తీవ్రమైన మతిమరుపు వల్ల మెదడు మొరాయించడమే అల్జీమర్స్. దీంతో జ్ఞాపకశక్తి మీద ప్రభావం పడటమే కాదు, రోజువారీ పనులకు ఆటంకం కలుగుతుంది. 60% నుంచి 80% తీవ్రమైన మతిమరుపు, ఆలోచనా శక్తి లోపించడం ప్రధాన లక్షణాలుగా కలిగిన డిమెన్షియా సమస్య ఉన్నవారిని అల్జీమర్స్ చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉంది. ఏటా సెప్టెంబర్ 21ని ‘ప్రపంచ అల్జీమర్స్ డే’గా జరుపుకొంటారు. అల్జీమర్స్ వృద్ధులలో తరచుగా కనిపిస్తుంది. ఈ సమస్య దీర్ఘకాలం కొనసాగితే మెదడు కణాలు క్షీణించిపోతాయి. అల్జీమర్స్ బారినపడిన వారి కుటుంబసభ్యుల మీద కూడా ఎంతోకొంత ప్రభావం పడుతుంది. అందువల్ల, దీనిని కుటుంబ వ్యాధిగా పరిగణిస్తారు.
మతిమరుపు, ఆలోచనా శక్తి లోపించే సమస్య డిమెన్షియాకు, అల్జీమర్స్కు కొంచెం తేడా ఉంటుంది. డిమెన్షియా అంటే రోజువారీ పనుల్లో మెదడు సాధారణ విధుల్లో అసౌకర్యం తలెత్తడం. ఇక అల్జీమర్స్ అనేది డిమెన్షియాలో ఒక రకం. ఇది మెదడులోని నరాలను క్షీణింపజేసే వ్యాధి. దీని కారణంగా జ్ఞాపకశక్తి, గుర్తింపు సామర్థ్యాలు తగ్గిపోతాయి. ఒకవేళ సమయానికి సరైన చికిత్స, జాగ్రత్తలు తీసుకోకపోతే కాలం పరుగెడుతున్న కొద్దీ రోగుల ప్రవర్తన విపరీతంగా ఉంటుంది. ఏకాగ్రతకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. సామాజికంగా దూరమవుతారు.
కారణాలు అనేకం
కుటుంబసభ్యులలో ఎవరైనా అల్జీమర్స్ బారినపడితే ఆ కుటుంబంలోని వారికి కూడా వచ్చే ముప్పు ఉంటుంది. వృద్ధాప్యమే అల్జీమర్స్ అభివృద్ధి చెందడానికి ప్రధానమైన కారకంగా నిలుస్తుంది. నివేదికలను అనుసరించి, 65 ఏండ్లు దాటినవారిలో అల్జీమర్స్ సమస్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. కపాలానికి గాని, తలకు గాని బలమైన గాయం అయిన సందర్భాలు కూడా మెదడు మీద దుష్ప్రభావాన్ని కలగజేస్తాయి. జన్యుపరమైన కారణాలు కూడా అల్జీమర్స్కు దారితీస్తాయి. ఈ వ్యాధికి ‘ఏపీఓఈ- ఈ4’ జన్యువు సాధారణమైన కారణంగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దాదాపు పావు వంతు అల్జీమర్స్ కేసులలో ఈ జన్యువుదే కీలకపాత్ర.
చాలామంది అల్జీమర్స్ను వయసు మీద పడుతున్న కొద్దీ ముమ్మరించే వ్యాధిగానే చూస్తున్నారు. అయితే, అల్జీమర్స్కు వయోభారం ప్రధాన కారణాల్లో ఒకటైనప్పటికీ, కేవలం వయసు మీరినవారు మాత్రమే దీని బారినపడతారని అనుకోవద్దు. భారతదేశంలో 40 50 ఏండ్ల వయసులో (ముఖ్యంగా ఉద్యోగ ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నవారు) మతిమరుపు సమస్యల బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నదని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి, అందరూ ఈ వ్యాధిపట్ల అవగాహన పెంచుకోవాలి. సాటివారిని చైతన్యవంతుల్ని చేయాలి.
అల్జీమర్స్ మాసం
అలోయ్స్ అల్జీమర్స్ అనే జర్మన్ సైకియాట్రిస్ట్ 1901లో ఓ 50 ఏండ్ల జర్మన్ మహిళకు చికిత్స చేస్తూ ఈ వ్యాధిని తొలిసారిగా గుర్తించాడు. ఆయన పేరుమీదుగానే దీనికి అల్జీమర్స్ అనే పేరు స్థిరపడింది. అల్జీమర్స్ బారినపడితే నివారణ చర్యలు కానీ, వ్యాధి నయం కావడం కానీ ఉండవు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అల్జీమర్స్ బాధితులకు అండగా నిలవడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి, ప్రభుత్వాలు తగిన విధానాలు రూపొందించేలా చేయడానికి అల్జీమర్స్ డిసీజ్ ఇంటర్నేషనల్ (ఏడీఐ) లాంటి సంస్థలు కృషి చేస్తున్నాయి. ఏడీఐ 10వ వార్షిక సమావేశంలో ‘ప్రపంచ అల్జీమర్స్ డే’ భావనను ప్రవేశపెట్టింది. 2012 నుంచి సెప్టెంబర్ను అల్జీమర్స్ మాసంగా కూడా నిర్వహిస్తున్నారు.