అద్దె గర్భం చుట్టూ సవాలక్ష వివాదాలు. నైతికతను ప్రశ్నించేవారు. కరెన్సీ జోక్యాన్ని నిలదీసేవారు. సంప్రదాయాలతో ముడిపెట్టేవారు. ఎవరి అభిప్రాయం వారిది కావచ్చు. కానీ, వైద్యశాస్త్రం ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా.. సృష్టికి ప్రతిసృష్టి జరుగుతున్న కాలంలోనూ.. ఆరోగ్య కారణంతోనో, ఇంకో సమస్యతోనో ఓ మహిళ మాతృత్వానికి ఎందుకు దూరం కావాలి? అనే వాదనలో ఎంత నిజం ఉందో.. పేదింటి మహిళలే సంపన్న గృహిణులకు పిల్లలను కనిపెట్టే యంత్రాలుగా ఎందుకు మిగలాలి? అన్న ఆవేదనలోనూ అంతే అర్థం ఉంది. సినీనటి నయనతార ఉదంతంతో సరోగసీ చర్చ మరోసారి రచ్చ అవుతున్నది. అంతే!
ముద్దులొలికే బుజ్జాయిల్ని ఎత్తుకోవాలనీ, ముచ్చటైన సంసారాన్ని ఏర్పాటు చేసుకోవాలనీ ఏ జంటైనా కోరుకుంటుంది. కానీ ప్రతిసారీ అనుకున్నవి జరగవు. కోరుకున్నవి సులువుగా దక్కవు. అందుకే తమ కలల పాపాయిని ఎలాగైనా ఒడిలోకి తీసుకోవాలని ఆసుపత్రుల గడపలు ఎక్కిదిగుతుంటారు ఎంతోమంది. ఇక, ఏ ఫెర్టిలిటీ సెంటర్లూ తమ సమస్య తీర్చలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎంచుకుంటున్న చివరి మార్గం… సరోగసీ. అదే, అద్దె గర్భం! ఇక్కడ బిడ్డ తల్లిదండ్రులు ఒకరైతే, జన్మనిచ్చేది మరొకరు. ఇందులో ఆధునిక వైద్య పరిజ్ఞానం ఇమిడి ఉంటుంది. అంతకు మించిన భావోద్వేగమూ ముడిపడి ఉంటుంది. ప్రపంచంలో చాలా జంటలు సరోగసీకి వెళ్లినా సెలబ్రిటీల విషయాలే ఎక్కువగా చర్చకు వస్తుంటాయి. అంతకు ముందు బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, ప్రియాంక చోప్రా, ప్రీతిజింతా.. ఇలా చాలా మంది సరోగసీ ద్వారా పిల్లల్ని పొందిన వారే. ఇటీవల నయనతార జంటకు కవలపిల్లల విషయం కూడా తెరమీదికి వచ్చింది. ఏదిఏమైనా అద్దె గర్భాన్ని ఎంచుకోవడానికి ఎవరి కారణాలు వారికి ఉంటాయన్నది మాత్రం నిజం.
ఎందుకు సరోగసీ?
పసిపిల్లలు ఇంట్లో దోగాడాలని కోరుకోని జంట ఉండదు. వాళ్ల తల్లిదండ్రులూ ఆశ పడతారు. సమాజం నుంచీ ఎన్నో ప్రశ్నల్ని ఎదుర్కొంటారు. అయితే ఆశలెప్పుడూ నిజాన్ని మార్చలేవు. అలాంటప్పుడు మరోదారి వెతుక్కోవలసిందే. అలాంటిదే సరోగసీ. దీన్ని ఎంచుకుంటున్నది ఎక్కువ శాతం సంతానలేమితో బాధ పడుతున్న జంటలే. ఇద్దరిలో ఎవరో ఒకరికి తీవ్ర లోపం ఉండటం వల్ల పిల్లలు కలిగే పరిస్థితి లేనప్పుడు సరోగసీ వైపు మొగ్గు చూపుతున్నారు. గర్భాశయం లేకపోవడం, ఉన్నా దాని నిర్మాణం బిడ్డ ఎదుగుదలకు అనుకూలంగా ఉండకపోవడం, తల్లికి గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, తీవ్రమైన మధుమేహం, క్యాన్సర్లాంటి తీవ్ర సమస్యలు ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన బిడ్డను పొందడానికి ఈ విధానం వైపు మొగ్గు చూపుతున్నారు. మరికొంత మంది సెలబ్రిటీలు తమకున్న పరిస్థితులు, బిజీ షెడ్యూళ్ల కారణంగా నేరుగా బిడ్డను కనలేమని భావించి సరోగసీ వైపు మళ్లుతున్నారు. పరిస్థితులు ఏవైనా నేరుగా తమ బిడ్డను తాము నవ మాసాలూ మోసి కనలేకపోయినా, పేగు తెంచుకు పుట్టిన బిడ్డ కాకపోయినా రక్త స్పర్శ తమదేన్న సంతృప్తి వీళ్లది.
చూడాలని ఉంది.. కేస్స్టడీ-1
నా పేరు సుస్మిత. మాది నిరుపేద కుటుంబం. మా ఆయన ఆటో డ్రైవర్. మాకు నలుగురు పిల్లలు. వాళ్ల చదువులు ఓ భారమని అనుకుంటే, మా ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా మరిన్ని అప్పులపాలయ్యాం. ఆ సమయంలోనే సరోగసీ గురించి తెలిసింది. ఓ సంపన్న కుటుంబానికి చెందిన మహిళ గర్భాన్ని మోస్తే డబ్బు ఇస్తామన్నారు. మొదట తప్పనిపించింది. కానీ నా కూతురికే ఆ పరిస్థితి వస్తే? అనే ఆలోచన వచ్చింది. నా డబ్బు అవసరాలు పక్కన పెడితే.. ఒక కుటుంబానికి సాయం చేసినట్టూ ఉంటుంది. అందుకే ఒప్పుకొన్నా. బిడ్డ నా కడుపులో ఉన్నన్నాళ్లూ కంటికి రెప్పలా చూసుకున్నా. కడుపులో పిల్లలు కదులుతుంటే.. తల్లికి ఒక రకమైన ఆనందం, ఇదీ అని చెప్పలేని అనుభూతి. నా బిడ్డ కాదని తెలిసినా..
ఆ మాతృత్వ అనుభూతిని పొందాను. ఎప్పుడూ పొట్టలోని పాపాయి ఎలా ఉంటుందో అన్న ఆలోచనే. కానీ కాన్పు అయ్యాక నేను మత్తులో ఉండగానే ఆ బిడ్డను తీసుకెళ్లిపోయారు. తాకడం సంగతి పక్కన పెడితే కనీసం చూడనైనా చూడలేదు. ఆ బిడ్డ ఆడా, మగా.. అని కూడా తెలియదు. ఇదేమాట డాక్టరును చాలాసార్లు అడిగాను, ‘నువ్వు ఇవన్నీ అడగకూడదు…’ అని సమాధానం చెప్పింది డాక్టరమ్మ. నాకు ఏడుపు వచ్చేసింది. కొన్ని నెలలపాటు కోలుకోలేకపోయాను. ఇప్పటికీ ఆ బిడ్డ పుట్టిన రోజున నేను పాయసం వండుతాను. గుడికి వెళ్లి అర్చన చేయిస్తాయి. ఆ చిన్నారి ఎక్కడున్నా సరే, బాగుండాలని కోరుకుంటాను. ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటూ వస్తుందనీ.. ఈ అమ్మకాని అమ్మను ‘అమ్మా’ అని పిలుస్తుందనీ నా ఆశ!
అమ్మమ్మ అమ్మయితే.. కేస్స్టడీ-2
తాను జన్మనిచ్చిన పాపాయి.. పెరిగి పెద్దయి మరో బిడ్డకు తల్లి కావడం ఏ అమ్మకైనా ఆనందాన్నిచ్చే విషయమే. కానీ, ఏ కారణంతోనో కన్నకూతురు పిల్లల కోసం ఇబ్బంది పడుతుంటే మాత్రం.. అమ్మ మనసు తల్లడిల్లిపోతుంది. అలాంటి వాళ్లలో ఒకరు సూరత్కు చెందిన శోభనా బెన్. ఆమె కూతురు భువన గర్భాశయం లేకుండానే జన్మించింది. దీంతో భువన తల్లే తన కూతురి బిడ్డలకు సరోగసీ పద్ధతిలో జన్మనిచ్చింది. చెన్నైలోని ఒక యువతికి కూడా మొదటి గర్భం నిలబడలేదు. అదే సమయంలో గర్భాశయాన్నీ తీసేయాల్సి వచ్చింది. దీంతో ఆమె తల్లి సరోగసీ ద్వారా బిడ్డకు ప్రాణంపోసింది. గత జూలైలో ఓ యాభై ఏండ్ల మహిళ తన కూతురి కోసం సరోగసీ మదర్గా మారిందన్న వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి. మరోసారి అమ్మతనాన్ని ఆస్వాదించడమే కాదు.. సరోగసీ ద్వారా కూతురికీ అమ్మతనాన్ని రుచిచూపిస్తున్నారు కొందరు తల్లులు! నిజమే, ఆ వయసులో గర్భాన్ని ధరించడం ప్రకృతికి సవాలు విసరడమే. అయినా, మాతృత్వ మమకారం చిరునవ్వుతో సిద్ధ పడుతుంది.