దేవికా ఛటర్జీ.. పదహారణాల భారతీయ వనిత, బెంగాలీ మహిళ. పెండ్లి తర్వాత భర్తతో కలిసి నార్వే వెళ్తుంది. అక్కడా తన మూలాల్ని మరిచిపోదు. సాధ్యమైనంత వరకూ బెంగాలీలోనే మాట్లాడుతుంది. రోజూ బెంగాల్ కాటన్ చీరలే కడుతుంది. పొద్దున్నే కలకత్తా కాళికను పూజిస్తుంది. భోజనంలో జలపుష్పాలు ఉండాల్సిందే. నిక్షేపంగా చేత్తో భోజనం చేయాల్సిందే. తన అలవాట్లనే పిల్లలకూ నేర్పుతుంది.
ఆ విషయం నార్వే ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్తుంది. ఓ భారతీయ మహిళ తమ దేశాన్నీ, జాతినీ అవమానిస్తున్నదని అపోహపడతారు. ఎందుకంటే, నార్వేలో చేతితో తినడాన్ని, తినిపించడాన్ని అనాగరికమైన అలవాటుగా భావిస్తారు. ఒకే పడక మీద తల్లీపిల్లలు పడుకోవడమూ అనారోగ్యకరమే అంటారు. వీటన్నిటినీ సాకుగా చూపి.. పిల్లల్ని దేవిక నుంచి దూరం చేస్తారు.
చైల్డ్ కేర్ సర్వీస్కు తరలిస్తారు. దీంతో ఆ తల్లి మనసు విలవిల్లాడుతుంది. తనకు న్యాయం చేయమంటూ కోర్టును ఆశ్రయిస్తుంది. ఈ వ్యవహారం ఇరు దేశాల రాయబార కార్యాలయాల వరకూ వెళ్తుంది. ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దాదాపు పదేండ్ల క్రితం.. పత్రికల ప్రధాన కథనాలకు ఎక్కిన ఈ అంశాన్ని ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ పేరుతో సినిమాగా తీశారు. రాణీ ముఖర్జ్జీ ప్రధాన పాత్ర పోషించారు. ‘నేను మంచి తల్లినా, కాదా అనే విషయం పక్కనపెట్టండి. అన్నిటికంటే ముందు నేనో తల్లిని అనే విషయాన్ని గుర్తించండి చాలు’ అంటూ దేవిక చేసే విజ్ఞప్తి ప్రేక్షకుల గుండెల్ని కదిలిస్తుంది.