అసలైన హీరోల కథలను తెరకెక్కించినప్పుడే వెండితెర పునీతమయ్యేది, సినిమాకు సార్థకత చేకూరేది. ముంబై తాజ్ హోటల్ మీద ఉగ్రదాడి సమయంలో వందలమందిని కాపాడిన హీరో, భారత సాహస పుత్రుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథను తెరకెక్కించి ‘మేజర్’ సినిమా అలాంటి ప్రయత్నమే చేసింది. ఈ చిత్రంలో మేజర్ సందీప్ పాత్ర తన కెరీర్లో ఓ మైలురాయి
అని చెబుతున్నారు.. అడివి శేష్. ఈ సినిమా జూన్ 3న పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను ‘జిందగీ’తో పంచుకున్నారు హీరో అడివి శేష్.
మేజర్ సందీప్ జీవితం ఉత్కంఠభరితంగా ఉంటుంది. నిజంగా జరిగిన సంఘటనల్ని తెరకెక్కించినా.. సినిమా కోసం డ్రామా జోడించారని అంటారేమో. అంత గొప్ప జీవితం. ఒకసారి ఆయన ట్రైన్లో వెళ్తున్నప్పుడు.. ఓ మిత్రుడికి డబ్బు అవసరమైంది. అడగ్గానే జేబులో ఉన్నదంతా ఇచ్చేశారు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. రెండు రోజులు ఏమీ తినకుండా ప్రయాణించారు. ఆయన జీవితమే ఓ స్ఫూర్తి సందేశం.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో సినిమా చేయాలని ఎందుకు అనిపించింది?
అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. ముంబై ఉగ్రదాడుల మరుసటి రోజు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఫొటో మీడియాలో వచ్చింది. ఎందుకో, మా సోదరుడు పవన్లా అనిపించారు. వందలమందిని కాపాడిన ఆ యోధుడి సాహసం గొప్పగా అనిపించింది. అప్పటినుంచి మేజర్ సందీప్ అభిమానిగా మారిపోయాను. ఆయన గురించి మరింత తెలుసుకున్నాను. నటుడిగా స్థిరపడ్డాక ఈ ఇతివృత్తంతో ఓ సినిమా చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ‘క్షణం’ తర్వాత ఈ చిత్ర సన్నాహాలు ప్రారంభించాం.
మీ అధ్యయనంలో మేజర్ సందీప్ దేశభక్తి గురించి ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి?
సందీప్ నేటితరం భగత్సింగ్. కనీసం పది సినిమాలకు సరిపడినన్ని అద్భుత ఘట్టాలు ఆయన జీవితంలో ఉన్నాయి. వ్యక్తిగత జీవితమూ ఆసక్తికరమే. సందీప్ సినిమాలు ఎక్కువగా చూసేవారు. సాకర్ ఆడేవారు. మంచి అందగాడు కూడా. కాలేజీ రోజుల్లో ఎంతోమంది అమ్మాయిలు ఇష్టపడేవారు. కానీ ఆయన మనసు ఒకరికే అంకితం. నాన్నతో, అమ్మతో, స్నేహితులతో, ప్రియురాలితో ఆయన గడిపిన క్షణాలు ప్రేక్షకులకు ఒక కొత్త సినిమాను చూసిన అనుభూతిని ఇస్తాయి. ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ ముఖ్య పాత్రలు పోషించారు.
బయోపిక్కు మేజర్ సందీప్ తల్లిదండ్రులు అంగీకరించారా?
నా కంటే ముందు, అనుమతి కోసం చాలా మంది ఆయన తల్లిదండ్రులను కలిశారు. అయితే ఆ సినిమాలకు అనుకున్న ఏ హీరోలోనూ సందీప్ పోలికలు కనిపించలేదట. నేను సంప్రదించినప్పుడు వాళ్లకు నా నిజాయతీ నచ్చింది. ఆ మాటే నాతో చెప్పారు. పైగా వాళ్లబ్బాయి పోలికలు ఉన్నాయి నాకు. సందీప్గారి తల్లిని నేను అమ్మా అనే పిలుస్తాను.
నిర్మాతగా మహేశ్ బాబు ఇచ్చిన సపోర్ట్ గురించి?
కథ కూడా సిద్ధంగా లేని దశ నుంచీ మమ్మల్ని నమ్మి సినిమా నిర్మాణానికి ముందుకొచ్చారు మహేశ్ బాబు. సినిమాను ఈ స్కేల్లో రూపొందించి, విడుదలకు వారం పదిరోజుల ముందే వివిధ నగరాల్లో ప్రీమియర్ షోస్ వేస్తున్నామంటే ఆయన సపోర్ట్ వల్లే సాధ్యమైంది. ‘మేజర్’ సినిమా చూసి ఉద్వేగానికి లోనయ్యానని చెప్పారు మహేశ్.
ఈ సినిమాలో నటిస్తున్న సమయంలో ఒక సైనికుడి శ్రమను తెలుసుకోగలిగారా?
సైనికుల కష్టాల్ని దగ్గరనుంచీ చూశాను. మన దేశపు చివరి గ్రామం ఛిత్కుల్. ఆ గ్రామ జనాభా రెండొందలు. ఇక్కడ పగలూరాత్రీ మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్ చేశాం. మాకు సహాయకులు ఉండేవారు. షాట్ గ్యాప్లో హీటర్స్, దుప్పట్లు ఉపయోగించేవాళ్లం. కానీ సైనికులకు అవేమీ లేవు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేశం కోసం కాపలా కాయడం ఎంత కష్టమో అప్పుడే అర్థమైంది. నేను అమెరికాలో పెరిగాను. వారాంతాల్లో టీవీలో మన దేశభక్తి కార్యక్రమాలు చూసేవాడిని. ఏఆర్ రెహమాన్ వందేమాతరం పాట వస్తే నిలబడి చూసేవాడిని. అలా మరొక దేశం నుంచి మన దేశంతో ప్రేమలో పడ్డాను.
మీరు వరుసగా థ్రిల్లర్స్ చేయడానికి కారణం?
నా చిత్రాలు పైపైకి ఒకే జానర్స్లో ఉన్నట్టు అనిపించినా, లోతుగా ఆలోచిస్తే వాటిలో వైవిధ్యం కనిపిస్తుంది. ‘క్షణం’, ‘ఎవరు’ థ్రిల్లర్స్, త్వరలో చేయబోయే ‘హిట్ 2’ కూడా థ్రిల్లర్ మూవీనే. కానీ ‘గూఢచారి’, ‘గూఢచారి 2’, ‘మేజర్’ ప్రత్యేకమైన సినిమాలు. ‘మేజర్’ సినిమాలో అందమైన లవ్ స్టోరీ కూడా ఉంటుంది.
పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి, ఈ సినిమాతో హీరోగా మీ స్థాయి పెరిగిందని భావిస్తున్నారా?
మేజర్ సందీప్ దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. ఆయన అందరివాడు. అందుకే ఈ సినిమాను వివిధ భాషల్లో రూపొందించాం. పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నాం. ఆయన గొప్పదనాన్ని ప్రజలకు చూపించే క్రమంలో హీరోగా నా స్థాయి కూడా పెరిగి ఉండొచ్చు.
– రమేష్ గోపిశెట్టి