‘అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్’కి మూడు మిలియన్ల మంది యంగ్ సైంటిస్టులు పోటీపడుతున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రత్యామ్నాయం చూపే ఆవిష్కరణలకు 25 వేల డాలర్ల గ్రాంట్ని ఇస్తారు. ఈ పోటీలో ఫైనల్ రౌండ్ జాబితాకు ఎంపికైన యువ సైంటిస్టుల్లో భారతీయ మూలాలున్న అరికా కుందు ఉంది. మిన్నెసొటాలో నివసిస్తున్న అరిక ఏడో తరగతి చదువుతున్నది. కూరగాయలు, పండ్లపై ఉండే పురుగుమందు అవశేషాలను తొలగించేందుకు ఆమె ఓ ఉపాయం కనుగొంది. ప్రకృతిలో కొన్ని పదార్థాలకు సహజంగానే రసాయనాలను పీల్చుకునే స్వభావం ఉంది.
అలాంటి గుణం కలిగిన పల్లిపొట్టుని ఉపయోగించి పురుగుమందుల అవశేషాలను శోషణ చేసేందుకు ఇంట్లోనే ప్రయోగాలు చేపట్టింది. ఓ గదిలో చిన్న ప్రయోగశాలను ఏర్పాటు చేసుకుని పల్లీపొట్టును పొడి చేసింది. ఈ పొడి కొన్ని రసాయనాలను శోషించుకుంటుందని ప్రయోగ పూర్వకంగా నిరూపించింది. పల్లీపొట్టు పొడిలోని అణువులు పెస్టిసైడ్ అణువులను బంధిస్తాయి. వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి తాజా ఉత్పత్తులపై ఉండే పెస్టిసైడ్స్ అవశేషాలను జీవశోషణ ద్వారా తొలగించడం కోసం ఆమె చేపట్టిన ఈ ప్రాజెక్ట్కి ‘లిగ్నెక్స్’ అని పేరు పెట్టింది. ఒకవేళ అమెరికా యంగ్ సైంటిస్ట్ కాంపిటేషన్లో టాప్గా నిలిస్తే తన ప్రయోగాన్ని మరింత అభివృద్ధి చేసి మెరుగైన పరిష్కారం చూపుతానని చెబుతున్నది అరిక.