బెంగళూరు, ఆగస్టు 28/(స్పెషల్ టాస్క్ బ్యూరో) : కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ‘మహర్షి వాల్మీకి కార్పొరేషన్’ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. స్కామ్కు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మంత్రి బీ నాగేంద్ర శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో కన్నీటి పర్యంతమైన ఆయన.. తనపై కుట్ర జరిగినట్టు పేర్కొన్నారు. నాగేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం ఇది రెండోసారి. ఇదే స్కామ్ ఆరోపణల్లో 2024లో అప్పటి సిద్దరామయ్య క్యాబినెట్లోఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న నాగేంద్ర తన పదవి నుంచి తప్పుకున్నారు.
‘కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’కు చెందిన పలు బ్యాంకు ఖాతాల్లో ఉండాల్సిన రూ.187 కోట్లు పక్క దారి పట్టాయి. వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్స్ సూపరింటెండెంట్ పీ చంద్రశేఖరన్ 2024 మే 26న ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. ఈ స్కామ్ గురించి చంద్రశేఖరన్ తన ఆరు పేజీల సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. యూనియన్ బ్యాంకు సైతం తమ బ్యాంకులోని వాల్మీకి కార్పొరేషన్ ఖాతా నుంచి చట్టవిరుద్ధంగా నగదు బదిలీ అయ్యిందని ఫిర్యాదు చేసింది. సర్వత్రా ఒత్తిడి పెరగడంతో అప్పటి సిద్ధరామయ్య ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈడీ, సీబీఐ సైతం రంగంలోకి దిగాయి.
వాల్మీకి కార్పొరేషన్ నుంచి దారి మళ్లిన మొత్తం రూ.187 కోట్లలో తెలుగు రాష్ర్టాలకు రూ.90 కోట్లు చేరినట్టు సిట్ అంతర్గత నివేదికలో వెల్లడించింది. ఇందులో హైదరాబాద్లోని ఆర్బీఎల్ ఒక్క బ్యాంకుకే చెందిన 9 బ్యాంకు ఖాతాలకు రూ.44.6 కోట్లను బదిలీ చేసినట్టు వెల్లడైంది. ఈ డబ్బును గత లోక్సభ ఎన్నికల ప్రచారంలో వాడినట్టు వార్తలు వచ్చాయి. ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం సూచనల మేరకే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కామ్కు పాల్పడిందని, ఇక్కడి కాంగ్రెస్కు కూడా ఈ స్కామ్తో సంబంధం ఉన్నట్టు అర్థమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.