ (ఏసీఎస్ఎమ్- సీఎల్) గా వీటిని పిలుస్తున్నారు. సాధారణ కాంటాక్ట్ లెన్సుల్లానే కంటి గుడ్డుకు అమర్చుకోగలిగేలా రూపొందించినా.. ఇవి క్యాన్సర్ కణుతులకి సంబంధించిన అతి సూక్ష్మకణాలను గుర్తిస్తాయి.
అంతేకాదు ఇందులోని అత్యాధునిక టెక్నాలజీ వల్ల ఈ రకం కణాలు తగిలినప్పుడు ఆ లెన్సు రంగు మారేలా డిజైన్ చేశారు. ఆ మార్పువల్ల ఆ వ్యక్తుల శరీరంలో ఏదో అనుమానాస్పద కణితి పెరుగుతున్నదన్న విషయం అర్థమవుతుంది. వివిధ కణాల్లో జరిగే అనేకానేక చర్యలవల్ల ఎక్సోసమ్లుగా పిలిచే ఒక రకం అతి సూక్ష్మకణాలు ఏర్పడతాయి. అయితే ఆ చర్యల తర్వాత కణాల నుంచి బయటికి నెట్టివేయబడతాయి. అంటే ఈ ఎక్సోసమ్లు మూత్రం, లాలాజలం, రక్తం, కంటి నీరులాంటి వాటిలోకి చేరతాయి. అయితే ఇవి ఊరికే బయటికి నెట్టివేయబడే కణాలు కావనీ, లోపలి కణాలకు సంబంధించిన డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, ప్రొటీన్లు, లిపిడ్లలాంటి వాటి సమాచారాన్ని తమలో నిక్షిప్తం చేసుకుని ఉంటాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ లెక్కన శరీరంలో అనవసరంగా పెరుగుతున్న కణుతులకు సంబంధించిన సమాచారాన్నీ ఈ ఎక్సోసమ్ల ద్వారా కనుగొనవచ్చని గుర్తించారు. అందుకే కంటిలోని తడిని ఆధారంగా చేసుకుని తక్కువ ఖర్చుతో, సులభంగా క్యాన్సర్ను కనిపెట్టవచ్చు.