వాషింగ్టన్: ఇండియాలో వ్యాక్సిన్ల కోసం జనం అల్లాడుతుంటే.. అమెరికాలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. అక్కడి ఫెడరల్ ప్రభుత్వం పంపిస్తున్న లక్షలాది డోసుల వ్యాక్సిన్లను రాష్ట్రాలు నిరాకరిస్తున్నాయి. యూఎస్లో వ్యాక్సిన్లు తీసుకునే వారి సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. మార్చి తర్వాత తొలిసారి అమెరికాలో రోజువారీ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 20 లక్షల కంటే దిగువకు రావడం గమనార్హం. ఫెడరల్ ప్రభుత్వం తమకు కేటాయించిన మొత్తం 1,62,680 డోసుల్లో తమకు కేవలం 8 శాతం మాత్రమే చాలని విస్కాన్సిన్ రాష్ట్రం చెప్పిందంటే వ్యాక్సిన్లకు డిమాండ్ ఏమేర పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
అయోవా రాష్ట్రం తమకు 29 శాతం చాలని చెప్పగా, ఇలినాయిస్ 9 శాతం చాలని చెప్పేసింది. ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, వాషింగ్టన్ స్టేట్, కనెక్టికట్ రాష్ట్రాలు కూడా తమకు అన్ని వ్యాక్సిన్ డోసులు అవసరం లేదని ఫెడరల్ ప్రభుత్వానికి చెబుతున్నాయి. అమెరికాలో కేసులు తగ్గడం, వ్యాక్సిన్లకు డిమాండ్ పడిపోవడంతో ఆ మిగిలిపోయిన వ్యాక్సిన్లను ఇండియాలాంటి దేశాలకు ఇవ్వాలని బైడెన్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి పెరిగిపోతోంది.
ధనిక దేశాల్లో ఇప్పటి వరకూ 83 శాతం మందికి వ్యాక్సిన్లు వేయగా.. పేద దేశాల్లో మాత్రం కేవలం 0.3 శాతం మందికి మాత్రమే వేశారు. దీనిని బట్టి వ్యాక్సిన్ల విషయంలో ఏ స్థాయిలో అసమానతలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో డిమాండ్ పడిపోవడం అనేది ఊహించిందే అని జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫిజిషియన్ డాక్టర్ అమేష్ అన్నారు. వ్యాక్సిన్ల కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న వాళ్లకు వాటిని వేసిన తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియ సవాలుగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్లంటే ఇప్పటికీ భయపడుతున్న వాళ్లు లేదంటే ఇతర సాకులు చెబుతున్న వాళ్లు ఎక్కువ కావడంతో డిమాండ్ పడిపోయినట్లు తెలిపారు.
అయితే న్యూయార్క్ సిటీ, మేరీల్యాండ్, కొలరాడోలాంటి రాష్ట్రాలు మాత్రం ఇప్పటికీ తమకు రావాల్సిన మొత్తం కోటాను అడుగుతున్నాయి. డిమాండ్ పెరగాలంటే వ్యాక్సిన్ను ప్రజలకు మరింత చేరువ చేయాలని, అవసరమైతే ప్రతి ఇంటికీ వెళ్లి ఇవ్వాలని డాక్టర్ అమేష్ అన్నారు.